అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
రాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్
ములుగు జడ్పీ సమావేశంలో, భూపాలపల్లి జిల్లాలో పల్లెప్రగతిపై సమీక్ష
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం సర్కారు కృషి చేస్తున్నదని వెల్లడి
హాజరైన ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు గండ్ర, పొదెం, ఎమ్మెల్సీ బాలసాని
ములుగు, నమస్తేతెలంగాణ/భూపాలపల్లి రూరల్, జూన్ 29 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారి ప్రగతిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మంగళవారం ములుగులోని జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని, మరోవైపు భూపాలపల్లిలోని సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్లో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత అధ్యక్షతన పల్లెప్రగతిపై సమావేశం నిర్వహించా రు. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే నాలుగో విడుత పల్లె ప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమంపై వారు చర్చించారు. ఈ సమావేశాల్లో మానుకోట ఎంపీ మాలోత్ కవిత, భూపాలపల్లి, భద్రాచలం ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పోదెం వీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పోడు భూముల పట్టాల సమస్యలను పరిష్కరించేందుకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం ద్వారా కృషి చేస్తున్నట్లు సత్యవతి వివరించారు. మండల స్థాయిలో అధికారులు పల్లె ప్రగతిపై సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందిం చి కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. గత మూడు విడుతల్లో చేపట్టిన పల్లె ప్రగతిలో పెండింగ్ పనులను నాలుగో విడుతలో పూర్తి చేయాలని కోరారు. గ్రామాల్లో దళితుల స్థితిగతులను తెలుకొని వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కొత్త పథకానికి రూపకల్పన చేస్తున్నారని ఆమె వివరించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు, మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో రాష్ట్రంలో పట్టణ ప్రగతి పనులు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసిందని సత్యవతి తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2 వేల కోట్లను కేటాయించిందన్నారు.
ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి : మానుకోట ఎంపీ కవిత
పల్లె ప్రగతి అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయి అధికారులకు ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మానుకోట ఎంపీ మాలోత్ కవిత సూచించారు. పెం డింగ్ పనుల పూర్తిలో అలసత్వం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, గ్రామ స్థాయి అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శ్మశాన వాటికలను, పల్లె ప్రకృతి వనాలను గ్రామస్తులు వినియోగించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి తన వార్డు పరిధిలోని సమస్యలను తెలిపేందుకు గ్రామ సభకు హాజరు కాగా సర్పంచ్ భర్త బండారి హరినాథం కొంత మంది వార్డు సభ్యుల భర్తలతో కలిసి సమస్యలను తెలుపకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని డీపీవోతో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జడ్పీ సమావేశంలో అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభీ, జడ్పీటీసీలు పాయం రమణ, తల్లాడి పుష్పలత, కోఆప్షన్ సభ్యురాలు వలియాబీ పాల్గొన్నారు.
ఆరు ఫీట్ల మొక్కలు నాటాలి
గ్రామాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని జయశంకర్భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. పల్లె ప్రగతి పనులను సమర్థవంతంగా నిర్వహించిన గ్రామాలను మండలానికి రెండు చొప్పున ఎంపిక చేసి సంబంధిత గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామన్నారు. హరితహారంలో ఆరు ఫీట్ల మొక్కలను నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, భూపాలపల్లి జడ్పీ వైస్ చైర్పర్సన్ కల్లెపు శోభారఘుపతి, డీఆర్డీవో పురుషోత్తం, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి : ఎమ్మెల్యే గండ్ర
నాలుగో విడుత పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి, స్థానిక సమస్యలు పరిష్కరించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. హరితహారం లో రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా సీఎం కేసీఆర్ గ్రామాలు, పట్టణాల్లోని సమస్యల పరిష్కారానికి మంత్రికి రూ.2 కోట్లు, కలెక్టర్కు రూ.కోటి, ఎమ్మెల్యేకు ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి సింగరేణి సంస్థ సహకారం తీసుకోవాలని ఆయన కోరారు.