CM KCR | తరతరాల నుంచి అణచివేతకు, వివక్షకు గురైన జాతి దళిత జాతని.. స్వతంత్రం వచ్చిన కొత్తలోనే వారి కోసం స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకువచ్చి ఉంటే ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదని సీఎం కేసీఆర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు బీఆర్ఎస్ నడకేందో రైతులు, పేదలు గురించి ఏ విధంగా పని చేస్తున్నదో అందరికీ తెలుసు. రైతుల కోసం తీసుకువచ్చి రైతుబంధు, దళితుల కోసం పెట్టిన దళితబంధు పథకాల గురించి మన చెవులతో ఎప్పుడూ వినలేదు. దళితజాతి యుగయుగాలు, తరతరాల నుంచి అణచివేతకు గురైన, వివక్షకు గురైన జాతి.
స్వతంత్రం వచ్చిన కొత్తలోనే స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకువచ్చి ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇప్పటికీ దళితజాతి బాగుపడేది. అది జరుగలేదు. దళితులను ఎంత సేపూ అమ్మపేరు, బొమ్మపేరు చొప్పి ఓటు బ్యాంకులా వాడుకున్నారు తప్ప ప్రగతి కోసం బాటలు వేయలేదు. దఫదఫాల వారిగా సముద్ధరణ జరగాలని దళితబంధు స్కీమ్ను తీసుకువచ్చాం. ఈ పథకాన్ని పుట్టించిందే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ గవర్నమెంట్. ప్రతి కుటుంబానికి సహాయం అందే వరకు ఆ కార్యక్రమం కొనసాగుతుందని దళితజాతి, బిడ్డలకు మనవి చేస్తున్నా’నన్నారు.
‘గతంలో ఆడబిడ్డలు డెలివరీ కావాలంటే ప్రైవేటు హాస్పిటల్స్లో భయంకరమైన దోపిడీ ఉండేది. అమ్మ ఒడి వాహనాలు, కేసీఆర్ కిట్ పెట్టిన తర్వాత బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరుగుతున్నయ్. క్షేమం ఉన్నది. దోపిడీ తగ్గింది. విద్యా వ్యవస్థ పరిశీలిస్తను గురుకుల పాఠశాలలను పెట్టుకున్నాం. ఇవన్నీ కళ్ల ముందే ఉన్నాయ్. మీ గ్రామాల పిల్లలు చదువుతున్నారు. అన్నివర్గాల కోసం తీసుకువచ్చాం. గిరిజనులు, దళితులు, బీసీల కోసం, ముస్లిం మైనారిటీల కోసం రెసిడెన్షియల్ కాలేజీలు 1015 పెట్టుకున్నాం. పిల్లలు నీట్లో సీట్లు సంపాదిస్తున్నారు.
చాలామంది పిల్లలకు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో ఇంజినీరింగ్, డాక్టర్ సీట్లు వస్తున్నయ్. ఇలా అనేక రకాలుగా విద్య, వైద్యం, రవాణారంగం, మంచినీటి రంగంలో, విద్యుత్రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించాం. గతంలో జరిగిన అభివృద్ధి.. ఇప్పుడు జరిగిన బేరీజు చేయాలి. ఏ టైమ్లో ఏ ప్రభుత్వం దృష్టి ఎటు ఉన్నది. రైతుల గురించి ఏం జరుగుతుంది. సంక్షేమం ఏ విధంగా ఉంది. మౌలిక వసతులు ఎలా ఉన్నయ్.. ఆలోచించి ఓటు వేయాలి. మంచి పద్ధతిలో, బాటలో ముందుకెళ్తున్న తెలంగాణను మరింత ముందుకు తీసుకుపోవాలి’ అని పిలుపునిచ్చారు.