జగిత్యాల, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారమేనని మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు గ్యాదరి బాలమల్లు, శ్రీనివాసరెడ్డితో కలిసి జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్న మోతె శివారు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ను బలోపేతంచేసే దిశలో భాగంగా జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని చెప్పారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్ల కాలంలోనే ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. కాంగ్రెస్ పోవాలి.. బీఆర్ఎస్ రావాలి..’ అన్న ఆలోచన ప్రజల్లో వచ్చిందని తెలిపారు. ప్రజల మేలుకోసం కేసీఆర్తో కలిసి నడిచే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఈ నెల 20న జగిత్యాలలో జనహిత సభ నిర్వహిస్తామని, కేసీఆర్ సమక్షంలో ప్రజాఆకాంక్ష మేరకు బీఆర్ఎస్లో చేరుతానని ప్రకటించారు.
సమస్యలపై కేసీఆర్ సమరశంఖం: కొప్పుల
రెండున్నరేండ్లుగా ప్రజలు పడుతున్న సమస్యలపై జగిత్యాల జనహిత బహిరంగ సభ వేదికగా కేసీఆర్ సమరశంఖం పూరిస్తారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మాజీ మంత్రి జీవన్రెడ్డి పట్ల కాంగ్రెస్ నాయకత్వం, రేవంత్రెడ్డి అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. జీవన్రెడ్డి చేరిక నేపథ్యంలోనే జగిత్యాలలో నిర్వహించే సభావేదికగా కేసీఆర్ ప్రజలకు కలుగుతున్న అవస్థలు, సమస్యలపై సమరశంఖాన్ని పూరిస్తారని వివరించారు.
కేసీఆర్ను సీఎం చేయడమే లక్ష్యం: రమణ
తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ను 2028లో మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. జనహితం కోసం జీవన్రెడ్డి కాంగ్రెస్ను వీడి, బీఆర్ఎస్తో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరించారని, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించినా ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని ధ్వజమెత్తారు.
కేసీఆర్, జీవన్రెడ్డి బాటలో నడుస్తాం: ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల
అధికార దాహంతో ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి నాయకులు వెళ్లడాన్ని సహజంగా చూస్తామని, అందుకు భిన్నంగా అధికార పార్టీ నుంచి మాజీమంత్రి జీవన్రెడ్డి ప్రతిపక్ష పార్టీలోకి రావడం ఆశ్చర్యంగా ఉందని ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అకుంఠిత దీక్ష కలిగిన జీవన్రెడ్డిలాంటి నాయకుడు తెలంగాణ రథసారథి కేసీఆర్తో కలిసి పనిచేయడానికి సమ్మతించడం సంతోషంగా ఉందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజాకాంక్షలను అందుకోవడంలో వెనుకబడిందన్న భావంతోనే జీవన్రెడ్డి బీఆర్ఎస్పై నమ్మకం ఉంచారని వివరించారు. ఉద్యమ నాయకుడు, దార్శనికుడైన కేసీఆర్, నిబద్ధత, నిజాయితీ కలిగిన జీవన్రెడ్డి మార్గదర్శనంలో తాము పనిచేస్తామని చెప్పారు.
లక్షమందితో జనహిత సభ: విద్యాసాగర్
కాంగ్రెస్కు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు జీవన్రెడ్డి బీఆర్ఎస్లోకి రాబోతుండటం శుభసూచకమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు పేర్కొన్నారు. రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న జీవన్రెడ్డి, వాటి పరిష్కారానికి బీఆర్ఎస్తో కలిసి నడవడం సంతోషంగా ఉందన్నారు. జీవన్రెడ్డి చేరిక నేపథ్యంలో ఈ నెల 20న మోతె శివారులో లక్ష మందితో ఉత్తర తెలంగాణ స్థాయిలో జగిత్యాల జనహిత సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభలో ప్రజల సమస్యలపై స్పందిస్తారన్నారు.