హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా బుధవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి సేవలను స్మరించుకున్నారు. మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాంస్కృతిక గరిమను ప్రపంచానికి చాటేందుకు కవిగా తన కలాన్ని, గళాన్ని మొత్తంగా తన జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమన్నారు. తెలంగాణ సమాజం కోసం వారు పడిన తపన, వారందించిన పోరాట స్ఫూర్తి, మలిదశ ఉద్యమంలో, అనంతర బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇమిడి ఉన్నదని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కాళోజీ కృషిని, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. తోటి మనిషి క్షేమాన్ని కోరుకోవడం, సబ్బండ వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయడం ద్వారానే వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా కాళోజీకి మనం అందించే ఘన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.
అక్షరాన్ని ఆయుధంగా మలిచి, మాటల తూటాలతో ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని ధారబోసిన యోధుడు, ప్రజాకవి కాళోజీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కవిగా, రచయితగా సమాజంలోని అన్యాయాలకు, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతూ.. రాష్ట్ర సాధనకు పరితపించిన అక్షర తపస్వి కాళోజీ నారాయణరావు అని తెలిపారు. పలుకుబడుల భాష కావాలని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ జయంతిని (సెప్టెంబర్ 9) తెలంగాణ భాషా దినోత్సవంగా కేసీఆర్ నిర్వహించారని పేర్కొన్నారు. వైద్య విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టారని, వరంగల్లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారని గుర్తుచేశారు. కాళోజీ వర్ధంతి సందర్భంగా వారికి నివాళి అర్పించారు.