హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకులాల విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఒక్కో గురుకుల విద్యార్థిపై ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలపై శుక్రవారం శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఏ ఆస్తి లేకున్నా మంచి విద్య అందిస్తే పిల్లలు పోటీ ప్రపంచంలో బతకగలరన్న ఉద్దేశంతో గురుకులాలు ప్రారంభించేముందు చిన్నారుల కోసం ప్లే స్కూళ్లు పెట్టాలని భావించామని తెలిపారు. ఐదో తరగతిలోపు పిల్లలు మరీ చిన్నవారు కాబట్టి వారికి జ్వరాలు, ఇతర సమస్యలు ఎదురవుతాయని చర్చల సందర్భంగా నిపుణులు, మేధావులు చెప్పటంతో పునరాలోచనలో పడ్డామని, అంగన్వాడీ సెంటర్లలో ప్లేస్కూల్లాగా ఏర్పాట్లు చేయాలని ఆలోచించినా కరోనా వల్ల వీలుకాలేదన్నారు. ప్రస్తుతం ఐదో తరగతి నుంచి అందిస్తున్న గురుకుల విద్య దేశంలో ఎక్కడాలేని విధంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్లే వెళ్లిపోయారు
ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను ఎవరూ తొలగించలేదని, వాళ్లే వెళ్లిపోయారని కేసీఆర్ తెలిపారు. ‘నిజానికి ఫీల్డ్ అసిస్టెంట్లు వెళ్లిపోయిన తర్వాత నిధుల వినియోగం బ్రహ్మాండంగా పెరిగింది. పని దినాలు పెరిగాయి. అస్తుల సృష్టి జరుగుతున్నది. అంతకుముందు గొల్లవాడ నుంచి దళిత వాడకు, దళిత వాడ నుంచి గొల్లవాడకు.. ఇటుకెళ్లి అటు, అటుకెళ్లి ఇటు రోడ్డు పోసుడు.. ఇలాంటి అక్రమాలు అనేకం జరిగాయి. కొన్ని మా దృష్టికి వచ్చాయి. మేం అనేక మందికి మంచి చేస్తున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగులు కాకపోయినా ఉద్యోగులు అనే భ్రమలో ఎవరో ప్రోత్సహిస్తే సమ్మెకుపోయారు. వాళ్లకు వాళ్లే వెళ్లిపోయారు. వాళ్లను ఎవరూ తీసివేయలేదు. ఇప్పుడు మళ్లీ తీసుకోవాలంటున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం’ అని సీఎం తెలిపారు.