KCR | నల్లగొండ : ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆటబొమ్మ కాదు.. అవగాహన చేసుకొని మాట్లాడాలి అని కేసీఆర్ పేర్కొన్నారు. చలో నల్లగొండ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
చలో నల్లగొండ సభ నుంచి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనది ప్రాణహిత. ఇవాళ కూడా 5 వేల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. అవి ఎత్తిపోయాలి. ఎల్ఎండీ, ఎంఎండీ నింపాలి. రైతులకు నీళ్లు ఇవ్వాలి. కానీ ఏం జేస్తుండ్రు.. మేడిగడ్డ పోతాం. బూరుగుగడ్డ పోతాం. బొందలగడ్డ పోతాం.. ఏం తొకమట్ట ఉన్నాది మేడిగడ్డ వద్ద.. బిడ్డ ఈ స్టేజీ మీద ఉన్న నాయకులంతా అసెంబ్లీ అయిపోయాక మేం కూడా అక్కడికి పోతాం.. మీ బండారం బయటపెడుతాం. మీ చరిత్ర మొత్తం ఎండగడుతాం. ఓ లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి.. బట్టకాల్చి మీద వేయాలని చెప్పి మేం మేడిగడ్డ పోతాం అంటరు. మేడిగడ్డకు పోయి ఏం పీకుతరు.. ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు. దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయి.. నీళ్లు ఉన్నాయి.. కాపర్ డ్యాం పెట్టి కూడా నీళ్లు ఎత్తిపోయొచ్చు. కేసీఆర్ను బద్నాం చేయాలనే దుష్టబుద్ధి పెట్టుకుని రైతుల పొలాలు ఎండబెడుతారా.. మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తికి నీళ్లు వస్తలేవు. తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం.. చిల్లర రాజకీయం అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
మేడిగడ్డ వద్ద 250 నుంచి 300 పిల్లర్లు ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆట బొమ్మ కాదు. గోదావరి మీద మూడు బ్యారేజీలు ఉంటాయి. 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి. 1500 కి.మీ. కాల్వ ఉంటది. 19 సబ్స్టేషన్లు, 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు కాదట. ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయాయి. ఎన్నిసార్లు కుంగిపోలేదు. సాగర్లో కుంగిపోలేదా..? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోలేదా..? మొన్నటి దాకా మూసీ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోలేదా..? ఏదన్నపోతే సర్దాలి.. మంచిగా చేయాలి. తొందర రైతులకు నీళ్లు ఇవ్వాలి. మేం మేడిగడ్డం పోతాం.. బొందలగడ్డ పోతాం ఇది రాజకీయమా.. ఇది తెలివా..? ఇది కాదు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అని కేసీఆర్ సూచించారు.