దేశ రాజకీయాలపై కేసీఆర్కు సంపూర్ణ స్పష్టత
దేశంలో పరిస్థితులపై సమగ్ర సమాచారం
మోదీకి దీటైన వాక్పటిమ గల నాయకుడు
అనర్గళంగా అర్థమయ్యేలా చెప్పగలిగే నేత
మోదీపై ధైర్యంగా మాట్లాడుతున్న ఏకైక నేత
దేశానికి బీజేపీ అత్యంత ప్రమాదకారి
ఆ పార్టీకి వ్యతిరేకంగా బలంగా గొంతెత్తాలి
రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సర్వత్రా వ్యతిరేకత
నియంతలా పరిపాలిస్తున్న నేత మోదీ
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్
ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. మోదీ ఒక నిరంకుశ రాజులా పాలిస్తున్నారు. ప్రతిపక్షం ఉండొద్దనే కోణంలోనే బీజేపీ ఏదో రకంగా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నది. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు. ఒక రాష్ట్ర సీఎంగా కేసీఆర్ మాత్రమే ధైర్యంగా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు. వారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కేసీఆర్కే ఉన్నాయి. జాతీయ రాజకీయాలపై ఆయనకు చాలా క్లారిటీ ఉన్నది. సాగు, తాగునీరు, విద్యుత్తు తదితర అంశాలపై చాలా హోం వర్క్ చేశారు. -మీడియా సమావేశంలో ఉండవల్లి
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): దేశంలో భారతీయ జనతాపార్టీని, ఆ పార్టీ విధానాలను దీటుగా ఎదుర్కొనే దమ్ము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే ఉన్నదని సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చెప్పారు. జాతీయ అంశాలపై కేసీఆర్ ఎంతో కసరత్తు చేశారని.. అనేక అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారని ప్రశంసించారు. మోదీకి దీటైన మంచి కమ్యూనికేటర్ కేసీఆర్.. అని పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ విధానాలకు వ్యతిరేకంగా మరింత బలంగా గళమెత్తాల్సిన అవసరమున్నదని సీఎం కేసీఆర్ తనకు చెప్పినట్టు ఉండవల్లి తెలియజేశారు. ఆదివారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్తో భేటీ అయిన ఉండవల్లి.. సోమవారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ పది రోజుల క్రితం ఫోన్చేసి హైదరాబాద్ వచ్చినప్పుడు కలవండి అన్నారు. ఆదివారం లంచ్కి పిలిచారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయిన తర్వాత మొదటిసారి ఆయన్ను కలిశాను. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేసీఆర్తో మాట్లాడాను. పార్టీ ఏర్పాటు గురించి మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు. ఈ భేటీలో బీజేపీ గురించి పలు అంశాలపై చర్చించాం. ఆ పార్టీపై మా ఇద్దరికీ ఒకేరకమైన అభిప్రాయాలు ఉన్నాయి. చాలా విషయాలపై కేసీఆర్ క్లారిటీగా ఉన్నారు. ఆధారాలతో సహా నాతో చర్చించారు. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి, రాబోయే రోజుల్లో ఎలా మారబోతున్నది.. దీనికోసం ఏం చేయాలన్న అంశాలపై మేం చర్చించాం. మళ్లీ పిలుస్తాను రావాలన్నారు. రావడానికి అభ్యంతరంలేదని చెప్పాను. మనమంతా అండర్ స్టాండింగ్గా ఉండాలన్నారు. తన పార్టీ తరఫున ఉండాలని అడగలేదు’ అని ఉండవల్లి తెలియజేశారు.
బీజేపీ ప్రమాదకారి
బీజేపీ ఓటు శాతం పెరగటం దేశానికి ఎంత ప్రమాదకరమో కేసీఆర్ తనకు వివరించారని అరుణ్కుమార్ చెప్పారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ భేటీలో దేశంలో బీజేపీ అవలంబిస్తున్న విధానాలు, వాటివల్ల దేశం ఎంత నష్టపోతుందో కేసీఆర్ వివరించారన్నారు. ఇటీవల బీజేపీ నేతల వ్యాఖ్యలవల్ల ఇస్లామిక్ దేశాల్లో ఎంతటి వ్యతిరేకత వచ్చిందో చర్చించారని పేర్కొన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఒక దేశంపై మరొక దేశం ఎంత ఆధారపడి ఉన్నదో గుర్తించాల్సిన అవసరమున్నదని, ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న చర్యల వల్ల దేశానికి ఎంతటి నష్టం వచ్చిందో సీఎం కేసీఆర్ వివరించినట్టు వెల్లడించారు. ‘ముస్లిం, క్రైస్తవులకు వ్యతిరేకమనే ముద్ర భారత్కు మంచిది కాదు. బీజేపీ నేతల వ్యాఖ్యల వల్ల ముస్లిం దేశాల్లో భారత్ పట్ల వ్యతిరేకత వస్తున్నది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో నాలుగైదు దేశాలు క్షమాపణలు డిమాండ్చేశాయి. ప్రపంచంలోని అన్ని దేశాల మీద మనం ఆధారపడ్డాం. మనదేశంపై కూడా ఇతర దేశాలు ఆధారపడ్డాయి. ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకమని ముద్ర పడితే చాలా నష్టపోతాం. దీనికి చెక్ పెట్టాల్సిన అవసరమున్నది’ అని ఉండవల్లి తేల్చిచెప్పారు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించే ప్రతిపక్షం గట్టిగా ఉండాలని మాజీ ఎంపీ అభిప్రాయపడ్డారు. మోదీ ఒక నిరంకుశ రాజులా పాలిస్తున్నారని, ప్రతిపక్షం ఉండొద్దనే కోణంలోనే బీజేపీ కేసులు పెడుతున్నదని.. ఏదోరకంగా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదని, ఒక రాష్ట్ర సీఎంగా కేసీఆర్ మాత్రమే ధైర్యంగా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్నారని ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. వారిని ఎదుర్కొనే దమ్ము కేసీఆర్కే ఉన్నదని చెప్పారు.
కేసీఆర్ మంచి కమ్యూనికేటర్
ఎంతటి క్లిష్టమైన అంశాన్నైనా సరళంగా.. సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని ఉండవల్లి పేర్కొన్నారు. జాతీయ అంశాలపై కేసీఆర్ కసరత్తు చేశారని, చాలా విషయాల్లో స్పష్టమైన అవగాహనతో ఉన్నారని తెలిపారు. ‘ప్రతి విషయాన్ని కేసీఆర్ స్పష్టంగా వివరించారు. జాతీయ రాజకీయాలపై ఆయనకు చాలా క్లారిటీ ఉన్నది. ఒక ఎజెండా ఉన్నది. సాగు, తాగునీరు, విద్యుత్తు తదితర అంశాలపై చాలా హోం వర్క్ చేశారు. దీనిపై నిపుణులతో చర్చిస్తున్నారు. బీజేపీ ని అడ్డుకోకపోతే దేశానికి ఎంత ముప్పో చెప్పారు. నేను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పాను. ప్రధాని మోదీలాగే కేసీఆర్ కూడా మంచి వక్త. కమ్యూనికేటర్. కేసీఆర్ హిందీ, ఇంగ్లిషులోనూ బాగా మాట్లాడగలరు. దేశవ్యాప్తంగా బీజేపీ చర్యలను ప్రజలకు వివరించగలరు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆమె దేశంలోని ఇతర రాష్ర్టాల్లో పెద్దగా ప్రభావం చూపలేరు. ఆయన మీద గౌరవం ఉంచి, పిలిచిన వెంటనే వచ్చాను.’ అని ఉండవల్లి తెలిపారు. వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ చెప్తుంటే ఆశ్చర్యపోయానని తెలిపారు. కేసీఆర్ తనకు ఎంతో గౌరవమిచ్చారని, మూడు గంటల పాటు ఇద్దరం చర్చించుకొన్నామని వివరించారు. బీజేపీ విషయంలో మాట్లాడటం ఇంకా పెంచాలని తనకు సూచించారని చెప్పారు. బీజేపీకి చెక్ చెప్పకపోతే .. ఆ పార్టీకి ఉన్న 36 శాతం ఓటు బ్యాంకు పెరిగే ప్రమాదం ఉన్నదని, బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ చెప్పినట్టు ఉండవల్లి వెల్లడించారు. బీజేపీపై సీఎం కేసీఆర్, తాను ఒకే ఆలోచనతో ఉన్నామని తెలిపారు. కేసీఆర్తో సమావేశమైనప్పుడు ప్రశాంత్ కిశోర్ కూడా పాల్గొన్నారని చెప్పారు. తమ మధ్య జాతీయ పార్టీ ఏర్పాటు గురించి ఎలాంటి టాపిక్ రాలేదని, బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయగల శక్తి కేసీఆర్కు ఉన్నదని తాను నమ్ముతున్నట్టు తెలిపారు.
ఏపీలో అంతా బీజేపీ తొత్తులే..
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలంగా ఉన్నదని, ఏ పార్టీ ఎంపీ సీట్లు గెలిచినా.. అవి బీజేపీవేనని ఉండవల్లి తెలిపారు. బీజేపీకి ఏపీలో ఉన్న బలం మరే రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన అన్ని పార్టీలు బీజేపీకే మద్దతు ఇస్తాయని, బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి ఏపీలో లేదని స్పష్టంచేశారు. కేసులకు భయపడి మొన్నటిదాకా బాబు వ్యతిరేకించలేదని, ఇప్పుడు జగన్ కూడా వ్యతిరేకించడం లేదని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ సైతం బీజేపీకే మద్దతిస్తున్నారని, కేంద్రంమీద ఒక్క మాట కూడా అనలేరని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు పెద్ద మెజారిటీ లేదని.. అలాంటప్పుడు 23 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ మద్దతు బీజేపీకి కీలకమని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తమ సమస్యలు పరిష్కరించాలని వైసీపీ చెప్తే బీజేపీ చేసి తీరాలని, తనకున్న బలంతో వైసీపీ రాష్ర్టానికి కావాల్సింది సాధించుకోవచ్చని ఉండవల్లి అన్నారు.
నెహ్రూకు కేసీఆర్ పెద్ద అభిమాని..
ఈ దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు కేసీఆర్ పెద్ద అభిమాని అని ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. ఈ దేశానికి నెహ్రూ ఆలోచనా విధానంపై కేసీఆర్కి పూర్తి అవగాహన ఉన్నదని చెప్పారు. బీజేపీ విధానాలు, సిద్ధాంతాలపైనా కేసీఆర్ వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. మత పరంగా బీజేపీ అవలంబిస్తున్న విధానాలపై మరింతగా గళమెత్తాలని కేసీఆర్ తనకు సూచించారని చెప్పారు. కేసీఆర్ జాతీయస్థాయిలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని, ఆ పార్టీ ఏపీ వ్యవహారాలను తనకు అప్పగించబోతున్నారని వస్తున్న వార్తలను ఉండవల్లి కొట్టిపారేశారు. తాను రాజకీయాల నుంచి వైదొలిగినట్టు కేసీఆర్ తనకు ఫోన్ చేసినప్పుడే చెప్పానని వెల్లడించారు.