CM KCR |ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తుతున్న రోజుల్లో సాగిన తెలంగాణ తొలిదశ ఉద్యమం వల్ల ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాలేదు. కానీ, ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల సమయంలో యువత అంతా కెరీర్ వైపు మొగ్గుచూపుతున్న దశలో మొగ్గ తొడిగిన మలిదశ తెలంగాణ ఉద్యమం దశాబ్దాల కలను సాకారం చేసింది. అదీ శాంతియుతంగా. ఇదెలా సాధ్యమైంది? ఒక దార్శనికుడు, ఒక ఉద్యమకారుడు, ఒక వ్యూహ కర్త, ఒక రాజకీయ చతురుడు, ఒక మానవతా మూర్తి అన్నీ కలిసి పోతపోసుకున్న ఒకే వ్యక్తి వల్ల సాధ్యమైంది.
అతనే కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. 14 ఏండ్ల పాటు ఉద్యమాన్ని అత్యంత శాంతియుత మార్గంలో విజయవంతంగా నడిపించిన ధీశాలి, సమాజంలోని అన్ని వర్గాలనూ ఒక్కతాటిపైకి తెచ్చిన అరుదైన ప్రతిభాశాలి, అనూహ్య పోరాట పంథాల రూపశిల్పి మన కేసీఆర్. బహుముఖీన ప్రజ్ఞ, నిరంతర అధ్యయనం, విస్తృత రాజకీయ అనుభవం కలబోసుకున్న అరుదైన జననేత కేసీఆర్ వల్లే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. మలిదశ ఉద్యమంలో మరుపురాని ఆ పోరాట రూపాలను ఒకసారి నెమరు వేసుకుందాం.
నా దారి రహదారి..
ఉద్యమానికి విస్తృత ప్రచారం, ఉద్యమంలోకి జన ప్రవాహం ఈ రెండింటిని ఒకేసారి సాధించే లక్ష్యంతో చేపట్టినదే రాజీవ్ రహదారి దిగ్బంధనం. ఉత్తర తెలంగాణకు గుండెకాయలాంటి రాజీవ్హ్రదారిని పోరాట వేదికగా ఎంచుకోవటంలోనే కేసీఆర్ చాణక్యం దాగుంది. అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధిస్తే తెలంగాణ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అంతేగాక ఆ రహదారి వెంట ఉన్న గ్రామాల, పట్టణాల ప్రజలందరూ ఉద్యమంలోకి వస్తారు. 2006 డిసెంబర్ 29న చేపట్టిన ఈ పోరుబాట అటు ప్రజలకు, ఇటు ఉద్యమానికి నూతనోత్తేజాన్ని ఇచ్చింది.
ధర్నాకియాతో డర్నా జరూరీ
రాజకీయ వ్యూహాలు పన్నటంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఆయన ఆలోచనలను అంచనా వేయటం ఎవరివల్లా సాధ్యం కాదు. వేసే ప్రతి అడుగూ విజయతీరానికి బాటలు వేసింది. ఎన్నో పోరాట రూపాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకులు,పరుగులు పెట్టించిన కేసీఆర్ ఇందిరాపార్క్ దగ్గర 2008 జులై 2న ధర్నాకు పిలుపునిచ్చారు. 610 జీవో అమలు కోసం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన ధర్నా ఇది. ఉద్యోగుల సమస్యల పట్ల ఎంతో అవగాహన ఉన్న కేసీఆర్ ఉద్యమంలోకి వారందరినీ భాగస్వాములను చేసిన సందర్భమిది. ఇది ఎంత విజయవంతమైందంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు సమైక్య పాలకులకు వణుకు పుట్టించింది. కేసీఆర్ ధర్నా అంటే ప్రభుత్వాలు డర్నా అనే స్థితికి కేసీఆర్ ఉద్యమాన్ని తీసుకెళ్లగలిగారు.
అమ్మప్రేమ ఆలోచనకు ప్రతిరూపమే తెలంగాణ తల్లి
సమైక్య పాలనలో అనాథగా మారిన తెలంగాణకు అమ్మప్రేమ అందించాలన్న మానవీయ ఆలోచనల్లోంచి ఆకృతిదాల్చినదే తెలంగాణతల్లి. ఉమ్మడి పాలనలో ఉనికిని గుర్తించని తెలంగాణకు స్పష్టమైన రూపురేఖలను ఇచ్చి జనం మనస్సుల్లో ఉన్నత స్థానం కల్పించారు కేసీఆర్. ఆత్మగౌరవ నినాదంతో చేపట్టిన తెలంగాణ ఉద్యమం ఉధృతం చేయటానికి కేసీఆర్ ఎంచుకున్న ఎత్తుగడే తెలంగాణ తల్లి.
రోడ్లుపైనే వంటా వార్పు…
ఉద్యమంటే ఉదయం పూట ఏదో కొంతసేపు ఆందోళన చేయడమే తెలుసు అప్పటివరకు. కానీ కేసీఆర్ పంథానే వేరు. ఉద్యమమంటే చేపట్టిన చోటే వండుకుంటాం, పండుకుంటాం అన్న రీతిలో 2006లో రాజీవ్ రహదారి దిగ్భందం చేశారు. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కల్పించకుండా, ఉద్యమం పట్ల ఎవరికైనా సానుభూతి పుట్టేలా పోరాటాలు నిర్మించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎక్కడికక్కడ రాజీవ్హ్రదారిపై ఉద్యమకారులంతా వంటలు వండుకుని తింటూ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలకు ఝలక్ ఇచ్చారు. స్థాయీబేధం లేకుండా నాటి రాజకీయ ప్రముఖులంతా కేసీఆర్తో సహా రోడ్లపైనే భోజనాలు చేశారు. నేటి ఆర్థిక మంత్రి హరీశ్రావును కూడా నాటి చిత్రంలో చూడవచ్చు.
తాతా మనుమడు
కేసీఆర్ మనుమడు, కేటీఆర్ తనయుడు హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా సకుటుంబంగా దిగిన ఫొటో ఇది. చిత్రంలో కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ, కూతురు కవిత, అల్లుడు అనిల్కుమార్తో పాటు చిన్నారి హిమాన్షును చూడవచ్చు.
ఉద్యమంలోకి ఆబాలగోపాలం
తెలంగాణలోని అన్ని వర్గాలను ఉద్యమ బాటపట్టించడంలో కేసీఆర్ ఎంతో కసరత్తు చేశారు. అన్ని రంగాల అవసరాలను, దుస్థితిని అధ్యయనం చేశారు. అందుకు అనుగుణంగానే పోరాటాలను నిర్మిస్తూ వచ్చారు. 2003 లో జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర జీవో610 కోసం చేపట్టిన ధర్నాలో కేసీఆర్కు మద్దతుగా మేము సైతం అంటూ ప్లకార్డులు పట్టుకున్న చిన్నారులు.
తెలంగాణ జాగరణ సేన
ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ విషయం బాగా తెలిసిన కేసీఆర్ అందుకే ఉద్యమకారులకు నిరంతరం ఏదో ఒక యాక్టివిటీ కల్పిస్తూ వచ్చారు. ఓ వైపు సమైక్యపాలకుల ఎత్తుగడలతో, ధనబలం, అధికారంతో, రాజకీయ పలుకుబడితో తెలంగాణను అడ్డుకుంటుంటే..ఉద్యమకారుల్లో భయాన్ని పోగొట్టి, వారిలో చైతన్యాన్ని నింపేందుకు కేసీఆర్ జాగరణ సేనను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కర్రసాములో శిక్షణనిప్పించారు. అవసరమైతే దేనికైనా సిద్ధమన్న సంకేతాన్ని పాలకులకు పంపించారు. 2005లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
దళితబంధుకు నాడే నాంది
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అయితే అవన్నీ ఓట్ల కోసం ఆలోచించి చేసినవి కావు. ఓ వైపు ఉద్యమాన్ని నడిపిస్తూనే అణగారిన వర్గాల గురించి విస్తృత అధ్యయనం చేశారు. 2003 అక్టోబర్ 17న ఉద్యమంలో భాగంగానే దళిత్ ఎంపవర్మెంట్పై వర్క్షాప్ నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు ఏం చేయాలో నాడే ఓ నిర్ణయానికొచ్చారు కేసీఆర్. అణగారిన వర్గాల స్వావలంబనకు అంకురార్పణ అప్పుడే జరిగింది. దళితబంధు ఆలోచన ఆనాటిదే అనటానికి ఈ చిత్రమే నిదర్శనం.
టీఆర్ఎస్ ప్రథమ వార్షికోత్సవం
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఎజెండాగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్లోని జలదృశ్యంలో ప్రారంభించారు. డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ప్రథమ వార్షికోత్సవాలను నల్లగొండలో 2002 ఏప్రిల్ 26న నిర్వహించినప్పటి చిత్రం. ఇందులో దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి కూడా ఉన్నారు.
సంకల్పమే ఆయన బలం
తెలంగాణ సాధనకు కేసీఆర్ చేయని పోరాటం లేదు. ఏ పోరాట రూపం చూసినా ఆయన సుదీర్ఘ అనుభవం కండ్లకు కడుతుంది. సిద్దిపేట నుంచి వరంగల్ దాకా వంద కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్ర చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించిన రెండేండ్ల తర్వాత కేసీఆర్ సైకిల్ యాత్రకు పిలుపునిచ్చారు. దారిపొడవునా ప్రజలతో తెలంగాణ అవసరాన్ని చెప్తూ యాత్ర ఆసాంతం విజయవంతంగా సాగింది.
బహుదూరపు బాటసారి
ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. తెలంగాణ సాధనకు సంకల్పం చెప్పుకున్న కేసీఆర్ ఉద్యమకాలంలో పాదయాత్రలు కూడా చేశారు. 2003 ఆగస్టు 25న కోదాడ నుంచి హాలియా దాకా కేసీఆర్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా తీసిన ఫొటో ఇది. కేసీఆర్తో పాటు జగదీశ్రెడ్డి, కర్నె ప్రభాకర్ను కూడా చిత్రంలో చూడవచ్చు.
ఇదే తొలిసారి…
అలుపెరుగక తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు పోరాడిన కేసీఆర్ తొలిసారి 2007 ఫిబ్రవరి 17న తన పుట్టిన రోజు వేడుకలను అందరి సమక్షంలో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పుట్టిన రోజు సంబురం జరుపుకున్న సందర్భం ఇదే మొదలు ఇదే ఆఖరు.
తెలంగాణ రుచులు
తెలంగాణ సంస్కృతి, భాష, ఆహార అలవాట్లపై అవాకులు చెవాకులు పేలే వారి నోళ్లు మూయించటంతో పాటు తెలంగాణకే ప్రత్యేకమైన వంటకాలను దశదిశలా రుచి చూపించేందుకు కేసీఆర్ తెలంగాణ సంబురాలు పేరుతో అద్భుతమైన కార్యక్రమాన్ని 2007 మార్చి 23న చేపట్టారు. దీని తర్వాతే తెలంగాణ సంస్కృతి పట్ల అన్నివైపుల నుంచి ఆదరణ పెరగటం మొదలైంది.
పుష్కర స్నానాలు..
సంస్కృతి సంప్రదాయాలంటే కేసీఆర్కు అమితమైన ఆసక్తి. మెదక్ మండలం పేరూరు గ్రామంలో మంజీరా నది పుష్కరాల సమయంలో సతీసమేతంగా పవిత్రస్నానమాచరించినప్పటి చిత్రం. కృష్ణా, తుంగభద్ర, గోదారి నదుల పుష్కరాల్లో కూడా కేసీఆర్ పాల్గొన్నారు.
ఎత్తర జెండా!!
తెలంగాణ యావత్తు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న కాలం. కేసీఆర్ చేపట్టిన మహోత్తర పోరాటంలో సమస్త వర్గాలకు పలికిన ఆహ్వానం. ఈ సందర్భంగా గుండెగుండెన గులాబీ జెండా నిండాలన్న నినాదన్ని ఇచ్చిన కేసీఆర్ అందుకు సంకేతంగా గులాబీ కండువాను ప్రదర్శిస్తున్న దృశ్యం.
ఫొటోల సేకరణ: అనుమల్ల గంగాధర్