కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 8: సీఎం కేసీఆర్ సూచనలతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మరణించడంతో ఆదివారం కరీంనగర్లోని గంగుల నివాసంలో మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. మంత్రి కమలా కర్ను పరామర్శించారు.
అనంతరం తోట చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, 15 ఏండ్ల క్రితం కరీంనగర్కు వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ అనేక మార్పులు చోటుచేసుకొన్నాయని చెప్పారు. నగరమంతా హరితమయంగా మారిందని, ఎటుచూసినా పచ్చదనం కళకళలాడుతుందని పేర్కొన్నారు. గతంలో తాగునీటికి సైతం తండ్లాడే ఈ ప్రాంతవాసులు, ప్రస్తుతం నిండు జలాశయాలతో ఏటా 3 పంటలు తీసే స్థాయికి ఎదిగారని, ఇదంతా సీఎం కేసీఆర్ చలువతోనే సాధ్యమైందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.