హాలియా, ఏప్రిల్ 9: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ జోష్ కొనసాగుతున్నది. నియోజకవర్గంలోని ఏ ఊళ్లో చూసినా సర్కారు సంక్షేమ పథకాల గురించే చర్చ జరుగుతున్నది. ప్రచారంలో మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రజలనుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది ఇబ్బందులను పెద్ద మనసుతో అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మానవతావాది అని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి కొనియాడారు. అనుముల మండలం హాలియాలో ఈ నెల 14న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభాస్థలాన్ని ఎస్పీ ఏవీ రంగనాథ్, ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక, బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. వివిధ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలో 1.53 లక్షలమంది లబ్ధిపొందారని తెలిపారు. వారంతా సభకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 30 ఏండ్లుగా తాబేదార్లు, గూండాలు, బ్రోకర్లతో పాలన సాగించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు భిన్నంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నారని తెలిపారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుతోనే నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి సాగిస్తుందని చెప్పారు.
నిడమనూరు : సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నిడమనూరు మండలం ఇండ్లకోటయ్యగూడెం, మార్తివారిగూడెం, తుమ్మడం, నారమ్మగూడెం గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్తో కలిసి ఆయన విస్తృత ప్రచారం చేశారు.ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, బొల్లం మల్లయ్యయాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీకోటిరెడ్డి, రంజిత్యాదవ్, గుర్వయ్యయాదవ్ పాల్గొన్నారు.
నందికొండ: రాష్ట్రం ఏర్పడ్డాక 1,32,999 ఉద్యోగాలు ఇచ్చామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నందికొండ హిల్కాలనీలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల నందికొండ ఇంచార్జీలు, కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి చెప్పారు.
హాలియా: ఆర్యవైశ్యులంతా టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. సాగర్లో నోముల భగత్కు ఓటేసి గెలిపించాలని దక్షిణ భారత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ అమరనాథ్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా హాలియాలో ప్రముఖ వ్యాపారవేత్త వీరమళ్ల కృష్ణయ్య జన్మదినోత్సవానికి తెలంగాణ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తాతో కలిసి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ఆర్యవైశ్యులకు అన్నిరంగాల్లో ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో నోముల నర్సింహయ్య సతీమణి నోముల లక్ష్మి, ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర రాజకీయ కమిటీ చైర్మన్ చింతల రవి, హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మా శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
పెద్దవూర, ఏప్రిల్ 9: అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మైనార్టీల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని హోంమంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. పెద్దవూర మండలకేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉర్దూను రెండో భాషగా గుర్తించిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని చెప్పారు. నోముల భగత్కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
గుర్రంపోడు: సాగర్ ఉప ఎన్నికలో ఓటమి భయం పట్టుకున్న కాంగ్రెస్ ప్రలోభాలకు తెరలేపింది. ఓటర్లకు పంచేందుకు పెద్దఎత్తున మద్యం నిల్వచేసి దొరికిపోయింది. గుర్రంపోడు మండలం చేపూర్ శివారులో జానారెడ్డి ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం హనుమాన్రెడ్డి ఇంట్లో భారీగా మద్యం నిల్వలు పట్టుబడ్డాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు గురువారం అర్ధరాత్రి దాడిచేసి 370 కాటన్ల క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో కాటన్లో 48 బాటిళ్లు చొప్పున.. 207 ఎంసీ విస్కీ కాటన్లు, 163 ఐబీ విస్కీ బ్రాండ్ కాటన్లున్నాయి. మద్యం కాంగ్రెస్ పార్టీదిగా నిర్ధారణ అయింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు రోజూ గ్రామాల్లో మద్యం పంచుతున్నట్టు సమాచారం. మద్యం సీజ్ చేసి.. హనుమాన్రెడ్డిపై కేసు నమోదుచేశారు.