హరహర మహాదేవ అంటూ మదినిండా ముక్కంటిని నింపుకోవచ్చు.. పుడమితల్లి పచ్చని పొత్తిళ్లలో పసిమనసులై సేదతీరవచ్చు. ప్రశాంతమైన వనమాత ఒడిలో పక్షుల కిలకిలారావాలను ఆస్వాదించవచ్చు. కొండరాళ్లతో చెట్లకొమ్మలు చెప్పే చిలిపి ముచ్చట్లను విని మురిసిపోవచ్చు. అందుకు కీసర రారమ్మని ఆహ్వానం పలుకుతున్నది. పరమశివుడు కొలువై ఉన్న ఈ ప్రాచీన అద్భుత ఆధ్మాత్మిక కేంద్రం ఇప్పుడు పచ్చని అడవులతో చూడచక్కని అందాలతో పర్యాటక కేంద్రంగా మరింత వృద్ధిచెందింది. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చొరవతో ఈ ప్రాంతం కొత్తశోభను సంతరించు కొంటున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఆధ్యాత్మిక ప్రాంతంగా భాసిల్లుతున్న కీసర.. నేడు పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్నది. పక్షుల కిలకిల రావాలు, హరితహారంతో స్వాగతం పలుకుతున్న చెట్లు, స్వేచ్ఛగా తిరుగాడే జంతువులు, సుందరంగా తయారైన చెరువులు, అడవిని అంతెత్తునుంచి వీక్షించేలా కొండపై వ్యూ పాయింట్స్, అచ్చం ప్రకృతి సంపదతో నిర్మించిన అనుభూతి కలిగించే ఆర్నమెంటల్ ఫెన్సింగ్, ఆరోగ్యాన్ని పంచే ఔషధ మొక్కల కూడళ్లు, నలువైపులా పరుచుకున్న పచ్చదనం.. ప్రకృత్రి ప్రేమికులకు కనువిందు చేస్తున్నది. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్ ఇచ్చిన మాట ప్రకారం కీసర రిజర్వ్ ఫారెస్ట్ను అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. ఎంపీ నిధులతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చుతున్నారు. సుమారు 1,562 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవికి హరితహారం మొక్కలు మరింత అందాన్నిస్తున్నాయి.
మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్ చాలెంజ్లో భాగంగా కీసర గుట్ట రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాన్ని 2019లో ఆగస్టు 31న దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు. ఎంపీ నిధులతో ఎకో టూరిజం, చెరువుల సందరీకరణ పనులు చేపట్టారు. హరితహారంతో అడవికి జీవం పోశారు. స్వచ్ఛమైన గాలిని అందించేలా లంగ్స్పేస్ ఏర్పాటుకు శ్రీకారంచుట్టారు. ఉన్నాతాధికారులతో తరుచూ సమావేశాలు నిర్వహిస్తూ అటవీ ప్రాంత వృద్ధికి పాటుపడుతున్నారు.
కీసరలోని ప్రసిద్ధ రామలింగేశ్వరస్వామి దేవాలయం సన్నిధికి కొంత దూరంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్షలలో మొక్కలు నాటారు. స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఆ మొక్కలు, ఇప్పటికే పెరిగిన చెట్లు అతిథుల్లా స్వచ్ఛమైన గాలితో పలకరిస్తున్నాయి. చల్లనిగాలులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత శోభితం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి అరగంటలో ఈ అరణ్యానికి చేరుకోవచ్చు. ఒకప్పుడు దైవదర్శనం కోసమే వచ్చేవారు, ఇప్పుడు పర్యాటక వృద్ధితో కుటుంబసమేతంగా కీసర అందాలను చూసేందుకు వస్తున్నారు. అభివృద్ధి పరుగులతో కీసర పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఎంపీ సంతోష్కుమార్ మార్గదర్శకత్వంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కీసర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నారు.
పెద్ద చెరువుకు ఎదురుగా ఉండే ఎకో ఫారెస్ట్ కొండలపై ఏర్పాటుచేసిన గెజిబో (వ్యూపాయింట్) కీసర పర్యాటకంలో సరికొత్త అనుభూతిని అందించనున్నది. వెదురు, చెక్కతో రూపొందించినట్టు అనుభూతి కలిగించేలా ఆర్నమెంటల్ విధానంతో వ్యూపాయింట్ను నిర్మించారు. కిందినుంచి 86 మెట్లు ఎక్కితే మనం వ్యూపాయింట్కు చేరుకొంటాం. 16 మంది కూర్చునేలా దీనిని నిర్మించారు. గూనెపెంకల కప్పుతో ఉన్నట్టుగా గెజిబో పైభాగం దర్శనమిస్తున్నది. ట్రాఫిక్ రణగొణ ధ్వనులు లేని ఆ ప్రాంతంలో కేవలం పక్షుల కిలకిలారావాలు, చెట్ల కదలికల సవ్వడులు మాత్రమే చెవులకు వినిపిస్తాయి. మనసుకు ప్రశాంతత చేకూర్చే ఈ ఎకో ట్రిప్ ఆద్యంతం మేఘాల్లో తేలిన అనుభూతి కలిగిస్తుంది. వ్యూపాయింట్ పక్కన ఏర్పాటుచేసిన జిరాఫీ బొమ్మ సందర్శకులకు కనువిందు చేస్తున్నది. వ్యూపాయింట్ నుంచి ప్రధాన రోడ్డుకు అవతల ఉన్న పెద్ద చెరువు అందాలను వీక్షించడం గొప్ప అనుభూతినిస్తున్నది. మరోవైపు నూర్ మహ్మద్కుంట పిక్నిక్ స్పాట్కు అనువైన వేదికగా నిలుస్తున్నది.
కీసర రక్షిత అడవిలో ఉన్న పెద్దచెరువు పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. 20 ఎకరాల విస్తీర్ణంలో చెరువు కీసర ప్రధాన రోడ్డును ఆనుకొని ఉంటుంది. చెరువు చుట్టూ ఏర్పాటుచేసిన కంచెను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఆర్నమెంటల్ (సిమెంట్) విధానంలో రూపొందించిన ఆ ఫెన్సింగ్ చూపరులను ఆకట్టుకుంటున్నది. కంకమొద్దులతో(బాంబూస్-వెదురు) రూపొందించినట్టుగా దర్శనమిచ్చే ఆ సిమెంట్ ఫెన్సింగ్ సందర్శకులను ఆశ్చర్యపరుస్తున్నది. చేపల ద్వారం, మెట్లు, వాక్ బ్రిడ్జి, మర్రిచెట్టు కింద నాలుగు పిల్లర్లపై నెమలి బొమ్మలతో ఏర్పాటుచేసిన వ్యూ పాయింట్ పందిరి నిర్మాణాలు ప్రకృతి ప్రేమికులను రెప్ప వాల్చనివ్వవు. చెరువును ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో పొడపత్రి, తిప్పతీగ, వాము, వావిలి, చిల్ల, విషాముష్టి, సర్పగంధ, నల్లేరు, తులసి, అడ్డసరము తదితర వంద రకాల ఔషధ మొక్కలు నాటారు. ఆ మొక్కల మధ్య ఏర్పాటుచేసిన ట్రైసెరాటోప్స్ (డైనోసర్ మాదిరిగా కనిపించే) అరుదైన జంతువు బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నది. ఒకప్పుడు బోసిపోయిన చెరువు నేడు కొత్త అందాలతో కళకళలాడుతున్నది. మరికొన్ని రోజుల్లో ఈ చెరువు సౌందర్యాన్ని పర్యాటకులు పూర్తిస్థాయిలో ఆస్వాదించనున్నారు.