హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రతి ఒక్క పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఈ శతాబ్దపు అతి పెద్ద అబద్ధమని పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ నాయకులు దిగజారుడు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గత ఏడేండ్లలో దేశానికి ఎన్డీయే చేసిందేమీ లేదని, విద్వేష రాజకీయాలు తప్ప వారికి చెప్పుకోవడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. తాను జాతీయ రాజకీయాల్లోకి రానని, తెలంగాణ ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని స్పష్టంచేశారు. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలతోపాటు ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సినిమా, క్రీడలు వంటి అనేక అంశాలపై స్పందించారు. ఈ సెషన్ జాతీయస్థాయిలో ట్విట్ట ర్ ట్రెండింగ్లో మొదటిస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ మంత్రి కేటీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ హామీపై ఒక్క మాటలో స్పందించాలని ఓ నెటిజన్ కోరగా.. ‘జుమ్లా ఆఫ్ ద సెంచరీ’ (ఈ శతాబ్దానికే అతి పెద్ద అబద్ధం) అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘బీజేపీ ఏడేండ్లుగా అధికారంలో ఉన్నా ఇప్పటికీ మత విద్వేషాల చుట్టే తిరుగుతున్నది తప్ప.. ఇదీ మేం చేసిన అభివృద్ధి అని చూపించుకునే స్థితిలో ఎందుకు లేదు?’ అని నెటిజన్ ప్రశ్నించగా.. ‘వాళ్లు ఏమీ చేయలేదు కాబట్టి చెప్పుకోలేరు’ అని బదులిచ్చారు. హైదరాబాద్ను భాగ్యనగర్గా మారుస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. ‘సిల్లీ పొలిటికల్ స్టంట్’గా (చిల్లర రాజకీయాలు) కొట్టిపారేశారు. తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులని ప్రతిపక్షాలు చేస్తున్న విద్వేష, అసత్య ప్రచారాన్ని అర్థం చేసుకోగలరని అన్నారు. ఏది నిజమో, ఎవరు రాష్ట్రం కోసం కృషిచేస్తున్నారో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. ఎలాగైనా తెలంగాణలో బలపడాలని బీజేపీ విపరీతంగా ప్రయత్నిస్తున్నదని, దీన్ని ఎలా అడ్డుకొంటారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘మేము అభివృద్ధి ప్రస్థానాన్ని కొనసాగిస్తాం. తెలంగాణకు శాంతి, అభివృద్ధి, సుస్థిరత కావాలి’ అని కేటీఆర్ సమాధానమిచ్చారు. ఐటీ రంగంలో హైదరాబాద్ కన్నా పుణె ముందు వరుసలో ఉన్నదంటూ అసత్య ప్రచారంచేస్తున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలపై చర్యలు తీసుకోవాని ఓ నెటిజన్ కోరగా.. మూర్ఖులను వదిలేయడమే మంచిదంటూ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు.
దేశ ప్రయోజనాలకోసం సీఎం కేసీఆర్ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తున్నారని, మరి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘భవిష్యత్తును ఎవరు ఊహించగలరు?’ అంటూ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. యూపీలో బీజేపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజ్వాదీ పార్టీలో చేరుతున్నారని, దీనిని బట్టి అక్కడ ఎస్పీకి అనుకూల పవనాలు వీస్తున్నట్టున్నదని అభిప్రాయపడ్డారు. అక్కడ బీజేపీని ఓడించేందుకు ఎస్పీతో కలిసి ప్రచారం చేయడంపై సంప్రదింపుల అనంతరం స్పందిస్తానని చెప్పారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో అక్రమంగా రోడ్లను మూసివేయడాన్ని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో, ఇతర జాతీయ వేదికలపై లేవనెత్తుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. సుచిత్ర జంక్షన్ ఫె్లై ఓవర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, బహదూర్పుర ఫె్లైఓవర్ పనులు త్వరలోనే పూర్తి అవుతాయని చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకే ప్రభుత్వం లాక్డౌన్ లేదా నైట్ కర్ఫ్యూపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం, ధర్మారం గ్రామానికి చెందిన జోగు శాంతికుమార్ అనే యువకుడు తనకు కాలికట్ ఎన్ఐటీలో సీటు వచ్చిందని, ఆర్థిక సహాయం చేయాలని కోరగా.. తప్పకుండా చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దేవరకొండ కోట సంరక్షణపై మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడుతానన్నారు. ఏప్రిల్ నెలాఖరుకు ఫైబర్నెట్ తొలి దశ పూర్తవుతుందన్నారు.
నెటిజన్: తనతో చర్చకు రావాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు.
కేటీఆర్: నేను 420లతో, నేరస్థులతో చర్చలు జరుపను. ఆయన ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో చర్చలు జరిపితే బాగుంటుంది.
నెటిజన్: మిమ్మల్ని కేంద్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా చూడాలని ఉన్నది.
కేటీఆర్: తెలంగాణ ప్రజలకు సేవ చేయడమే నాకు ఇష్టం.
నెటిజన్: రాజకీయాలు మీకు బోర్ కొడుతున్నాయా?
కేటీఆర్: రాజకీయ ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ బోర్ కొట్టదు. మీలాంటి మంత్రిని కలిగి ఉన్నందుకు తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు. మా రాష్ట్రంలో ఇలా ఒక మంత్రితో కూడా నేరుగా మాట్లాడే అవకాశమే లేదు. ఇక్కడి అధికార పార్టీ నాయకులు దర్పాన్ని ప్రదర్శించడానికే పరిమితం అవుతున్నారు
–ఆశిష్సింగ్యాదవ్, ఉత్తరప్రదేశ్
కేటీఆర్: తెలంగాణ ప్రజల ప్రతినిధిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.
తెలంగాణకు కేంద్రం మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందంటూ కొందరు చేస్తున్న ప్రచారంపై స్పందించాలని ఓ నెటిజన్ కోరగా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను కూడా మంజూరుచేయలేదంటూ మంత్రి కేటీఆర్ ఒక జాబితాను విడుదల చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన వర్సిటీనే ఇంకా ఇవ్వలేదంటూ చురక అంటించారు.