Kadiyam Srihari | నల్లగొండ ప్రతినిధి : సీఎం కేసీఆర్ను తెలంగాణకే కట్టడి చేయాలని కుట్రలతో తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడం దాచుకోవడమే బీజేపీ విధానమని, అందుకే రాబోయే రోజుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశ రాజకీయాల్లో ఉంటే అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి మోదీ సర్కార్ను గద్దె దింపుతారన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా పీఏపల్లి, నల్లగొండ మండలాల ఆత్మీయ సమ్మేళనంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ రూ.12లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, అదే పేదలకు ఉపయోగ పడే ఒక్క పథకం తేలేదన్నారు. అంతే కాకుండా పేదలకు ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ఉచిత కరెంటు, పెన్షన్లు, రైతుబంధు లాంటి పథకాలను అడ్డుకునేలా ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ సర్కార్ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు వివక్ష చూపుతూ నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మెడికల్ కాలేజీలు, విభజన చట్టంహామీల అమలులోనూ మోదీ సర్కార్ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీ నేతలు.. ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారని ప్రశ్నించారు. తొమ్మిదేండ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధులెన్నో తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ సర్కార్ దేశానికే ఆదర్శవంతంగా తెలంగాణను తీర్చిదిద్దారని, అందుకే దేశం యావత్ తెలంగాణ వైపు చూస్తుందని చెప్పారు. నల్లగొండ జిల్లా కూడా కాంగ్రెస్ హయాంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా నలగొండ అభివృద్ధి చెందుతుందన్నారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు అడ్డం పొడవు ఉండి వాళ్ల ఆస్తులు పెంచుకున్నారే తప్ప.. జిల్లాను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ను పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలోని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ఆ పార్టీల నేతలను నిలదీయాలన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే, మరింత సుభిక్షంగా కావాలంటే మళ్లీ కేసీఆర్ సర్కార్నే రావాలని, అందుకు పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.