KTR | తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాకులపైగా గెలుస్తామని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో మంగళవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ మేరకు.. కేసీఆర్ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. పది సంవత్సరాలల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారు. ప్రజలకు చాలా స్పష్టత ఉంది. ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయి. కేసీఆర్, బీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామరక్ష’ అన్నారు.
‘ప్రతిపక్షల తాపత్రయం రెండవ స్థానం కోసమే. సిట్టింగ్లకు సీట్లు ఇవ్వకుంటే మా దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయి. తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. 65 సంవత్సరాల్లో ప్రతిపక్షాలు పెట్టిన మెడికల్ కాలేజీలు కేవలం రెండే. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదు. నవోదయ పాఠశాల ఇవ్వలేదు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్. ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదు. ఢిల్లీ నుంచి వచ్చి సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితి. ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి మరణహోమం సృష్టించి, మనుషులను చంపిన పార్టీ కాంగ్రెస్. తమ పార్టీ నాయకులపైననే చెప్పులు విసిరి పార్టీ కాంగ్రెస్. తెలుగువారి గౌరవం పీవీ నరసింహారావుపైనే చెప్పులు విసిరిన ఘనత కాంగ్రెస్ది. ఢిల్లీ బానిస పార్టీలు జాతీయ పార్టీలు. ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరు. తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలా ? తెలంగాణ బిడ్డ కావాలా తెలుసుకోవాలన్నారు.
‘కేవీపీ రామచంద్రరావు, షర్మిల, తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారు.. తెలంగాణ ఇవాళ వారు కాంగ్రెస్ను గెలిపిస్తారంట ? తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ, షర్మిల కాంగ్రెస్ను తెలంగాణలో అధికారంలోకి తేస్తాం అంటున్నారు. ఇంతటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది. తెలంగాణ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజలపైన రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ కోసం ముసుగులో వచ్చారు. తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకున్న కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ రామచందర్రావు, షర్మిల వంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారు. బహురూపుల వేషాల్లో తెలంగాణపైకి వస్తున్నారు. వీరందరితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. పదేళ్లు సాధించిన అభివృద్ధిని, తెలంగాణ వ్యతిరేకుల చేతులు పెడదామా? ప్రజలు తెలుసుకోవాలి. పైకి కనబడేది కిషన్ రెడ్డి ఆడించేది కిరణ్ కుమార్ రెడ్డి. కనబడేది రేవంత్ రెడ్డి ఆడించేది కేవీపీ రామచంద్రరావు . తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన కేవీపీ రామచంద్రరావు.. ఈ రోజు తెలంగాణ వాదిగా చెప్పుకోవడం మా కర్మ’ అంటూ కేటీఆర్ అన్నారు.
‘రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు.. తెలంగాణకు పట్టిన వ్యాధి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరైన తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? ఒక్కరన్న రాజీనామా చేశారా? కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయని.. తెలంగాణ ప్రజలు బెదిరించి, మెడలు వంచితే తెలంగాణ ఇచ్చింది. సోనియా ఇచ్చింది అంటే అన్యాయంగా ఉంటుంది. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వారు అని.. బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది అంటే అంత దరిద్రంగా ఉంటుంది. నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా? జీవితాన్ని వెలుగులు నింపిన భారత రాష్ట్ర సమితి సర్కారు కావాలా ?
ఇంత భావ దారిద్య్రం, లేకితనం కలిగిన ప్రతిపక్షాలతో పోటీపడాల్సి రావడమే ఈ రాష్ట్రం దురదృష్టం. తెలంగాణకు మోడీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్ అడగదు.. బీజేపీ అడగదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎక్కడన్నా రూ.4వేల పెన్షన్ ఇస్తుందా చెప్పాలి. 55 సంవత్సరాల్లో రూ.200 దాటి పెన్షన్ ఇవ్వని వారు.. 4వేలు ఇస్తం అంటే ఎట్ల నమ్ముతారు ? అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ వచ్చి చెప్పినా.. ప్రజలకు కాంగ్రెస్ పాత చరిత్ర తెలుసు’నన్నారు.
‘పాలమూరు ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డంకులు సృష్టించిన పార్టీలు ఈ ప్రాజెక్టు ప్రారంభాన్ని ప్రశ్నిస్తున్నాయి. 1963లో నెహ్రూ శంకుస్థాపన చేసిన ఎస్సారెస్పీ కాలువను నిన్నటిదాకా కాంగ్రెస్ నాయకులు ప్రారంభించలేదా ? మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలోని 13,14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఈ ప్రాజెక్టును స్వాగతించాలి. ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించే ధైర్యం లేని పార్టీలు ఈరోజు మాపైన ఎన్నికల్లో పోటీ అంటున్నాయి. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రయత్నంలో భాగంగా ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ ఓ జిమ్మిక్. ఉద్యమంలో భయపడి రాజీనామా చేయకుండా పారిపోయిన వాడు కిషన్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితా అని కలలు కంటే.. ఎవరూ పట్టించుకుంటారు ? దేశంలో మోదీని మా పార్టీ విమర్శించినంతగా ఏ ఇతర పార్టీ అయినా విమర్శ చేసిందా ? కాంగ్రెస్, బీజేపీ అవగాహనలో ఉన్నాయి. అందుకే బీజేపీని కాంగ్రెస్ నాయకులు విమర్శించరు. మా నాయకులపై దాడులు ఈడీలు దాడి చేశాయి. ఒక్క కాంగ్రెస్ నాయకుడిపైనా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేశాయా? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడడానికి ఏం లేదు. పక్కరాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాకు ఏం సంబంధం లేదు. అది వారి తలనొప్పి. మాకు సంబంధం లేదు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.