KCR | హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రెండు రోజుల కిందట నారాయణపేట సభలో ముఖ్యమంత్రి భయం, ఆయన వణుకు చూస్తే ఈ గవర్నమెంటు ఏడాది కూడా ఉండేటట్టు లేదని అనిపిస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తడో, ముఖ్యమంత్రే జంపుగొడతడో, ఏమైతదో తెలియదని, ముఖ్యమంత్రి ఈడొక మాట మాట్లాడితే, ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటెయ్యమని టీవీలో చెప్తడని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. లక్షమందికిపైగా హాజరైన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘ఎన్నికల సమయంలో కాంగ్రెసోళ్లు ఎన్ని మాటలు చెప్పినరు. కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేసిండు. ఇగ ఉరుకుండ్రి.. ఉరికి.. ఉరికి రూ.రెండు లక్షలు అప్పు తెచ్చుకోండ్రి. డిసెంబర్ 9నాడు మాఫీ చేస్తం అని చెప్పినరు. ఎదిగిన ఆడిపిల్లలకు నెలకు రూ.2,500 ఇస్తమన్నరు. ఇట్లా ఎన్నో చెప్పినరు. ఒక్క మాటనన్నా ఖాయమున్నదా?. మరి ఈ రాష్ట్రం ఇట్లే పోవాల్నా? మేము 14 ఏండ్లు కొట్లాడి, చావునోట్లో తలకాయ పెట్టి, చచ్చేదాకా తెగబడి, రాష్ట్రం సాధించి, పదేండ్లు అన్ని రకాలుగా ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకున్నం. రైతు సోదరులను కండ్లళ్ల పెట్టుకొని కాపాడుకున్నం. వ్యవసాయం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచాలని, రైతాంగాన్ని నిలబెట్టాలని, అనేక పథకాలు పెట్టినం. ఆనాడు ఎటుచూసినా పంటకోతలు ఉండేవి. నేడు ఎటుచూసినా కరెంటు కోతలు, క్రాప్హాలిడేలు. ఓట్లను ఆగమాగం వెయ్యొద్దు. ఎవడో ఏదో చెబుతడు. ఇదివరకే మనం దెబ్బతిన్నం. మొన్న ఎన్నికల్లో దెబ్బలు తిన్నం. కిందిమీదికి అయిపోయినం. ఎంత ధీమాగా ఉండిరి రైతులు. ఎంత మంచిగా ఉండిరి. ఎంత బ్రహ్మాండంగా ఉండె. ఎంతమంచిగా రైతుబంధు మీ బ్యాంకులో పడుతుండె. కరెంటుఎంత మంచిగా వచ్చేది. చెర్లు, కుంటలు ఎంతమంచిగా నిండి ఉండె. ఎంత మంచిగా నీళ్లు వస్తుండె. మీ వడ్ల డబ్బులు ఎలా ఇచ్చేది. ఇవన్నీ ఎటుపాయె.
కొద్దిమందికి రైతుబంధే ఇయ్యలేదు. పంటలు చేతికొచ్చినా వాటిని కొనే దిక్కులేదు. కనీసం మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తమన్నరు. బోనస్.. బోగస్సేనా?. ఇవాళ తప్పుడు వానలు పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ వడ్లు తడిసిపోతున్నాయ్. కాంటాలు పెడుత లేరు. వడ్లు కొంటలేరు. దానిమీద ప్రభుత్వానికి నియంత్రణ లేదు. మేము కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఇవాళ ఆగమాగం అవుతున్నరు. రైతుబంధు రాకపోతే అప్పుల పాలైండ్రు. లక్షల మోటార్లు కాలినయ్. ట్రాన్స్ఫార్మర్లు కాలినయ్. మూడెకరాలకు ఒక ఎకరమే పండింది. ఆ ఎకరం పంట కొనే దిక్కులేదు. డబ్బులు ఇస్తడో లేదో తెలియదు. మద్దతు ధర, బోనస్ వస్తలేదు. బోనస్ బోగస్ కానివ్వొద్దు. అందరం కలిసి కొట్లాడదాం. ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా.
హరీశ్ నాయకత్వంతో సిద్దిపేటోళ్ల్లు మంచి దారి చూపించిర్రు. పోస్టుకార్డు ఉద్యమం చేస్తున్నారు. రూ.రెండు లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని, ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని, పంటల బోనస్ ఇవ్వాలని, వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించిన్రు. సిద్దిపేటను ఆదర్శంగా తీసుకొని రేపటి నుంచే రైతాంగం పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించాలని యావత్ తెలంగాణ రైతాంగానికి సూల్తాన్పూర్ వేదిక నుంచి నేను పిలుపునిస్తున్నా. రైతుబంధు అడిగితే ఒక మంత్రేమో చెప్పుతో కొట్టండ్రి అంటడు. ఇంత అన్యాయం మీ కండ్లముందే జరగాల్నా.. దయచేసి ఆలోచన చేయాలి. ఓట్లేసుడంటే ఏదో ఆగమాగం కాదు. ఆలోచించి బీఆర్ఎస్కు ఓటు వేయాలె.
మిషన్ భగీరథతో ఆరు సంవత్సరాలు ఏ ఇంట్ల చూసినా నీళ్లు దుంకినయ్. మనం బ్రహాండంగా పండగ చేసుకున్నాం. రోడ్ల మీద ఏ ఆడబిడ్డా కనపించలేదు. బిందెలు కనవడ్లేదు. నీళ్ల ట్యాంకర్లు కనబడలేదు. మళ్లీ నీళ్ల ట్యాంకర్లు ఎందుకు వస్తున్నయ్? నాడు నేను లంబాడతండాకుపోతే మా ఇంటికే నీళ్లు వస్తున్నయని చిమ్నీబాయి చెప్పింది. మళ్లీ నీళ్ల ట్యాంకర్లు ఎందుకు వస్తున్నయ్? అంటే చేతగాని ప్రభుత్వం ఉంది. అసమర్థులు ఉన్నారు. ఉన్న వసతులు కూడా వాడుకోని రావడం లేదు. 9 ఏండ్లు నడిచిన కరెంటు ఇవ్వత్తలేదు. ఆరేండ్లు నడిచిన నల్లానీళ్లు ఇవ్వొత్తలేదు. రైతులను కాపాడే పరిస్థితి లేదు. రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా మళ్లీ మొదటకు తీసుకొస్తున్నారు.
ఎన్నికలప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిండ్రు. కల్యాణలక్ష్మి లక్ష రూపాయలే కాదు, తులం బంగారం కూడా ఇస్తమన్నారు. ఎవ్వరికైనా వచ్చినయా? ఏ ఇంటికైనా ఇచ్చారా? ఇన్ని వాగ్దానాలు చేసి, ఇన్ని మాటలు చెప్పి, మీ ఓట్లు తీసుకొని, అధికారంలోకి వచ్చి అన్నీ ఎగబెట్టి మళ్లా ఓట్లు అడుగుతున్నారు. ఎట్ల వేస్తరు ఓట్లు? ఒకవేళ వేస్తే మేము ఎన్ని చెప్పినా, మళ్లా మాకే గుద్దిర్రని అన్నీ ఎగబెడతారు. ఇవ్వాళ ఉల్టా గుద్ది బీఆర్ఎస్ను గెలిపిస్తేనే ప్రభుత్వం మెడలు వంచుతది. మీకు న్యాయం జరుగుతుంది.
బీజేపీ ఏమన్న పనిచేసిందా మన రాష్ర్టానికి. పెద్దలు నేర్పిన్రు. ‘అక్కరకు రానిచుట్టము.. మ్రొక్కిన వరమీయని వేల్పు .. మోహరమున దానెక్కిన బారని గుర్రము.. గ్రక్కున విడవంగవలయు గదరా సుమతి’అని. బీజేపీ ఒక అక్కరకు రాని చుట్టము. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇయ్యలె. ఒక నవోదయ ఇయ్యలె. ఒక జాతీయ ప్రాజెక్టు ఇయ్యలె. బీజేపీ గురించి హరీశ్రావు చెప్పినవన్నీ వందశాతం కరెక్టు. బీజేపీకి ఓటేసినా, మంజీరనదిలో పడేసినా అంతే. యువత గాడ్పుకు కొట్టుకుపోకుండా, పిచ్చిపిచ్చిగా, గుడ్డిగ కాకుండా ఆలోచించి ఓటెయ్యాలె. ఇయ్యాల తెలంగాణకు న్యాయం జరగాలంటే, తెలంగాణ హక్కులు కాపాడాలంటే, తెలంగాణ ప్రాజక్టులు పూర్తికావాలంటే, రైతాంగానికి మళ్లా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు, తెలంగాణ హక్కుల కోసం పేగులు తెగేదాక కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గులాబీ జెండా. ఆ జెండా ఉన్న కారు గుర్తునే ఆదరించాలె. తెలంగాణ తెస్తా అని ఆనాడు మీ బిడ్డగానేను చెప్పిన. ఇప్పుడు మళ్లా చెప్తున్నా. మీ ఆశీర్వచనంతోని మళ్లా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంటు తెస్తా. రైతాంగాన్ని, అన్ని వర్గాల ప్రజలని కాపాడుతా. దళితబిడ్డలకు మళ్ల దళితబంధు ఇచ్చి తీరతా’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
మెదక్లో వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్లో అనిల్కుమార్ను నిలబెట్టినం. ఇద్దరు ఎలపట, దాపట కోల్యాగల్లెక్క ఉన్నరు. ఇద్దరు చదువుకున్నోళ్లు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కుపిండి, మీ హక్కులను సాధించాలంటే వాళ్లను బ్రహ్మాండంగా గెలిపియ్యాలె. వెంకట్రామిరెడ్డి ఒక ఐఏఎస్ అధికారి, ఈ జిల్లాకు సేవజేసినవాడు, ఆయనకు డబ్బులు అవసరంలేదు. సేవచేద్దాం అని వచ్చాడు. అనిల్కుమార్ 2000 సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉండి పోరాటం చేసిన బిడ్డ. బలహీనవర్గాలకు చెందిన బిడ్డ. మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డిని, జహీరాబాద్ నుంచి అనిల్కుమార్ను గెలిపించమని కోరుతున్నా. ఆగమాగమైతే అడివడివైపోతం.