యాదాద్రి భువనగిరి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో బుధవారం పర్యటించనున్నారు. గ్రామానికి సీఎం కేసీఆర్ రావడం ఇది రెండోసారి. కాగా, గత జూన్ 22న తొలిసారిగా వాసాలమర్రికి వచ్చిన ముఖ్యమంత్రి.. గ్రామస్థులతో కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించి అనంతరం సహపంక్తి భోజనం చేశారు. 42 రోజుల తర్వాత సీఎం మరోసారి గ్రామానికి విచ్చేస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటలకు సీఎం రోడ్డు మార్గంలో వస్తున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. తొలుత సీఎం దళితవాడలో పర్యటించి, తర్వాత గ్రామమంతా కలియ తిరుగుతూ పారిశుద్ధ్య చర్యలను పరిశీలిస్తారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామాభివృద్ధిపై గ్రామస్థులతో చర్చించనున్నారు. గత పర్యటన సందర్భంగా తాను చేసిన పలు సూచనల అమలుతీరుపై ఈ సందర్భంగా సీఎం సమీక్షించనున్నట్టు తెలుస్తున్నది. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు దిశానిర్దేశం చేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా కలెక్టర్ పమేలాసత్పతి మంగళవారం వాసాలమర్రిని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.