రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట కిందట శ్రీనివాస్గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయింది. ప్రతిరోజూ సీఎం, డిప్యూటీ సీఎం కరెంట్ పోవటం లేదని ఊదరగొడుతున్నారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? -కేసీఆర్ ట్వీట్
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్తోనే పంచాయితీ పడిందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఎక్కడైనా పాలోళ్లకు పంచాయితీ పడితే గట్టిగా నిలబడేందుకు ఒక పంజును ఏర్పాటు చేసుకుంటారని, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు.. కాంగ్రెస్కు జరిగే పంచాయితీలో మీ పంజుగా కేసీఆర్ కొట్లాడతాడని అభయమిచ్చారు. అందుకు తగిన ఎంపీల బలాన్ని ఓటు ద్వారా తనకు ఇస్తే అసమర్థ కాంగ్రెస్కు కార్రుకాల్చి వాతపెడతానని, హామీలన్నీ నెరవేర్చేలా వారి మెడలు వంచుతానని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాగర్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని ఉయ్యాలవాడలో రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు. నేడు బీఆర్ఎస్ ఆవిర్భవించిన గొప్ప రోజు అని, తెలంగాణ రాష్ర్టానికి శంకుస్థాపన జరిగిన రోజు అని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోతే తప్ప బాగుపడదనే ఉద్దేశంతో సరిగ్గా 23 ఏండ్ల క్రితం పిడికెడు మందితో, గుండె ధైర్యంతో, ఉ క్కు సంకల్పంతో యుద్ధం ప్రారంభించిన రో జని పేర్కొన్నారు. ఉద్యమంలో భాగంగా అనేకసార్లు నాగర్కర్నూలు వచ్చినట్టు గుర్తుచేసుకున్నారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వ చ్చుడో’ ఏదో ఒకటి తేల్చాలని ఆమరణ దీక్షకు పోతే తనను ఖమ్మం జైలులో వేశారని పేర్కొన్నారు.
ఆ గౌరవం పాలమూరుకే
తాను మహబూబ్నగర్ నుంచి ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆ గౌరవం ఎప్పటికీ పాలమూరుకే ఉంటుందని చెప్పారు. సాధించుకున్న తెలంగాణలో పదేండ్లపాటు కోడి తన పిల్లలను సాదుకున్నట్టుగా సాదుకున్నట్టు తెలిపారు. 50 ఏండ్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పాలనలో పాత మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదని, తాను ఐదు కాలేజీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
రోజుకు పదిసార్లు పోతున్న కరెంటు
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఏడాదిలోనే కరెంటును బాగుచేసి, 24 గంటల కరెంటు ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు తరచూ కరెంటు పోతున్నదని, రాత్రి బావులకాడికి పోవుడు, తేళ్లు, పాములు కుట్టు డు మళ్లీ మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 225 మంది రైతులు చనిపోయారని, కొందరు ఆత్మహత్య చేసుకుంటే, మరికొందరు కరెంటు షాక్తో, ఇం కొందరు పొలం వద్ద పాముకాటుకు గురై చనిపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు చెప్తున్నారని మండిపడ్డారు.
పంట కొనుగోళ్లకు దిక్కేలేదు
‘రైతుబంధు అందరికీ వచ్చిందా?’ అని ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రశ్నించారు. దీనికి వారు రాలేదని చెప్పడంతో ‘అయ్యా ముఖ్యమంత్రీ.. ఇదీ ప్రజల భాష’ అని చెప్పారు. తాను ప్రజల మధ్యన నిల్చొని మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ప్రతి ఆడపిల్లకు రూ. 2,500 వచ్చాయా? రూ. 2 లక్షల రుణమాఫీ అయిందా? కల్యాణలక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చాయా? వరికి రూ. 500బోనస్ వచ్చిందా? అని ప్రజలను ప్రశ్నించగా, వారు ‘రాలేదు రాలేదు’ అని సమాధానం ఇచ్చారు.
మళ్లీ బోర్లు.. నీటి ట్యాంకర్లు
తమ పాలనలో మిషన్ భగీరథ పథకం పెట్టి ప్రతి ఇంటికీ నీళ్లు ఇచ్చి, మున్సిపాలిటీల్లో రూపాయికే కనెక్షన్ ఇచ్చి, ప్రతి పేదవాడి ఇంట్లో నల్లా ఫ్రీగా పెట్టి తాగునీటిని సరఫరా చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు బోర్లు, నీళ్ల ట్యాంకర్లు ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు.
రైతుబంధు డబ్బులు నీ అబ్బ జాగీరా?
రైతుబంధును 5 ఎకరాల వరకే ఇస్తామని అంటున్నారని, మరి ఆరెకరాల రైతులు, 9-10 ఎకరాలున్న రైతులు ఏం పాపం చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. 10-15 ఎకరాల రైతులకన్నా ఇవ్వాలి కదా.. అని కేసీఆర్ అనగానే ‘ఇవ్వాలి.. ఇవ్వాలి’ అని జనం నినాదాలు చేశారు. రైతుబంధు ఇస్తే వాళ్ల అయ్య జాగీరేమన్నా పోతుందా? అని నిలదీశారు. ప్రజల సొమ్మును వారికే ఖర్చు చేయాలని వివరించారు. ప్రభుత్వాల సహకారం లేకుండా వ్యవసాయం జరగదనే దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతుబంధును సృష్టించినట్టు తెలిపారు. తమ హయాంలో రైతుబంధు డబ్బు లు ఠంచన్గా పడేవని, ఎక్కడున్నా సెల్ఫోన్లు టింగుటింగుమని మోగేవని చెప్పారు.
యువకులు గ్రామాల్లో చర్చ పెట్టాలి
‘ఈ దేశం, రాష్ట్రం యువకులది. మీరు ఆలోచన చేయాలి. ఒక గాడ్పులో కొట్టుకొని పోవద్దు. ఈ రాష్ట్రం శాశ్వతం. మీ భవిష్యత్తు శాశ్వతం. మన బతుకులు నిలవాలంటే బీఆర్ఎస్ గెలువాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘యువకులు ఆలోచించాలి. ఉన్మాదంలో పడిపోవద్దు. నరేంద్రమోదీ గాయి గత్తర కావా లో? మన బతుకులు కావాలో? మన పంట లు కావాలో? మన పొలాలు బాగుండాలో? మీరే ఆలోచన చేయండి. ఊరికే నినాదం చెప్పడం కాదు. మీ గ్రామాల్లో చర్చ పెట్టండి’ అని యువకులకు, బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘మన కోసం తండ్లాడే బీఆర్ఎస్ను కాపాడదామా? మన బతుకుల్ని ఆగం చేసేవారిని కాపాడదామా? అని చర్చ పెట్టాలి. ఈ మాటలు చెప్పి గ్రామ గ్రామాన ప్రతి చెల్లికి, తల్లికి దండం పెట్టి ఓటు అడగండి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. మన హక్కులను కాపాడుకుందాం. అన్ని సాధించుకుందాం’ అని కేసీఆర్ ఆకాంక్షించారు.
ముస్లిం సోదరులు ఆలోచించాలి
తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని, తాము అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇమాములను ఆదుకున్నామని తెలిపారు.ముస్లిం బిడ్డల కోసం ప్రత్యేకంగా గురుకులాలు పెట్టామని, మహిళలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. నాగర్కర్నూలు బరిలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చదువుకున్నవాడని, మంచి వ్యక్తని కితాబిచ్చారు. ముస్లిం సోదరులు సైతం ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
సీఎంకు కర్రుకాల్చి వాతపెట్టాలె
‘ఆనాడు మీ అందరి అండదండలతో 15 ఏండ్లు అన్నం తిన్నమో, అటుకులు బుక్కినమో పోరాటం చేసినం. నేను కూడా దీక్ష చేపట్టి తెలంగాణ తెచ్చా’ అని కేసీఆర్ చెప్పారు. అలాంటి వ్యక్తిని ‘కేసీఆర్ గుడ్లు పీకి గోటీలు ఆడుకుంటా. నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా. నీ చెడ్డీ కూడా గుంజుకుంటా అని ముఖ్యమంత్రి అంటుండు. ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష. ఇది ధర్మమేనా? తెలంగాణ సాధించిన వ్యక్తిని, వచ్చిన తెలంగాణను తెల్లగ చేసిన వ్యక్తిని. రాష్ర్టానికి సాగునీరు, తాగునీరు కొట్లాడి తెచ్చుకున్న వ్యక్తిని. నన్ను అలా అనొచ్చునా’ అని నిలదీశారు. ‘ఎవరికి కర్రుకాల్చి వాతపెట్టాలో, ఎవర్ని అందలం ఎక్కించాలో అనే శక్తి మీ దగ్గర ఉన్నది. దయచేసి బీఆర్ఎస్ను గెలిపించండి. నాకు శక్తి ఇవ్వండి. మళ్లీ మన గవర్నమెంటే వస్తుంది. అందులో అనుమానం అవసరం లేదు’ అని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు.
ప్రవీణ్కుమార్ అల్లాటప్పా వ్యక్తి కాదు
‘నాగర్కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అల్లాటప్పా వ్యక్తి కాదు. మంచిగా చదువుకున్న నాయకుడు. మాజీ ఐపీఎస్ అధికారి. నాగర్కర్నూలు చిత్రపటాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టే బాధ్యత కేసీఆర్ది అని ప్రవీణ్కుమార్ చెప్పారు. అలంపూర్లో పుట్టిన బిడ్డ. సొంతగడ్డకు సేవ చేయాలని మీ ముందుకు వచ్చాడు. మీరు బలాన్ని ఇస్తే ప్రవీణ్కుమార్తో సహా జిల్లా ముఖ్యనాయకులందరూ కలిసి ముఖ్యమంత్రి మెడలు వంచి అన్ని హామీలు అమలు చేయిస్తాం. ఆ శక్తిని, బలాన్ని మీరు అందించాలె. నేను ముఖ్యమంత్రి అయినంక ప్రవీణ్కుమార్ను పిలిచి గురుకులాలను బాగా నడుపుతున్నారని చెప్పి, ఇంకా బాగా నడపాలని చెప్పా. బడ్జెట్ పెంచుకొమని చెప్పా.
గురుకులాను జూనియర్ కాలేజీలుగా చేయాలని చెప్పా. ఇప్పుడు తెలంగాణ గురుకులాలంటే అంతర్జాతీయ స్కూల్స్కు సమానం. అద్భుతమైన డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐపీఎస్లు, పైలట్లు, ఎవరెస్టు శిఖరాలు ఎక్కిన బిడ్డలను తయారు చేసిండు. ఆయనకొక కమిట్మెంట్ ఉంది. దేశాన్ని బాగు చేయాలని ఉంది. అట్టడుగు వర్గాలను పైకి తేవాలని, రైతులను కాపాడుకోవాలని, రాష్ర్టానికి మేలు చేయాలని ఉంది. ఆషామాషీ వ్యక్తి కాదు. ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే మనందరికీ మేలు జరుగుతుంది. ఇట్లాంటి వ్యక్తి మరోసారి దొరకరు. దయచేసి ఆలోచన చేయండి’ అని కేసీఆర్ కోరారు.
భగ్గుమన్న తెలంగాణలో నన్ను అడుగడుగునా అక్కున చేర్చుకుంటున్నరు. పూలు చల్లి,
గుమ్మడికాయలు కొడుతున్నరు. రకరకాల పద్ధతుల్లో స్వాగతం చెప్తున్నరు. ఈ ప్రభుత్వానికి
కర్రుకాల్చి సురుకు పెట్టాలని జనానికీ అర్థమైంది. మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది.
మన తెలంగాణ బాగుపడతది. ఏం రంది పడాల్సిన అవసరం లేదు. జై తెలంగాణ.
-కేసీఆర్
బీజేపీ అక్కరకు రాని చుట్టం
తెలంగాణలో ఉన్న బీజేపీ అక్కరకు రాని చుట్టమని కేసీఆర్ అభివర్ణించారు. ‘నరేంద్రమోదీ నూరు నినాదాలు చెప్పారు. ‘భేటీ పడావో.. భేటీ బచావో’ ఏడన్నా కనిపించిందా? ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’తో దేశం ఏమన్నా బాగుపడిందా? ధరలు పెరిగినయ్, పెట్రోల్, డీజీల్, సిలిండర్ ధర పెరిగింది. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు’ అని పేర్కొన్నారు. ‘మేకిన్ ఇండియా’ ఏడన్నా కనిపిందా? ‘స్టార్టప్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’ కనిపించిందా? వికసిత్ భారత్ వికసించిందా? దళితుల బతుకులు, పేదల బతుకులు మారినయా? బుల్లెట్ ట్రైన్లు వచ్చినయా? రైతుల ఆదాయం డబుల్ అయిందా? అమృత్కాల్ వచ్చిందా? మరి ఎందుకు వేయాలి వారికి ఓటు’ అని ప్రశ్నించగా.. ‘ఓటు వెయ్యం’ అంటూ బదులిచ్చారు.
నవోదయ లేదు.. మెడికల్ కాలేజీ ఇవ్వలే
ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు ఒక్కో నవోదయ పాఠశాల ఇవ్వాలన్న నిబంధన ఉన్నదని, వంద ఉత్తరాలు రాసినా, దండంపెట్టి అడిగినా మోదీ పట్టించుకోలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు మోదీ ఇచ్చి ఉంటే నాగర్కర్నూలులో ఏర్పాటుచేసి ఉండేవారమని తెలిపారు. 150 మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నా పోతున్నా సీఎం, మంత్రులు అబద్ధాలు చెప్తున్నారు. శ్రీనివాస్గౌడ్తో కలిసి భోజనం చేస్తుంటే కరెంటు పోయింది. నన్ను ఇబ్బంది పెట్టేందుకే తీశారేమోనని ఆరా తీస్తే రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని చెప్పారు.
-కేసీఆర్
పిడికిలెత్తి హర్షధ్వానాలు
తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్కు జరిగే పంచాయితీలో మీ పంజుగా ఎవరిని ఎన్నుకుంటారని ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ అడిగిన ప్రశ్నకు ‘కేసీఆర్ కేసీఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ‘తెలంగాణ ప్రజల తరఫున మీ పంజుగా నేను కొట్లాడాల్నా?’ అన్న ప్రశ్నకు.. ‘చేద్దాం.. చేద్దాం’ పిడికిలెత్తి ముక్త కంఠంతో నినదించారు. ‘మీ తరఫున ఈ దుర్మార్గపు కాంగ్రెస్ మెడలు వంచాలంటే నాకు మీ బలం ఇవ్వాలె. చదువుకున్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గెలవాలె’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.