KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): భారతదేశ మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ, ఆర్థిక సంస్కర్త, సాహితీవేత్త, తెలంగాణ ఠీవి పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తంచేశారు. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి కేంద్రం పీవీని ఎంపిక చేసిందని తెలియగానే కేసీఆర్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. దేశాన్ని గండం నుంచి గట్టెక్కించిన తెలంగాణ బిడ్డకు ఇన్నాళ్లకు సముచిత గౌరవం దక్కిందని సన్నిహితులతో అభిప్రాయపడ్డారు.
పీవీ దశాబ్దాల పాటు తన జీవితమంతా కాంగ్రెస్కు సేవ చేశారని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనను ఘోరంగా అవమానించిందని కేసీఆర్ గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం పీవీ ఘనతను గుర్తించిందని, ఇది రాజకీయాలకతీతంగా అభినందించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. ‘సొంతపార్టీయే పీవీకి అన్యాయం చేసింది. చివరికి ఆయన పార్థివ దేహాన్ని కూడా ఏఐసీసీ ఆఫీసులోకి అనుమతించకుండా అవమానించింది. పీవీ అంతిమ సంస్కారం ఢిల్లీలో జరగకుండా అడ్డుపడింది. ఢిల్లీలో స్మారకం కూడా లేకుండా చేసింది. ప్రధాని మోదీ రాజకీయాలను మనసులో పెట్టుకోకుండా భారతరత్న ప్రకటించడం నిజంగా అభినందించదగిన విషయం.
ఇన్నాళ్లకు పీవీకి, వారి కుటుంబానికి న్యాయం జరిగింది’ అని కేసీఆర్ అన్నట్టు పార్టీ ముఖ్యులు తెలిపారు. పీవీకి భారతరత్న ప్రకటిస్తూ ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేసిన వెనువెంటనే కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పీవీకి భారతరత్న పురస్కారం యావత్తు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. పీవీకి భారతరత్న ప్రకటించాలని ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. పార్టీగా బీఆర్ఎస్ కూడా ఈ మేరకు తీర్మానం చేసి పంపింది. కేసీఆర్ స్వయంగా ఈ మేరకు లేఖ రాశారు. తమ పార్టీ చేసిన డిమాండ్ను గౌరవించి, తగు నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
పూర్తిపేరు : పాములపర్తి వెంకటనరసింహారావు
తల్లిదండ్రులు : రుక్మాబాయమ్మ, సీతారామారావు
సతీమణి : సత్తెమ్మ
పుట్టినతేదీ : 28.06.1921
చదువు : బీఎస్సీ, ఎల్ఎల్బీ
సంతానం : ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుళ్లు
మంథని ఎమ్మెల్యే : 1957-1977
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి : 1971-1973
హనుమకొండ ఎంపీ : 1977-1984 (రెండుసార్లు)
రామ్టెక్(మహారాష్ట్ర) ఎంపీ : 1984-1991 (రెండుసార్లు)
నంద్యాల ఎంపీ (ఏ పీ) : 1991-1996
బరంపూర్(ఒడిశా) ఎంపీ : 1996-1998 1991లో భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.