రైతు జెండాను భుజానికెత్తుకుని బయల్దేరిన కేసీఆర్కు మహారాష్ట్ర రైతాంగం బ్రహ్మరథం పడుతున్నది. ప్రతిరోజూ ఏడుగురు రైతుల బలవన్మరణాల వార్తలతో తెల్లారుతున్న నేల అది. నీటి కోసం గోసపడిన బీడు భూములకు.. కన్నీటిని తుడిచే చెయ్యి కోసం దశాబ్దాలుగా కండ్లల్ల వత్తులేసుకుని చూస్తున్న రైతులకు.. కేసీఆర్ ఓ ఆశాదీపం.
నెర్రెలు బారిన నేల చినుకు కోసం తపించినట్టు కేసీఆర్ నాయకత్వం కోసం వారు తహతహలాడుతున్నారు. మహారాష్ట్ర రైతాంగానికి ఇప్పుడు కేసీఆర్ ఓ హీరో.
హర్యానా భూమి పుత్రుడు చోటారాం, తొలితరం రైతు ఉద్యమనేత మహేందర్ సింగ్ టికాయత్, అన్నదాతల హక్కుల గొంతుక నంజుండస్వామి, షేత్కరీ ఉద్యమనేత శరద్జోషి.. ఆ వరుసలో రైతుసేనానిగా మహా రైతాంగం ఇప్పుడు కేసీఆర్ను చూస్తున్నది. ఆయన నాయకత్వం కోసం తపిస్తున్నది. గులాబీ జెండా నీడ కోసం తరలివస్తున్నది. ఇప్పటికే మాణిక్రావ్ కదమ్ బీఆర్ఎస్లో చేరగా.. పలు రైతు సంఘాలు, అనేకమంది రైతు నేతలు అదే బాటపడుతున్నారు. ‘మిమ్మల్ని కలుస్తాం. మీతో నడుస్తాం’ అంటూ మహారాష్ట్ర షేత్కరీ సంఘటన ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ సుధాకర్రావు బిందు నేతృత్వంలో 52 మంది రైతు నేతలు బుధవారం కేసీఆర్కు సంఘీభావ లేఖ రాశారు.
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం వీస్తున్నది. రైతులు, యువజనం నుంచి అనూహ్యమైన, అద్భుతమైన స్పందన వస్తున్నది. ముఖ్యంగా గతనెల 5న నాందేడ్లో, ఈ నెల 26న కంధార్-లోహాలో నిర్వహించిన బ్రహ్మాండమైన సభల్లో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన సందేశం మరాఠా గడ్డపై ప్రకంపనలు సృష్టిస్తున్నది. దేశంలో రైతు ఉద్యమాలకు శక్తిమంతమైన కేంద్రంగా విలసిల్లిన మహారాష్ట్రలో నేడు ప్రతి రైతు నోట కేసీఆర్ అనే మాటే వినిపిస్తున్నది. రైతుల హక్కుల కోసం జీవితాంతం పోరాడి రైతు విమోచన ప్రవక్తగా ప్రఖ్యాతిగాంచిన షరద్ జోషీ తర్వాత అంతటి మహోన్నత రైతు నాయకుడు కేసీఆరేనని అక్కడి రైతు సం ఘాల నేతలు కుండబద్ధలు కొట్టి చెప్తున్నారు. నాందేడ్ సభ తర్వాత మహారాష్ట్ర రైతులకు కేసీఆర్ హీరోగా మారారు.
మహారాష్ట్రలో అత్యంత శక్తిమంతమైన రైతు సంఘం షేత్కరీ సంఘటన స్వయంగా సీఎం కేసీఆర్ను ‘భారతదేశ రైతుల పట్ల మార్షల్’ అని అభివర్ణించిందంటే కేసీఆర్ ప్రభంజనం ఏ స్థాయిలో ఉన్నదో అర్థంచేసుకోవచ్చు. ఈ మేరకు షేత్కరీ సంఘటనకు చెందిన మహారాష్ట్ర రైతు యువజన కూటమి మహారా ష్ట్ర అధ్యక్షుడు సుధీర్ సుధాకర్రావు బిందు స్వ యంగా సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఎవరో చెప్తే వినటం కాకుండా తాను స్వయంగా తెలంగాణలో పర్యటించి, అక్కడి పథకాలను అధ్యయనం చేసిన తర్వాతే సీఎం కేసీఆర్కు లేఖ రాసినట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రలో నేడు ప్రతి రైతు నేతతోపాటు ప్రతి సామాన్య రైతు కోరిక కూడా సీఎం కేసీఆర్ను స్వయంగా కలువటమేనని తెలిపారు.
తెలంగాణలో పథకాల ప్రభంజనం
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను స్వయంగా పరిశీలించినట్టు సుధీర్ సుధాకర్రావు తెలిపారు. ‘మా రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలువాలనుకొంటున్నట్టు విని ఆశ్చర్యపోయాం. వీరు ఎందుకు అలా కోరుకొంటున్నారో తెలుసుకొనేందుకు మేం స్వయంగా తెలంగాణ సరిహద్దుల్లోని 40 గ్రామాల్లో పర్యటించాం. తెలంగాణలో రైతులు, దళితులు.. ఇలా ప్రతి ఒక్కరికోసం మీరు 400 పైచిలుకు పథకాలు అమలు చేస్తున్నట్టు తెలుసుకొన్నాం. ముఖ్యంగా రైతుబంధు వంటి పథకాల పొందేందుకు పైసా లంచం ఇవ్వాల్సిన పనిలేదని అక్కడి ప్రజలు మాతో చెప్పారు. మీ పథకాల వల్ల తెలంగాణలోని తమ బంధువుల ఆర్థిక స్థితి అద్భుతంగా మారిపోయిందని మా రాష్ట్ర రైతులు తెలిపారు. అందుకే తాము తెలంగాణలో కలువాలనుకొంటున్నట్టు చెప్తున్నారు’ అని లేఖలో వివరించారు.
మీ రాకతో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం
నాందేడ్లో బీఆర్ఎస్ సభ తర్వాత ఆ జిల్లా లో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని సుధీర్ లేఖలో తెలిపారు. సీఎం కేసీఆర్ వస్తే రైతులకు మంచి జరుగుతుందనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ‘మహారాష్ట్రలో రోజుకు సగటున ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకొనేవారు. కానీ, నాందేడ్లో నిర్వహించిన మహాసభలో మీ ప్రసంగం విన్న తర్వాత ఆ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్టు మేం గుర్తించాం. నేడు మహారాష్ట్రలో ఏ ఇంట చూసినా కేసీఆర్ గురించే చర్చ జరుగుతున్నది. ప్రతి రైతు నోట కేసీఆర్ అన్న మాటే వినిపిస్తున్నది’ అని లేఖలో తెలిపారు.
మిమ్మల్ని కలుస్తాం.. కలిసి నడుస్తాం
మహారాష్ట్రలోని రైతు ఉద్యమకారులు నేడు సీఎం కేసీఆర్ను స్వయంగా కలువాలని కోరుకొంటున్నాడని సుధీర్ సుధాకర్రావు తెలిపా రు. సామాన్య రైతుల కోరిక కూడా అదే. మిమ్మల్ని కలువాలని కోరుకొంటున్న మా నా యకులు వందలు, వేలల్లో ఉన్నారు. మీ విలువైన సమయం కొంత కేటాయిస్తే ఎంపికచేసిన కొంతమందిమైనా మిమ్మల్ని కలుసుకొంటాం. రైతుల హక్కుల కోసం మీతో కలిసి నడుస్తాం’ అని అభ్యర్థించారు. మహారాష్ట్ర రైతు యువజన కూటమికి చెందిన 52 మంది నాయకులు లేఖపై సంతకాలు చేయటం విశేషం.
సుధీర్ సుధాకర్ బిందు
షేత్కరీ సంఘటన అధ్యక్షుడు కేసీఆర్కు రాసిన లేఖ
రైతు సేనాని, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రశేఖర్రావు గారికి సహృదయ నమస్సులు.
విశ్వవిఖ్యాత వ్యవసాయ ఆర్థిక వేత్త, రైతు విమోచన ప్రవక్త శ్రీశరద్ జోషి చివరిరోజుల్లో భారతీయ రైతుల పరిస్థితిని రెండో ప్రపంచయుద్ధంలో ధ్వంసమైపోయిన మిత్రదేశాలతో పోల్చేవారు. రైతులు పూర్తిగా పరాజితులయ్యారని, వారిని తిరిగి నిలబెట్టేందుకు మార్షల్ ప్లాన్ తరహా ప్రణాళిక అవసరమని చెప్పేవారు. రెండో ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైన యూరప్ మిత్రరాజ్యాలు అమెరికా విదేశాంగ మంత్రి జనరల్ మార్షల్ ప్రవేశపెట్టిన ప్రణాళిక అండదండలతోనే పునరుజ్జీవనాన్ని పొందాయి.
(తర్వాతి కాలంలో ఇదే మార్షల్ ప్లాన్గా సుప్రసిద్ధమైంది). అదే తరహాలో భారత రైతుల పునరుజ్జీవనానికి ఒక విస్తృత ప్రణాళిక అవసరమని శరద్ జోషి అభిప్రాయపడ్డారు. దీనికి ఆయన ‘రైతుల మార్షల్ ప్లాన్’ అని పేరుపెట్టారు. దీని అమలు గురించి 2014 లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో చర్చించారు. ఈ ప్రతిపాదనలో భాగంగా ఆయన రైతులకు విద్యుత్తు, సాగునీరు, బహిరంగ మార్కెట్ను సమకూర్చడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడం, వ్యవసాయంలో మూడు లక్షల కోట్ల పెట్టుబడుల గురించి కూడా ప్రస్తావించారు.
కొన్నాళ్ల క్రితం మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు తమను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి. దీనిని గమనించిన మేము ఒక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్రంలో చేరిపోతామని అడగడం వెనుక కారణాలు ఏమై ఉంటాయా.. అని ఆలోచించాం. ఇది తెలుసుకొనేందుకు హొట్టల్కు చెందిన శ్రీ నర్సింగ్ దేశ్ముఖ్, పాత్రికేయులు శ్రీ గంగాధర్ ప్రచండ ఇతర సహచరులతో చేపట్టిన ఈ యాత్రలో చేరిపోయాను. 40 గ్రామాల్లో ఈ యాత్ర జరుపగా ప్రతి ఊరివారు తెలంగాణ ప్రభుత్వం తన పౌరులు, రైతులు, దళితులు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం చేపట్టిన 400 పైచిలుకు పథకాల గురించి మాట్లాడారు.
మరీముఖ్యంగా రైతుల కోసం చేపట్టిన రైతుబంధు గురించి ప్రతిచోటా ప్రస్తావన వచ్చింది. అనేకమంది గత ఏడెనిమిది ఏండ్లలో తెలంగాణలోని తమ బంధువులు ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పుల గురించి చెప్పారు. దాంతో మాలో ఆసక్తి పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం నిజంగానే ఈ పథకాలన్నిటినీ అమలు చేస్తున్నదా అనేది తెలుసుకొనేందుకు మేము తెలంగాణ పల్లెలకు వెళ్లి గ్రామీణులను అడిగాం. వారు మాకు ప్రతి పథకం గురించి చూపి మా సందేహాలను తీర్చారు. ఈ పథకాల ప్రయోజనాలకు పొందేందుకు తాము ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పనేలేదని వారంతా చెప్పడం విశేషం.
మీరు మీ రాష్ట్రంలోని రైతులకు అమలు చేస్తున్న పథకాలు శరద్ జోషీ సూచించిన మార్షల్ ప్లాన్ తరహాలోనే ఉన్నాయి. నా దృష్టిలో మీరు భారతీయ రైతులకు మార్షల్ వంటివారు. మీ పథకాల ప్రభావంతో రైతు ఆత్మహత్యలు తగ్గడం అనేది వాటివలన ఒనగూడిన అతిపెద్ద ప్రయోజనం. మీ పథకాల లబ్ధి దేశప్రజలందరికీ లభించాల్సి ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రకు దాని అవసరం ఎంతో ఉన్నది. మహారాష్ట్రలో ప్రతిరోజు సగటున ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నారు. మహారాష్ట్రకు మీ రాక రైతుల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. మీరు గనుక గమనిస్తే, మీ సభ తర్వాత నాందేడ్లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. మీ రాకతో తమకు మంచి జరుగుతుందని మహారాష్ట్ర రైతులు భావిస్తున్నారు. ఇది వారిలో భరోసా నింపిందని చెప్పవచ్చు. రైతు ఉద్యమాల్లో పనిచేసిన నేతలకు, మావంటి కార్యకర్తలకు రైతుల ఆశాజ్యోతి శరద్ జోషి దివంగతులైన తర్వాత ఇక ఎవరు దిక్కనే ప్రశ్న తీవ్ర ఆందోళకు గురిచేసింది.
కిసాన్ సంఘటన్ నాయకుడు మాణిక్రావు కదమ్ మహారాష్ట్రలోని ప్రతి జిల్లాలో పనిచేస్తున్న చిన్నాపెద్దా నాయకులకు మీతో కలిసి పనిచేయాల్సిందిగా పిలుపునిచ్చారు. మీరు మహారాష్ట్రలో నిర్వహించిన రెండు సభలతో ఇక్కడ రాజకీయ హల్చల్ పెరిగింది. మీరు ఇచ్చిన పిలుపుపై సామాన్యులు సైతం ఆలోచిస్తున్నారు. ఇవాళ మహారాష్ట్రలోని ప్రతి ఇంటిలో కేసీఆర్ గురించి చర్చ జరుగుతున్నది.
మాతో కలిసి శ్రీరైతు ఉద్యమంలో పనిచేస్తున్న వారంతా మీతో కలిసి అడుగేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను, నా తోటి నాయకులు, కార్యకర్తల బలగం మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ లేఖ ద్వారా మీకు మనవి చేసుకొంటున్నాను. మీరు తమ విలువైన సమయంలో కొంత మాలో కొందరికి కేటాయించి సహకరించగలరని వినతి.
ధన్యవాదాలు..
-సుధీర్ సుధాకర్రావు బిందు
రాష్ట్ర అధ్యక్షుడు, షేత్కరీ సంఘటన యువ కూటమి