హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణలో తొలి పదేండ్లు పాలన సాగించామని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు తెలిపారు. సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం ఆనాటి తమ ప్రభుత్వం ఫూలే ఆదర్శాలను కార్యాచరణలో పెట్టిందని కేసీఆర్ గుర్తుచేశారు. తొలి తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన కార్యాచరణను నేటి ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగించాలని సూచించారు. అప్పుడే తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు, మైనార్టీ పేద వర్గాలకు ఫూలే దంపతుల ఆకాంక్షలు నిజమై, సామాజిక న్యాయం జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఫూ లే జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
వ్యవసాయం దాని అనుబంధ రంగాలే కేంద్రంగా, కులవృత్తుల సామాజిక సాంస్కృతిక జీవన విధానం అల్లుకుని ఉన్నదని తెలిపారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని అవగాహన చేసుకున్న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవే రంగాలను మొదటి పాలనా ప్రాధాన్యంగా తీసుకున్నట్టు పేర్కొన్నారు. అందుకే సా మాజిక న్యాయం అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఆనాడు నిలిచిందని గుర్తుచేశారు. వర్ణ, కుల వివక్ష నుంచి విముక్తి కోసం తన జీవితకాలం పోరాడిన ఫూలే భారత సామాజిక విప్లవకారుడని కొనియాడారు. సబ్బండ కులాల అభ్యున్నతి కోసం, సమానత్వం, సామాజిక న్యా యం కోసం ఆయన చేసిన కృషి, త్యాగాలను మరువలేమని తెలిపారు. సామాజిక రుగ్మతలను రెండు శతాబ్దాల క్రితమే పసిగట్టి, పరిషారం కోసం కృషిచేసిన దార్శనికుడు ఫూలే అని ప్రశంసించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫూలే స్ఫూ ర్తితో పదేండ్లపాటు ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా సాగునీరు, ఉచిత విద్యుత్తు, పంట పెట్టుబడికి రైతుబంధు, పంట కొనుగోలు చేయడం వంటి కీలక కార్యాచరణను స మాంతరంగా అమలు చేయడంతో గ్రా మీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందని కేసీఆర్ గుర్తుచేశారు. పేద ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి వారిలో ఆర్థిక భరోసాను తాము పెంచామని తెలిపారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ.. దేశ ప్రగతిలో కీలక భూమికను పోషించిందని పేర్కొన్నారు. తద్వారా బీసీ, ఎస్సీ కులాల సామాజిక గౌ రవాన్ని ఇనుమడింపజేసిందని తెలిపారు.