ఎటుచూసినా జన ప్రభంజనం.. బస్సులు, ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, ట్రాలీలు, మోటారు సైకిళ్లపై పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు కిక్కిరిసిపోయాయి. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కేసీఆర్ సభలను సూపర్ హిట్ చేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా క్రమశిక్షణతో కేసీఆర్ కోసం వేచిచూసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ ప్రసంగిస్తున్నంతసేపూ ఈలలు, చప్పట్లతో సభా ప్రాంగణాలు మార్మోగాయి.
వరంగల్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాదసభ గ్రేటర్ వరంగల్లోని భట్టుపల్లిలో, మహబూబాబాద్ ప్రజా ఆశీర్వాదసభ పట్టణంలోని శనిగరపురంలో శుక్రవారం నిర్వహించారు. రెండు సభలకు ప్రజలు, ఉద్యమకారులు, మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వర్ధన్నపేట సభకు వచ్చిన వారితో వరంగల్ నగర శివారు.. మహబూబాబాద్ సభలకు వచ్చిన వారితో ఆ పట్టణం జనమమయ్యాయి. ఆశీర్వాదసభకు వందల వాహనాల్లో భారీగా జనం తరలి వచ్చారు. సీఎం రాకముందే సభ ప్రాంగణాలు మొత్తం జనంతో నిండిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వేదికపైకి వస్తుండగా, ఆయన ప్రసంగం సమయంలో, తిరిగి వెళ్లేటప్పుడు ‘హాట్రిక్ సీఎం కేసీఆర్’ నినాదాలతో సభలు హోరెత్తాయి. కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆలకించిన జనం చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరును కేసీఆర్ సభలో వివరించారు. రైతు బంధు, దళితబంధు పదాలను పుట్టించిందే కేసీఆర్ అని అనడంతో జనం ఈలలు, చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. ప్రతి వర్గాన్ని సమానంగా చూస్తున్నామని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పినప్పుడూ ఇదే స్పందన వచ్చింది.
దేశంలో వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, ఈ సంస్థల్లో చదివిన వారు అద్భుతంగా ర్యాంకులు సాధిస్తున్నారని కేసీఆర్ చెప్పినప్పుడు సభలో చప్పట్లు మార్మోగాయి. రైతు బంధు, 24 గంటల కరెంటు, ధరణి ఉండాలా? వద్దా? అని ప్రశ్నించగా.. అందరూ ముక్తకంఠంతో ఉండాలని గట్టిగా నినదించారు. వరంగల్ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని, సమష్టి కృషితో మరింత అభివృద్ధి చేసుకుందామని అనగానే చప్పట్లతో స్వాగతించారు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్లు పెంచుకుందామని, మహిళలకు భృతి, రైతుబంధు సాయం పెంపు అమలవుతుందని కేసీఆర్ అనగానే అందరూ మద్దతు తెలిపారు. వర్ధన్నపేట సభలో మిట్టపల్లి సురేందర్, ఇతర కళాకారులు… మహబూబాబాద్లో మధుప్రియ, మానుకోట ప్రసాద్ ఆట పాటలతో అలరించారు. ‘గులాబీల జెండలే రామక్క’ పాట అందరిలో ఊపు తెచ్చింది.
కళాకారులు ఈ పాట పాడుతున్నంతసేపు జనం చప్పట్లు కొడుతూ కళాకారులతో కలిసిపోయారు. వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, దేశపతి శ్రీనివాస్, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, గ్యాదరి బాలమల్లు, వరంగల్ జడ్పీ చైర్పర్సన్లు గండ్ర జ్యోతి, అంగోత్ బిందు పాల్గొన్నారు.
పరవశించిన పాలేరు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించిన తొలి ఎన్నికల ప్రచార సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సభ గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన ఎండ పోటెత్తుతున్నా లెక్కచేయకుండా ప్రజలు సీఎం ప్రసంగం కోసం ఎదురు చూశారు. కేసీఆర్ అడుగుపెట్టగానే సంక్షేమ సారథిని చూసి పాలేరు జనం పులకించిపోయారు. కేసీఆర్ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తితో ఆలకించారు. సభలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, వైరా శాసనసభ్యుడు రాములునాయక్, బీఆర్ఎస్ వైరా ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్లాల్, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ముఖ్యం: కందాళ
తనకు రాజకీయాల కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని బీఆర్ఎస్ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. పాలేరు ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ‘మంచి మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన విజన్తోనే నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. నేను నిత్యం ప్రజల మధ్య ఉంటున్నా. వారితో కలిసి పని చేస్తున్నా. ప్రజల్లో ఒకడిగా ఉంటున్నా. ప్రజలు ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయవచ్చు. నా ఫోన్ నంబర్ ప్రజలందరి వద్ద ఉండాలి’ అని పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారని, వారందరికీ దళితబంధు వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. ప్రజలు తనను ఆశీర్వదిస్తే పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని చెప్పారు.
సీఎం ఆశీస్సులతో మరింత అభివృద్ధి: శంకర్నాయక్
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మహబూబాబాద్ ఇప్పటికే అభివృద్ధి చెందిందని, కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకొందామని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రాన్ని ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ను కోరారు. శనిగపురం రోడ్డులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మానుకోటను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దారని తెలిపారు. మెడికల్, నర్సింగ్, హార్టికల్చర్ డిగ్రీ కాలేజీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలను మంజూరు చేసిన కేసీఆర్ రుణాన్ని ఇక్కడి ప్రజలు తీర్చుకుంటారని చెప్పారు. గిరిజనులకు పోడు పట్టాలు, 10 శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నో ఏండ్ల కల నెరవేర్చారని తెలిపారు. అమ్మా, నాన్న తనకు జన్మనిస్తే.. సీఎం కేసీఆర్ తనకు రాజకీయంగా పునర్జన్మనిచ్చారని, ఆయన రుణం తీర్చుకొనేందుకు కృషి చేస్తానని చెప్పారు.
సీఎం కేసీఆర్ పాలనలోసంక్షేమ ఫలం: అరూరి
సీఎం కేసీఆర్ సహకారంతో వర్ధన్నపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఆ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రెండుసార్లు భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. మూడోసారి తనను ఆశీర్వదించేందుకు వచ్చినందుకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని, వంద పడకల దవాఖాన ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆకేరు వాగుపై చెక్డ్యాం నిర్మాణం చేపట్టామని, కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసినట్టు తెలిపారు. మరోసారి ప్రజలు ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.