KCR : స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జాతికి వారు అందించిన సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) స్మరించుకున్నారు. సామాజిక న్యాయం కోసం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా బాబు జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని గులాబీ అధినేత తెలిపారు. రక్షణ, వ్యవసాయ, కార్మిక శాఖ వంటి శాఖలకు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వర్తించి, స్వాతంత్రం అనంతర స్వయంపాలనలో దేశ ప్రగతికోసం ఆయన తన వంతు కృషి చేశారని కేసీఆర్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దళిత కులాలకు సామాజిక న్యాయం అమలు దిశగా గొప్ప కృషి సాగిందని కేసీఆర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి వంటి పదవులతో నాటి ప్రభుత్వంలో ఎస్సీ (మాదిగ) కుల నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గులాబీ బాస్ గుర్తు చేశారు.
దళితుల సాధికారత కోసం దళిత బంధు వంటి విప్లవాత్మక పథకాన్ని అమలుచేయడంలో బాబూ జగ్జీవన్ రామ్ ఆలోచనల స్ఫూర్తి ఇమిడి ఉన్నదని కేసీఆర్ పేర్కొన్నారు. దళిత, బహుజన కులాలకు రాజకీయ, ఆర్థిక, తదితర రంగాల్లో సామాజిక న్యాయం దక్కినప్పుడే బాబూ జగ్జీవన్ రామ్కు మనం ఘన నివాళి అర్పించినట్టు లెక్క అని కేసీఆర్ తెలిపారు.