KCR | హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ, సీఎం రేవంత్రెడ్డి ఇద్దరూ ఒకటేనని, పైకి మాత్రమే వేర్వేరుగా కనిపిస్తున్నట్టు నాటకాలు అడతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇద్దరూ మిలాఖత్ కాకపోతే రేవంత్పై విచారణకు ఆదేశించాలని, ఆర్ఆర్ ట్యాక్స్పై ఈడీతో విచారణ జరిపించాలని మోదీని డిమాండ్ చేశారు. వీరిలో ఎవరికి ఓటేసినా గోదావరిలో వేసినట్టేనని, రాష్ర్టానికి ఎలాంటి లాభం ఉండబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కథ అయిపోయిందని.. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. మంగళవారం కొత్తగూడెం రోడ్షోలో కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ ఆందోల్ సభలో మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి ‘ఆర్ ట్యాక్స్’ వసూలు చేస్తున్నారని అన్నారని, అది నిజమే అయితే, ఇద్దరూ మిలాఖత్ కాకపోతే వెంటనే రేవంత్పై విచారణకు ఆదేశించాలని మోదీని డిమాండ్ చేశారు. వెంటనే ఈడీ, ఐటీని దించాలని, ఎక్కడెక్కడ దొంగతనం జరిగిందో పట్టుకోవాలని సవాలు విసిరారు. ఇవన్నీ మోదీకి చేతకాకే మీదికి నాటకాలు ఆడుతున్నారని, కచ్చితంగా ఇద్దరూ ఒక్కటేనని పేర్కొన్నారు.
ఖమ్మం నుంచి కొత్తగూడెం వస్తుంటే కార్లల్లో, ట్రాక్టర్లలో, ఆటోల్లో వెళ్లే వారందరూ ‘జై కేసీఆర్’ అని నినదిస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ కథ ఇక అయిపోయిందని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని తెలిపారు. తెలంగాణ సమస్యలు పరిష్కారం కావాలన్నా, తెలంగాణ నదులు, తెలంగాణ నీళ్లు తెలంగాణకే చెందాలన్నా, కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవం నిలబడి ఉండాలన్నా కచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థులైతేనే వీటిపై పోరాటం చేయగలుగుతారని పేర్కొన్నారు.
కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశామని, ఖమ్మం పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నామని కేసీఆర్ తెలిపారు. చెర్ల, వాజేడు, దుమ్ముగూడెం మండలాల ప్రజలు ఖమ్మం వెళ్లేందుకు పడిన ఇబ్బందులను గుర్తుచేశారు. వారి ఇబ్బందులను తొలగించేందుకే కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పుడు రాష్ర్టాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి కొత్తగూడెం జిల్లాను తీసేస్తామని స్పష్టంగా చెప్తున్నారని పేర్కొన్నారు. మరి కొత్తగూడెం జిల్లా ఉండాలా? తీసేయాలా? అని రోడ్షోకు హాజరైన వారిని ప్రశ్నించారు. కొత్తగూడెం జిల్లా ఉండాలన్నా, ఇక్కడి ప్రజలకు లాభం జరగాలన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్లో కవితను గెలిపించాలని కోరారు.
అరచేతిలో వైకుంఠం చూపించి, అడ్డగోలు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారుణంగా మోసం చేసిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 15 వేలు ఇస్తామన్న రైతుబంధు, కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతోపాటు తులం బంగారం, మహిళలకు రూ. 2,500, రూ. 2 లక్షల రుణమాఫీ వంటివి ఎవరికైనా ఎవరికైనా వచ్చాయా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించి అందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ చెప్పినప్పటికీ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. వారు ఇస్తామన్నవి ఇవ్వకపోగా, కేసీఆర్ ఇచ్చిన వాటిని కూడా రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో 24 గంటల కరెంటు వచ్చేదని, అప్పుడు రెప్పపాటు కూడా పోని కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైందని ప్రశ్నించారు.
గిరిజనుల కోసం, మైనార్టీల కోసం, బీసీల కోసం 1100 గురుకులాలు ఏర్పాటు చేశామని, వారి బతుకుల బాగుకోసం కృషి చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. గురుకులాల్లో చదువుకున్న పిల్లలు ఐఐటీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిపారు. పేద బిడ్డలు విదేశాల్లో చదువుకునేందుకు రూ. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చామని గుర్తు చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ అయినా ఇస్తున్నారా? అని నిలదీశారు. ఏవీ ఇవ్వకుండా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. కరెంట్ రావడం లేదు, రైతుబంధు రాలేదు, రుణమాఫీ కాలేదు.. ఇలా ఏ హామీనీ అమలు చేయకుండా అడ్డగోలు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైన పనులు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త జిల్లాలను తీసేస్తామని రేవంత్రెడ్డి చెప్తున్నారని, వాటిని పనిలేక పెట్టామా? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పరిపాలన చేరువ కావాలని, అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావాలనే కొత్తగూడెంను జిల్లా చేసి కలెక్టరేట్ నిర్మించినట్టు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని తీసేస్తామని చెప్తున్నదని ఆరోపించారు.
పదేండ్ల క్రితం గద్దెనెక్కిన మోదీ నేతృత్వంలోని బీజేపీ ఒక్క మంచి పనైనా చేసిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘భేటీ పడావో.. భేటీ బచావో’ ఎక్కడైనా కనిపించిందా? ‘అమృత్ కాల్’ ఎక్కడైనా వచ్చిందా? ‘అచ్చేదిన్’ వచ్చాయా? అని ప్రశ్నించారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ. 83కు పతనమైందని పేర్కొన్నారు. మోదీ వంటి దరిద్రమైన, దుర్మార్గ పాలనను మళ్లీ మనం చూడబోమని చెప్పారు. మతాల మధ్య పంచాయితీ పెట్టి, మనలో ఉద్వేగం నింపి ఓట్లు దండుకోవడం తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు.
తాను సీఎంగా ఉన్నప్పుడు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ తనకు షరతు పెట్టారని, కానీ తన తల తెగిపడినా పెట్టేది లేదని తేల్చి చెప్పానని కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు చోటేభాయ్ రేవంత్, బడేభాయ్ మోదీకి ఓటేస్తే ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఆలోచించుకోవాలని సూచించారు. వారొస్తే మోటర్లకు మీటర్లు పెడతారని, జాగ్రత్త అని హెచ్చరించారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టొదంటే తెలంగాణ కోసం పేగులు తెగేవరకు కొట్లాడే బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, కవిత గెలవాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్ పథకంతో ఆటో కార్మికులు రోడ్డునపడ్డారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయని, వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.ఆటోరిక్షా కార్మికుల బతుకులు బాగుపడాలంటే కచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని తెలిపారు.
పేద పిల్లలు చదువుకునేందుకు తాము ఏర్పాటు చేసిన గురుకులాల గతి ఇప్పుడు ఏమవుతున్నదని కేసీఆర్ ప్రశ్నించారు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులంటే అలుసా? పట్టింపు లేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెస్తానని చెప్పిన. నాతో ఎవరూ లేకపోయినా నా ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్ర్టాన్ని తెచ్చిన. తెచ్చిన తెలంగాణలో కులమతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని సాదుకున్నాం. శాంతి భద్రతలు అద్భుతంగా ఉండేవి. ఏనాడూ హిందువులు, ముస్లింల మధ్య కొట్లాటలు జరగలేదు. ఏ రకమైన అలజడి జరగలేదు. ఈ రోజు నోరు తెరిస్తే చాలు హిందూ, ముస్లిం అని మాట్లాడుతూ ప్రజల్లో విద్వేషం నింపుతూ ఘోరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి యువకులు, విద్యార్థులు, మేధావులు నేను చెప్పే మాటలపై చర్చించండి. నేను చెప్పేది నిజమా? కాదా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? ఈ రాష్ర్టాన్ని ఎవరు కాపాడాలో ఆలోచన చేయండి’ అని కేసీఆర్ కోరారు.
కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో దొంగతోపు అనే అతిచిన్న గిరిజన గూడేనికి కూడా మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. అలాంటి మిషన్ భగీరథ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన బిడ్డలు వ్యవసాయం చేసుకొని బతకాలనే ఉద్దేశంతో కోట్లు ఖర్చు చేసి త్రీఫేజ్ కరెంట్ ఇచ్చామని, ఇప్పుడు కరెంటు సరిగా రాకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయని, పొలాలు ఎండిపోతున్నాయని, రైతులు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రంలోనే కొత్తగూడెం జిల్లాలో అత్యధిక పోడు పట్టాలు పంపిణీ చేసి గిరిజన బిడ్డలకు అండగా నిలిచిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. 1.55 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వడంతో పాటు వెంటనే ఆ రైతులకు రైతుబంధు ఇచ్చామని, రైతుబీమా కల్పించామని తెలిపారు. మరి ఇప్పుడు ఆ గిరిజన రైతుల పోడు భూములకు రైతుబంధు వచ్చిందా? అని ప్రశ్నించారు. రాలేదంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరి యుద్ధం చేద్దామా? పోరాడుదామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. గిరిజన బిడ్డల కోసం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్లో బంజారా భవన్, ఆదివాసీ భవన్ నిర్మించినట్టు చెప్పారు. 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో గతంలో ఎప్పుడైనా, ఏ ప్రభుత్వమైనా ఇలా చేసిందా? అని ప్రశ్నించారు.
మోదీ కన్ను ఇప్పుడు మన నీళ్లపై పడిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన గోదావరి నీళ్లను ఎత్తుకెళ్లి తమిళనాడు, కర్ణాటకకు ఇస్తామంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క ఆధారం గోదావరి నది మాత్రమేనని, దానిని కూడా ఎత్తుకుపోతే తెలంగాణ ప్రజల బతుకులు ఏం కావాలని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం దగ్గర దుమ్ముగూడెం సమీపంలో ఖమ్మం జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలు ఏనుకూరు, జూలూరుపాడుతో పాటు కిందికున్న ప్రాంతాలు, సాగర్లో నీళ్లు తక్కువైనప్పుడు ఇలా అన్నింటికీ సీతారామ ప్రాజెక్టు మాత్రమే ఆధారమని తెలిపారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చంపల్లి దగ్గర ఆనకట్ట కట్టి ఉన్న నీళ్లను తమిళనాడు, కర్ణాటకకు తరలించుకుపోతే తెలంగాణ గతి ఏం కావాలని ఆవేదన వ్యక్తంచేశారు. మరి అలాంటి మోదీకి, బీజేపీకి ఒక్క ఓటైనా ఎందుకు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణకు మొత్తం గోదావరినే లేకుండా చేస్తామంటే ఈ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని, దీని వెనకున్న మతలబేంటని నిలదీశారు.
సింగరేణి బిడ్డల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని కేసీఆర్ పేర్కొన్నారు.తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్తో పాటు బోనస్ కూడా ఇచ్చామని గుర్తుచేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వేతనాలు పెంచినట్టు తెలిపారు. ఇప్పుడీ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ముంచే కార్యక్రమంలో ఉందని ఆరోపించారు. సింగరేణిలో బొగ్గు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా నుంచి అదానీ తీసుకొచ్చే బొగ్గునే దిగుమతి చేసుకోవాలని తాను సీఎంగా ఉన్నప్పుడు మోదీ తనతో పంచాయితీ పెట్టుకున్నారని తెలిపారు. సింగరేణి ఉండగా ఆస్ట్రేలియా బొగ్గు తమకెందుకని, టన్ను బొగ్గు కూడా కొనేది లేదని తేల్చి చెప్పానని, అలా సింగరేణిని కాపాడేందుకు ప్రయత్నించామని వివరించారు.
కొణిజెర్ల వద్ద ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నది. కాంగ్రెస్, సీపీఐ కార్యకర్తలు రోడ్డుకు కొద్దిదూరంలో నిల్చున్నారు. అటువైపు కేసీఆర్ బస్సు యాత్ర వస్తుందని గమనించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గుంపు రోడ్డుమీదికి వచ్చేందుకు ప్రయత్నించింది. పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినా వారు కేసీఆర్ బస్సు తమ సమీపంలోకి రాగానే ఒకచేత్తో జెండా, మరోచేత్తో ‘జై కేసీఆర్…’ అంటూ నవ్వుతూ పిడికిళ్లు ఎత్తారు. కేసీఆర్ సైతం బస్సులోంచి వారికి అభివాదం చేస్తూ విజయసంకేతాన్ని చూపారు. మరోసారి జై కేసీఆర్.. జై తెలంగాణ’ అని నినదించారు.