Palamuru | హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): నీరు ప్రాథమిక అవసరం. జీవ మనుగడకు మూలం. దానిని ప్రతి ఒక్కరికీ అందివ్వడం పాలకుల ప్రాథమిక బాధ్యత. రాజ్యాంగ హక్కు. కానీ ఉమ్మడి పాలనలో ఈ అంశంలో అత్యంత వివక్షకు, నిర్లక్ష్యానికి గురైంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. అక్కడ ప్రతి రెండేండ్లకోసారి కరువు తాండవించేది. వరుసగా ఏ పదేండ్ల రికార్డులను పరిశీలించినా అందులో ఆరేండ్లు కరువు నెలకొన్నట్టు స్పష్టమవుతుంది. ఆ సమయంలో వానకాలం సీజన్లో 50 శా తానికి పైగా పంటలు డ్రై స్పెల్స్ వల్ల నష్టపోవాల్సిన దుస్థితి. పత్తిని రెండుసార్లు, మకజొన్నలను నాలుగుసార్లు విత్తుకున్న సందర్భాలు అనేకం. పక్కనే కృష్ణమ్మ.. నాటి పాలకులు ప్రాజెక్టులు కట్టిందీ లేదు.. ఎత్తిపోతలను పూర్తి చేసిందీ లేదు.
వర్షపాతం చాలా తక్కువ. వాన చినుకును ఒడిసిపట్టే వ్యవస్థలనైనా బలోపేతం చేశారా? అంటే అదీ లేదు. వెరసి భూగర్భజలాలపైనే జీవనాధారం. వందల మీటర్లు బోర్లు వేసినా నీళ్లు పడని ప్రాం తాలు అనేకం. యావత్ జిల్లా ఏనాడూ డార్క్ జోన్ దాటి రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కరువు వ్యతిరేక పోరాటాలు నిత్యకృత్యమైన నేలగా పేరుబడింది. తాగు, సాగునీటికి తీవ్ర కరువు. జిల్లా జనాభాలో మూడోవంతు వలసబాట పట్టిందంటే ప్రధాన కారణమదే. ఏనాడూ పాలమూరులో కరువు శాశ్వత నివారణకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు చర్యలు తీసుకోలేదు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలమూరుకు మంచిరోజులొచ్చాయి. సీఎం కేసీఆర్ దార్శనికత.. బహుముఖ వ్యూహాల అమలుతో కరువు నేలపై జలసవ్వళ్లు వినబడుతున్నాయి. భూగర్భ జలాల పెంచే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తొలుత మిషన్ కాకతీయ పథకం కింద 2,645 చెరువులను పునరుద్ధరించింది. పూడికలు తీయించింది. తూములు, కాలువలకు మరమ్మతులు చేయించింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసింది. చెక్డ్యామ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. కురిసిన ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టేందుకు కావాల్సిన వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసింది. మరోవైపు చెరువులు, పలు చెక్డ్యామ్లను ప్రధాన ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేసింది. ప్రాజెక్టుల ద్వారా చెరువులు, చెక్డ్యామ్లను గత మూడేండ్లుగా నిం పుతున్నది. స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు చేపట్టిన సమగ్ర చర్యల మూలంగా నీటి సంరక్షణ చర్యలు నేడు సత్ఫలితాలనిస్తున్నవి. భూగర్భజలాల స్థాయిని, బోర్వెల్ల స్థిరత్వాన్ని పెంచడానికి దోహదపడుతున్నాయి.
పెరిగిన సాగునీటి వసతులతో పాలమూరు ముఖచిత్రమే మారిపోతున్నది. ఒకనాడు కిలోమీటర్ల మేర నెర్రబారిన నేల నేడు పచ్చదనంతో పరవశించిపోతున్నది. ప్రభుత్వం సాగునీటి వసతులను కల్పించడమేగాక అమలు చేస్తున్న ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాల వల్ల పాలమూరు రైతులు ఎంతో ఉపశమనం పొందుతున్నారు. అందుకే నాడు ఒక్క పంట సాగుకే ఆకాశంవైపు చూస్తూ వెనకాముందు ఆలోచించిన పాలమూరు జిల్లా రైతులు నేడు ఎలాంటి సంకోచం లేకుండా రెండు కార్ల పంటలను తీస్తుండడం నాటికి, నేటికి మారిన పరిస్థితులను చెప్పకనే చెప్తున్నది. కేవలం పత్తి, బుడ్డల సాగుకే పరిమితమైన రైతన్న నేడు తరి పంటలతోపాటు వినూత్న పంటల సాగును కూడా విస్తృతంగా చేపడుతూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాడు. చెరువుల నుంచి కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేసుకొని పసిడి పంటలను పండిస్తున్నారు. డెయిరీ, పౌల్ట్రీ ఫారాలను ఏర్పాటు చేస్తున్న రైతుల సంఖ్య కూడా రోజురోజుకూ ఆ జిల్లాలో పెరుగుతున్నది. కరువుతో అల్లాడిన అదే నేల ఇప్పుడు కాయగూరలను పెద్ద ఎత్తున పండిస్తూ ఎనో పట్టణాలకు ఎగుమతి చేస్తుండటం మారిన పరిస్థితులకు దర్పణం పడుతున్నది. ఫలితంగా పాలమూరు జిల్లా లో ఇప్పుడు స్వల్పకాలిక వలసలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.
తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 83.3% విస్తీర్ణంలో (2,211 చదరపు కిలోమీటర్ల) భూగర్భజలాల లభ్యత 10 మీటర్ల కంటే ఎక్కువ దిగువన ఉండేది. అందులో 8.3% ప్రాంతం పూర్తిగా రెడ్జోన్లో ఉండేది. అక్కడ 20 మీటర్లకు మించిన లోతులో భూగర్భ జలాలు ఉండేవి. మరో 16.8శాతం ప్రాంతంలో 15 నుంచి 20 మీటర్ల లోతులో భూగర్భ జలాలతో ఆరెంజ్జోన్లో ఉండేది. ప్రస్తుతం మిషన్ కాకతీయ, చెక్డ్యామ్ల నిర్మాణం, ప్రాజెక్టులతో అనుసంధానం ఫలితంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. డార్జోన్ లేదా ఆరెంజ్జోన్ లేనేలేదు. భూగర్భ జలమట్టం 7.56 మీటర్లుగా నమోదవడం విశేషం. చెక్డ్యామ్లు 30 వేలకు పైగా ఎకరాలకు ప్రత్యక్షంగా సాగునీరందిస్తున్నాయి. మిషన్భగీరథ ద్వారా సమృద్ధిగా తాగునీరు అందుతుండటంతో ఇప్పుడు జిల్లాలో నీటి కరువు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కాలువల ద్వారా నిరంతరం నీరు ప్రవహిస్తుండటం వల్ల భూగర్భ జలాల వృద్ధి పెరుగుతున్నది. నేడు రెండు పంటలకు భరోసా దక్కుతుండటం సర్కారు కృషి ఫలితం. మిగిలిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సైతం పూర్తయితే జిల్లా పూర్తిగా సస్యశ్యామలమవుతుంది. ప్రస్తుతం మండుటెండల్లోనూ వనపర్తి టెరిటోయల్లో వెయ్యికి పైగా చెరువులు, మహబూబ్నగర్లో 2500కు పైగా చెరువులు, నాగర్కర్నూల్ టెరిటోరియల్ పరిధిలో 1500కు పైగా చెరువులు నిండుగా దర్శనమిస్తున్నాయి.
నాకు ఆరెకరాలున్నది. ఇందులో మూడెకరాలు మెట్ట, మూడెకరాలు తరి. కల్వకుర్తి కాలువ రాకముందు మొత్తం బుడ్డలు ఏసేటోన్ని. బోరు వేసినా ఫలితం లేకుంటపోయింది. గంట పారించిన ఎకరం మడి పారకపోయేటిది. ఇక వర్షాలు లేకుంటే బతుకుదెరువుకు వలసపోతుంటిని. కానీ కేసీఆర్ వచ్చినంక ఆ బాధలు తప్పినయ్. కాల్వ నీళ్లు ఇడుస్తున్నప్పటి సంది నీటి వూటలు పెరిగినయ్. బోర్ల నీళ్లకు సావులేకుంటైంది. ఇప్పుడు మెట్టనే కాదు పొలం సుత చేస్తున్న. రెండుకార్లు పంటలేస్తున్న. అంత కేసీఆర్ పుణ్యమే. ఇప్పుడు కూలోళ్లు కూడా వలస పోవుడు బంద్ చేసిన్రు.
– ఆవుల బాలపీరు, కమ్మారెడ్డిపల్లి, తెలకపల్లి మండలం (నాగర్కర్నూల్ జిల్లా)
నాడు నీళ్లంటే బంగారం లెక్క ఉండేది. ఎంత తల్లడించినం అనుకున్నరు. ఒకతీరు కట్టాలు కావవి. ఎంత చెప్పినా తక్కువే. అరిగోస పడ్డం. బోరు ఏత్తే బక్కెట్ నీళ్లు సుత పోసేటి కాదు. ఉన్న 2.5 ఎకరాల్లో పత్తి, లేదంటే బుడ్డలు ఏసేటోన్ని. అవి చేతికి వచ్చేదాన్క నమ్మకం లేకపాయె. మూడేండ్ల సంది కల్వకుర్తి పెద్దకాలువ నీళ్లు వత్తనయ్. ఏడాది పొడవునా పారుతంది. మా చెరువు సుత నింపుతున్నరు. బోరు నిండుపోత్తంటే మనసుకు నిమ్మలంగ ఉన్నదో. ఇప్పుడు నీళ్లకు రంది లేకుంటవోయింది. రెండు పంటలు తీస్తున్న. పోయినేడు రెండు బర్లను సుత కొనుక్కున్న. చేతినిండా పని. కేసీఆర్ సార్ సల్లంగుండాలె.
– దొడ్ల వెంకటయ్య, సంధ్యాపురం (కల్వకుర్తి)