నారాయణపేట/మక్తల్/గద్వాల/దేవరకద్ర, నవంబర్ 6: రహదారులపై జనంబారులు.. తండోపతండాలుగా శ్రేణులు.. బ్యాండు మేళాల చప్పుట్లు.. ఈలలు, కేకలతో కేరింతలు.. గులాబీ జెండాల రెపరెపలు.. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ నినాదాలు.. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ జోష్ నిండింది. దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేటలో సోమవారం సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలకు జనం పోటెత్తారు. ఎటుచూసినా కిక్కిరిసిపోయారు. మూడు జిల్లాలు, నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన ఈ సభలు విజయవంతం అయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హాజరైన సభకు జనం వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్ర సాంస్కృతిక, క్రీడ, పర్యాటక, ఎక్సైజ్ శాఖ లమంత్రి శ్రీనివాస్గౌడ్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్న ఈ సభ ఆద్యంతం ఉత్సాహభరింగా సాగింది. అనంతరం గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న సభకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తండోపతండాలుగా తరలివచ్చారు. బ్యాండ్ మేళాల చప్పుళ్ల నడుమ నృత్యాలు చేస్తూ ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఊహించిన దాని కంటే ప్రజలు స్వచ్ఛందగా అధికంగా సంఖ్యలో తరలిరవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. మక్తల్కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకోగా స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సభ జరిగింది. మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డితోపాటు పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు హాజరయ్యారు. మెడలో బీఆర్ఎస్ కండువా, చేతిలో గులాబీ జెండాలతో యువతీ, యువకులు, మహిళలు కేరింతలు కొడుతూ రహదారుల వెంబడి నృత్యం చేశారు. జై తెలంగాణ.. జైజై కేసీఆర్.. చిట్టెం రామన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం నారాయణపేటకు జననేత కేసీఆర్ చేరుకున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సభకు ఊహించిన దానికన్నా జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ జరగాల్సి ఉండగా ముఖ్య మంత్రి ప్రయాణించాల్సిన హెలిక్యాప్టర్లో ఏర్పడిన సాంకేతికలోపంతో నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చినప్పటికీ జనం ఓపికతో వేచి ఉండి, కేసీఆర్ ప్రసంగం ముగిసే వరకు ఉండటం విశేషం. ఈలోగా కళాకారులు ఆటపాటలతో అలరించారు.