వెల్గటూర్/ధర్మపురి, సెప్టెంబర్ 7: పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వద్దంటున్న బీజేపీని బొందపెట్టాలని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నివర్గాలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు.
బుధవారం ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురి, వెల్గటూర్ మండల కేంద్రాల్లో కొత్త పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా 57 ఏండ్లకే పింఛన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణలో అర్హులందరికీ రూ. 2 వేల పింఛన్ ఇస్తున్నామని, ప్రధాని మోదీ సొంతరాష్ట్రంలో కేవలం రూ.750, బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్లో రూ.600, మధ్యప్రదేశ్లో రూ.300 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. అక్కడ అభివృద్ధిని విస్మరించిన నాయకులు గద్దల్లాగా తెలంగాణపై పడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.