(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కోవడానికి గట్టి ప్రతిపక్షం అవసరమని సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీని ఎదుర్కొనేవారిలో సీఎం కేసీఆర్ కూడా ముందువరుసలో ఉంటారని చెప్పారు. జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ వేదిక బీఆర్ఎస్ ఏర్పాటును స్వాగతించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ శూన్యత ఉన్నదని అన్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ‘టీ న్యూస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజ్దీప్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
కొత్త ఉద్యోగాల సృష్టి కష్టసాధ్యమే
కేంద్రానికైనా, రాష్ర్టాలకైనా నిరుద్యోగం అనేది పెద్ద సమస్యే. దీంతోపాటు ద్రవ్యోల్బణం కట్టడి, ధరల పెరుగుదలను నియంత్రించడం, గడ్డుకాలంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం అనేవి ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న ప్రధాన సవాళ్లు. రానున్న ఎన్నికల ఫలితాలను ఇవే ప్రభావితం చేస్తాయి. ఆర్థికంగా ప్రపంచ దేశాలు తిరోగమనంలో ఉన్నాయి. భారత్ కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ సంక్లిష్ట పరిస్థితులే నెలకొన్నాయి. ప్రైవేట్రంగంలో పెట్టుబడులు రావట్లేదు. కొవిడ్ సంక్షోభం తరువాత కొన్ని రంగాలు ఇంకా పుంజుకోలేదు. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాలను ఎలా గట్టెక్కించాలన్నది వచ్చే ప్రభుత్వాల ముందున్న సవాల్.
మోదీ నిర్ణయాలు వ్యాపారులకు శాపాలు
ఎప్పటికైనా భారత పౌర సమాజమే దేశాన్ని ముందుకు నడపాలి కానీ.. రాజకీయ నాయకులు కాదు. పౌరులు సాధికారత సాధించేందుకు చేయూతనిచ్చే వ్యవస్థలుగా మాత్రమే ప్రభుత్వాలు పనిచేయాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించేవిగా ఉండాలి. పారిశ్రామికరంగంలో నిజమైన స్టార్టప్ కల్చర్ను సృష్టించాలి. అప్పుడే భారతదేశం పురోభివృద్ధి సాధిస్తుంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కొవిడ్ మహమ్మారి.. ఈ మూడు అంశాలు చిన్నతరహా పరిశ్రమలకు, చిరు వ్యాపారులకు శాపాలుగా మారాయి. కరోనా తరువాత చిరు వ్యాపారులను, చిన్నతరహా పరిశ్రమలను రక్షించి, ప్రోత్సహించడంలో మోదీ సర్కారు విఫలమైంది.
రాష్ర్టాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం తగదు
రాష్ర్టాల పురోగతిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని నమ్ముతా. ఈ విషయంలో ఢిల్లీ పాలకుల పాత్ర చాలా తక్కువ. రాష్ర్టాలే దేశానికి బలం. శక్తిమంతమైన రాష్ర్టాలే దేశాభివృద్ధికి పునాదులు. రాష్ర్టాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం ఎంత తక్కువ ఉంటే, దేశానికి అంత మంచిది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను స్వయం ప్రతిపత్తితో స్వేచ్ఛగా పని చేయనివ్వాలి. ఆ సంస్థలు మరింత బలోపేతం కావాలి. అవి ఏకపక్షంగా వ్యవహరించకూడదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఈడీ, సీబీఐలాంటి సంస్థలను దుర్వినియోగం చేసిన ఉదాహరణలు ప్రస్తుతంతో పాటు గతంలోనూ ఉన్నాయి. అలాంటి చర్యలు వెంటనే ఆగిపోవాలి.
ఎన్టీఆర్తో కానిది.. కేసీఆర్ సాధిస్తారేమో
దేశంలో రాజకీయ శూన్యత ఉన్నది. ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉన్నది. అందుకు బలమైన ప్రతిపక్షం, శక్తిమంతమైన ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది. కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని ఏర్పాటుచేస్తున్నారు. జాతీయస్థాయిలో కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసిన కేసీఆర్కు శుభాకాంక్షలు. ఎన్టీఆర్తో సహా చాలామంది గతంలో దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ప్రయత్నం చేశారు. కానీ, వాళ్లు పాక్షికంగానే విజయం సాధించారు. గతంలో ఎన్టీఆర్ సాధించలేనిది.. ఇప్పుడు కేసీఆర్ చేస్తారని ఆశిద్దాం!
మోదీకి సవాల్ విసిరే నేతల్లో కేసీఆర్
దేశంలో రాజకీయాలు.. ‘కౌన్ బనేగా చాలెంజర్’ అనే రీతిలో కొనసాగుతున్నాయి. సమకాలీన రాజకీయాల్లో ప్రధాని మోదీకి సవాల్ విసిరే వారిలో కేసీఆర్, మమతాబెనర్జీ, నితీశ్కుమార్, రాహుల్గాంధీ ముందువరుసలో ఉన్నారు. వీళ్లలో ఎవరు చాలెంజర్గా నిలుస్తారన్నదే ప్రశ్న. బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కోవడానికి బలమైన ప్రతిపక్షం అవసరం.