హైదరాబాద్/సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హాకు ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ఉదయం 11.35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొన్న యశ్వంత్సిన్హాకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పుష్పగుచ్ఛం అందజేశారు. విమానాశ్రయం వద్ద సీఎం కేసీఆర్ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను యశ్వంత్సిన్హాకు పరిచయం చేశారు. స్వాగతం పలికినవారిలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్కుమార్, వీ శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు గడ్డం రంజిత్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, జీవన్రెడ్డి, కోరుకంటి చందర్, నడిపెల్లి దివాకర్రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు తదితరులు ఉన్నారు.
అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి నెక్లెస్రోడ్డులోని జలవిహార్కు 5వేల బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దారిపొడవునా యశ్వంత్సిన్హాకు స్వాగతం, జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నిండింది. టీఆర్ఎస్ శ్రేణులు తమ బైక్లకు గులాబీ జెండాలు, కండువాలు కట్టుకొని తరలిరావడంతో పాటు స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడంతో దారిపొడవునా గులాబీవనాన్ని తలపించింది. ఈ ర్యాలీ బేగంపేట క్యాంపు కార్యాలయం, సోమాజిగూడ, రాజ్భవన్రోడ్డు, ఖైరతాబాద్చౌరస్తా, నెక్లెస్రోడ్డు మీదుగా జలవిహార్కు చేరుకొన్నది. ఉదయం నుంచే టీఆర్ఎస్ శ్రేణులతో బేగంపేట ఎయిర్పోర్ట్ ప్రాంగణమంతా కోలాహలంగా కనిపించింది. 12.56 గంటలకు నెక్లెస్రోడ్డులోని జలవిహార్ వేదిక వద్దకు యశ్వంత్సిన్హా, సీఎం కేసీఆర్ చేరుకొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభాప్రాంగణానికి చేరుకొన్నారు. ఈ సందర్భంగా యశ్వంత్సిన్హాకు మేళతాళాలు, మంగళహారతులు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ ఆతిథ్యం మరువలేను: యశ్వంత్సిన్హా
హైదరాబాద్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తనకు ఘన స్వాగతం లభించిందని యశ్వంత్సిన్హా సంతోషం వ్యక్తంచేశారు. తెలంగాణలో తనకు లభించిన ఆతిథ్యం, అభిమానం మరవలేనిదని చెప్పారు. శనివారం బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో ఎంఐఎం నేతలతో సమావేశమైన అనంతరం యశ్వంత్సిన్హా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, ఛత్తీస్గఢ్లో పర్యటించానని తెలిపారు. హైదరాబాద్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యాయని చెప్పారు. దేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల కారణంగా రాష్ట్రపతి ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకొన్నదని వివరించారు. రాబోయే రోజుల్లో దేశంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయని అన్నారు.