హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ప్రస్తుతం 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేపట్టిన సంగతిని గుర్తు చేశారు. 21 రోజుల ఉత్సవాల్లో భాగంగా వైద్యారోగ్య శాఖకు కేటాయించిన రోజున రాష్ట్రవ్యాప్త పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇందుకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. 2023-24లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.84 లక్షల గర్భిణులు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల ద్వారా లబ్ధి పొందుతారని చెప్పారు. 14-26 వారాల సమయంలో రెండో ఏఎన్సీ చెకప్, 27-34 వారాల సమయంలో మూడో ఏఎన్సీ చెకప్ సందర్భంగా రెండు విడతలుగా కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. 24 జిల్లాల్లోని 111 కేంద్రాల్లో గర్భిణులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కిట్లను సురక్షితంగా నిల్వ చేయాలని సూచించారు.
కేసీఆర్ కిట్లతో అద్భుత ఫలితాలు
కేసీఆర్ కిట్లు ఒక అద్భుతమైన పథకం అని, దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. జాతీయ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో మాతృత్వ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గిందని చెప్పారు. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు సీఎం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ పథకానికి రూపకల్పన చేశారని వివరించారు. మాతృత్వ మరణాలు తగ్గించడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. నాలుగు ఏఎన్సీ చెకప్లు, కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు వంటివి రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు.
కోటిన్నర మందికి కంటి పరీక్షలు
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 80 పని దినాల్లో కోటిన్నర మందికి నేత్ర పరీక్షలు చేయడం గొప్ప విషయమని మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని చెప్పారు. ఇప్పటివరకు రీడింగ్ గ్లాసెస్ 21.46 లక్షల మందికి, ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ 13 లక్షల మందికి అందజేసినట్టు వెల్లడించారు. కలెక్టర్లు, అధికారులు, వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని అభినందించారు.
పల్లె, బస్తీ దవాఖానలు ప్రారంభించాలి
ప్రాథమిక వైద్యాన్ని పటిష్టం చేయడంలో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన పల్లె, బస్తీ దవాఖానలను వెంటనే ప్రారంభించాలని హరీశ్రావు ఆదేశించారు. ఇప్పటికే మంజూరైన సబ్ సెంటర్ల నిర్మాణాలు, మరమ్మతు పనులు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.