KCR | కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చింది.. ఇప్పుడు తులం బంగారం యాడపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గురుకులాల పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ వాటిని అద్భుతంగా నడిపిస్తే ఐఐటీలు, ఐఐఎంలలో, మెడిసిన్, ఇంజినీరింగ్లో వేలాది దళిత, గిరిజన, బలహీనవర్గాల బిడ్డలు ఓవర్సిస్ సాల్కర్షిప్ తీసుకొని విదేశాల్లో విద్యాభాస్యం కొనసాగిస్తున్నారు. కుల, మతాల ప్రసక్తి లేకుండా కల్యాణలక్ష్మి ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది. కేసీఆర్ రూ.లక్షనే ఇస్తున్నడు. మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పారు. యాడికి పోయింది తులం బంగారం. మొన్న సిరిసిల్లలోనే అడిగినా. తులం బంగారం కొందామంటే మార్కెట్లో దొరుకతలేదా? ఈ ప్రభుత్వానికి.
ఇది ప్రజలను మోసం చేయడం కాదా? కులవృత్తులపై ఆధారపడ్డ బిడ్డలకు గొల్లకుర్మలకు గొర్రెలు, గంగపుత్రులకు వందకోట్లు రూపాయలు వెచ్చించి చేపపిల్లలు పెంచాం. చేనేత కార్మికులకు పని కల్పించాం. సబ్సిడీలు ఇచ్చాం. గౌడ కులస్తులకు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పని చేసి చెట్ల మీద ఉండే రకాన్ని వందకు వందశాతం రద్దు చేశాం. ఈ విధంగా బలహీన వర్గాలకు బ్రహ్మాండంగా సహాయం చేశాం. బీసీబంధు పెట్టి బలహీన వర్గాలను ఆదుకున్నాం. వీటన్నింటిని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తదా ? శఠగోపం పెట్టిందా? వాళ్ల పాలసీ ఏందీ? దయచేసి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నా. మీరందరూ గమనించాలి’ అన్నారు.
‘ఒక మాట నాకు అర్థమవుతలేదు. 11 సంవత్సరాల కిందట చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. ఒకటిన్నర సంవత్సరంలో కరెంటును బ్రహ్మాండంగా తయారు చేసి, రైతాంగానికి, ఇండ్లళ్లకు, పరిశ్రమలకు, ఐటీరంగానికి అందరికీ 24గంటల కరెంటు సరఫరా తొమ్మిది సంవత్సరాల పాటు ఇచ్చాం. కేసీఆర్ పక్కకు పోంగనే కరెంటు ఎందుకు మాయమైంది ? దీనికి కారణం ఏందీ? ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? వీళ్లే మనకు ఇప్పుడు సమాధానం చెప్పాలని నేను కోరుతున్నా. వీళ్లు కొత్తగా చేసే అవసరం ఏం లేదు. గత ప్రభుత్వం ఎట్ల నడిపిందో అట్ల నడిపిస్తే సరిపోయే పరిస్థితి. దాన్ని కూడా సరిగా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ ఉంది. అది కూడా మీరు ఆలోచన చేయాలి’ అన్నారు.
‘మిషన్ భగీరథ అద్భుత పథకం. ఐక్యరాజ్య సమితి కూడా మనన్ననలు అందించిన పథకం. 10-11 రాష్ట్రాలు మేం కూడా చేసుకుంటామని ఇక్కడికి వచ్చిచూసి అభినందించిన పథకం. ఇవాళ మంచినీళ్లకు ఎందుకు కొరత వస్తుంది? ట్యాంకర్లు ఎందుకు వస్తున్నయ్ ? బోర్లు వేసే పరిస్థితి ఎందుకు వస్తుంది ? ఇది ఎవరి తెలివితక్కువ తనం దయచేసి ఆలోచన చేయాలి. కొత్తవి రాకపోయినా ఉన్నవి ఊడగొడుతున్నరు. అవన్నీ మీరు చూస్తున్నరు. కరెంటుకు ఏం రోగం వచ్చింది? మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నరు ? ఇది ఏం లోపం ? మరి ఎట్ల సరికావాలా? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓ నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ప్రజల చేతుల్లో మంచి పద్ధతి, అభివృద్ధికిపోయిన రైతుల చేతులలో ఉన్న ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ప్రజలకు ఎందుకు రావాలి ? ఇవాళ ప్రజలకు ఏం కావాలి. ప్రజల చేతుల్లో ఓ అంకుశం కావాలి. ఒక హంటర్ కావాలి. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మెడలు వంచి ఇవన్నీ చేయించేటటువంటి ఒక అంకుశం కావాలి’ కేసీఆర్ అన్నారు.