హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఉమ్మడి పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనలో అభివృద్ధి చేసుకున్నామని పేర్కొన్నారు.
సకలజనుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, సమస్త రంగాల్లో ప్రగతిని సాధిస్తూ, పదేండ్ల అనతికాలంలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుకొన్నామని వివరించారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా సాగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకొని అమలు చేయాలని సూచించారు. తెలంగాణ మరింత ప్రగతిని సాధిస్తూ, పాడి పంటలతో వర్ధిల్లుతూ, రైతులు, సబ్బండ కులాలు, సకలజనుల జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని ఆదివారం ఓ ప్రకటనలో ఆకాంక్షించారు.