కాలప్రవాహం ఎప్పుడూ పట్టాలపై రైలులా సాఫీగా సాగదు. ఉరకలు వేస్తుంది.. ఉత్థాన పతనాలను చవిచూస్తుంది. 18వ శతాబ్ది, ఆ తరువాతి యూరప్ మాదిరిగా ఉద్రిక్త మార్పులకు లోనుకావచ్చు. 20వ శతాబ్దపు భారతంలా అహింసాయుత పోరాటాన్ని ఆకళింపు చేసుకోవచ్చు. అటువంటి చారిత్రక సంధియుగంలోనే, కాలం పురుటినొప్పులు పడుతున్నప్పుడు- ప్రజలకు కొత్త మార్గాన్ని చూపే దార్శనికులు, నాయకులు ఉదయిస్తారు.
ఇప్పుడు 21వ శతాబ్ది ప్రథమ పాదంలో విలువలు మృగ్యమై, రాజకీయ పతనం తారస్థాయికి చేరిన దశలో వజ్రోత్సవ భారతం కొత్త కలలు కంటున్నది. కొత్త నాయకుడి కోసం ఎదురుచూస్తున్నది. ఈ నేపథ్యమే ప్రగతి ప్రవక్త కేసీఆర్ను దేశం ముందుకు కొత్త అజెండాను ప్రతిపాదించేలా చేసింది.
కేసీఆర్ రాజకీయం ఓట్ల కోసం కాదు, మనుషుల కోసం! ఆయనలో ఆడంబరం ఉండదు, మానవీయ విలువలు ఉంటాయి. అవి మనిషిని మాత్రమే కాదు, మనసును చేరుతాయి. శిథిల సౌధాల నుంచి జీవన శిఖరాన్ని నిర్మించడం ఆయన నైజం. కుప్పకూలిన బతుకులను మానవీయ స్పర్శతో నిలబెట్టిండు కేసీఆర్. ఎటుచూసినా నిరంతర నిర్మాణాలు.. అలుపెరగని ప్రగతి యాత్ర. దశాబ్దాలుగా దగాపడిన నేలకు, గోసపడిన బతుకులకు కేసీఆర్ జవసత్వాలిచ్చారు. దేశానికి ఓ ఆశాకిరణంగా నిలిచారు.
వ్యక్తులపై ద్వేషం కాదు, వ్యవస్థాగత మార్పు కావాలంటున్న కేసీఆర్ నేడు ఏడు పదుల వయ సులోకి అడుగు పెడుతున్నారు. గాంధీ, నెహ్రూ మొదలుకొని అనేక మంది నాయకులు ఈ పరిణత దశలోనే తమ రాజకీయ కార్యక్రమాలను శిఖరాగ్ర స్థాయికి చేర్చారు. కేసీఆర్ కూడా ఈ బృహత్ యజ్ఞంలో కృతకృత్యులు కావాలని కాంక్షిద్దాం.
హైదరాబాద్, ఫిబ్రవరి16 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో తిరిగినోడు.. ప్రజల నాడి తెలిసినోడు.. ప్రజల గోసలు చూసినోడు.. ప్రజా సేవే ఊపిరిగా బతికినోడు.. అందుకే ఆయన తీసుకొచ్చిన పథకాలన్నింటికీ పేదలే ప్రామాణికంగా ఉంటారు. చేయీకాలు కూడదీసుకొం టూ, అవరోధాలను అధిగమిస్తూ, తెలంగాణ సబ్బండ వర్ణాల ఆశలకు ఆకృతినిస్తూ, వారి ఆకాంక్షలకు పెద్ద పీట వేస్తూ, రేపటివైపు నడిపిస్తూ, మానవీయ విలువలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నారు సీఎం కేసీఆర్. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
సమాజంలోని అట్టడుగు స్థానంలో ఉన్న చిట్టచివరి వ్యక్తిని కేంద్రంగా చేసుకొని సీఎం కేసీఆర్ సంక్షేమ రంగంలో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నారు. గతంలో సంక్షేమ పథకాలు కొన్ని వర్గాలకే పరిమితమయ్యేవి. అవీ పేరుకే. కానీ, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిగా విభిన్నం. సర్వేజనా సుఖినోభవంతు అన్న రీతిలో పథకాలు చేపడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు.
మహబూబ్నగర్ బస్తీ పర్యటనలో భాగంగా ఓ నిరుపేద ఇంటిని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ తదితరులు (ఫైల్)
మిషన్ కాకతీయ: చెరువుల పునరుద్ధరణతోనే తెలంగాణ పల్లెల పునరుజ్జీవానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
హరితహారం: మొక్కులు నాటే కార్యక్రమం ద్వారా పల్లెలకు పచ్చల తోరణం కట్టారు.
మిషన్ భగీరథ: ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శ్రీకారం చుట్టిన సిద్దిపేట మంచినీటి పథకాన్ని మిషన్భగీరథగా రూపొందించి పల్లెల తాగునీటి తండ్లాట తీర్చారు.
గ్రామజ్యోతి: తెలంగాణ పల్లెలను అలుముకున్న చీకట్లను పారదోలేందుకు సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా గంగదేవిపల్లి వేదికగా గ్రామజ్యోతిని వెలిగించారు.
పల్లెకు అందం: పల్లెప్రగతి, రోడ్ల నిర్మాణం, 24 గంటల కరెంట్, హైమాస్ట్ లైట్లు, మురుగుకాల్వలు, డంప్యార్డ్లు, ప్రకృతివనాలు, అంతిమయాత్ర సగౌరవంగా సాగేలా వైకుంఠధామాల నిర్మాణం.
పల్లెకు ఆదాయం: గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, తాటి, ఈత వనాల పెంపు, ధోబీఘాట్లు, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు. అవన్నీ నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తున్నాయి.
సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన బాలిక ప్రత్యూషను తన నివాసానికి పిలిపించుకుని, కలిసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్ (ఫైల్)
హృదయం, మేధస్సు కలయిక కేసీఆర్ పథకాలు
కేసీఆర్ పథకాలు హృదయం, మేధస్సు కలయికతో పురుడు పోసుకొన్నవి. హృదయం, మేధస్సు కలిగి పరిణతి చెందిన వారిలోనే మానవీయ కోణం ఉంటుంది. సీఎం కేసీఆర్ ఆ కోవకే చెందుతారు. ఆయన పథకాలు చిట్టచివరి అభాగ్యుల సమస్యలకూ పరిష్కారం చూపుతున్నాయి.
– మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ ఉద్యమకారుడు
సంఘసంస్కరణల ఉద్యమ స్ఫూర్తి
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఇంకా హక్కుల కోసం దేశంలో అనేకచోట్ల పోరాటాలు కొనసాగుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆ సంఘ సంస్కరణల ఉద్యమస్ఫూర్తి దాగి ఉన్నది. ఫూలేతోపాటు అంబేద్కర్.. ఇలా ఎందరో సంఘసంస్కరణ వాదులు నొక్కి చెప్పిన వాటిని కేసీఆర్ ఆచరణలో చూపుతున్నారు.
– కేయూ వీసీ, సామాజిక శాస్త్రవేత్త రమేశ్
సంఘ సంస్కర్తల మూలాలు..
ప్రాథమిక హక్కుల విశ్వాసాలు..
ఆదేశిక సూత్రాల ఆనవాళ్లు..
అట్టడుగు వర్గాల స్వప్నాలు..
అణగారిన బతుకుల ఆకాంక్షలు..
విధివంచితుల అభిలాషలు..
మేధోసంపన్న ఆవిష్కరణలు..
కులం.. మతం.. లింగం..
చిన్నాపెద్దా భేదాల్లేకుండా..
పేద ప్రజలే ప్రామాణికమై..
వారి శ్రేయస్సే నినాదమై..
జనియించినవే తెలంగాణ పథకాలు!
అవి అసలైన మానవీయ పరిమళాలు!!