వనపర్తి : అరవైఏండ్ల తండ్లాటకు ఎనిమిదేండ్ల పాలనతో సీఎం కేసీఆర్ పరిష్కారం చూపారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని రేవల్లి మండలం చీర్కపల్లి గ్రామానికి చెందిన రేవల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు. వారికివనపర్తి క్యాంపు కార్యాలయంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వనపర్తి ఆర్టీసీ కాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో అన్ని రంగాలలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 24 గంటల కరంటు తెలంగాణ తొలి విజయం అన్నారు. దేశంలోనే వ్యవసాయానికి ఉచిత కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతుబంధు, రైతుబీమా అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఆసరా పథకాలతో పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణ తరహా పథకాలు అమలు కావడం లేదన్నారు. తెలంగాణ మిషన్ భగీరథను ‘జల్ జీవన్ మిషన్’ కింద తామే నీళ్లు ఇస్తున్నట్లు కేంద్రం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో తెలంగాణకు ఒరిగేది సున్నా. టీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.