నిజామాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వారం రోజుల్లో రాష్ట్రంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీకి చర్యలు చేపట్టినట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. అత్యధికంగా ఎనీమియా ప్ర భావం ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూ డెం, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లా ల్లో న్యూట్రిషన్ కిట్లను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. మొత్తం 1.24 లక్షల మంది వీటికోసం నమోదైనట్టు చెప్పారు. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడం దీని లక్ష్యమని తెలిపారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో హరీశ్రావు పర్యటించారు.
పిట్లంలో రూ.10.70 కోట్లతో 30 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన, బిచ్కుందలో డయాలసిస్ సెంటర్ను, కొత్తగా ఏర్పాటైన డోంగ్లి మండలాన్ని ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో హరీశ్రావు మాట్లాడుతూ.. బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రిషన్ కిట్, ప్రసవం అయిన తర్వాత కేసీఆర్ కిట్ అందేలా చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. స్వరాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాల సంఖ్యను 3 నుంచి 83కు పెంచామని చెప్పారు. ఆ సంఖ్యను 102 కు పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నామని చెప్పారు. ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేసి మందులను ఉచితంగా జీవితకాలం అందిస్తున్నామని.. ఇందుకోసం ఏటా రూ.100 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. డయాలసిస్ సెషన్స్ వారం రోజుల్లోనే 50 లక్షలకు చేరబోతున్నాయని.. దేశంలోనే ఇది ఒక గొప్ప విషయమన్నారు.
ధరణితో విప్లవాత్మకమైన మార్పు
కొంతమంది అవగాహన లేక ధరణి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరణి ద్వారా అవినీతి తగ్గి పారదర్శకత పెరిగిందని చెప్పారు. గతంలో గిర్దావర్, తాసిల్దార్, వీఆర్వోకో కోపం వస్తే రికార్డుల్లో వివరాలు తారుమారు అయ్యేవని.. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ధరణి ఒక విప్లవాత్మకమైన మార్పుగా అభివర్ణించారు. రాష్ట్రంలో మిగిలిపోయిన భూసమస్యలను త్వరలోనే రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించబోతున్నామని తెలిపారు.
ఓర్వలేక ఆర్థిక ఆంక్షలు
టీఆర్ఎస్ సర్కార్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై ఆర్థిక ఆంక్షలు పెట్టిందని హరీశ్రావు ధ్వజమెత్తారు. ఇక్కడ ఉన్న ఉచిత కరెంట్, రైతుబంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాలు.. మహారాష్ట్రలో ఎం దుకు లేవు? అని బండి సంజయ్ని ప్రశ్నించా రు. మహారాష్ట్రలో రైతులు తమ పంటలు కొనాలని పాదయాత్ర చేస్తున్నారని గుర్తుచేశా రు. నిరుడు, ఈ ఏడాది మొత్తం కలిపి రూ.12 వేల కోట్లను కేంద్రం ఆపిందన్నారు. ఎఫ్ఆర్బీఎంలో రూ.15 వేల కోట్లు నిలిపేశారన్నారు. అయినా యావత్ దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. కేంద్రం ఆర్థికంగా ఇ బ్బందులు పెడుతున్నా.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నాయని స్పష్టంచేశారు. 16 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రం.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అప్పజెప్పిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభు త్వం ఇప్పటికే లక్షా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నడుస్తుందని తెలిపారు.
కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలి
ఉద్యోగ నియామకాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన నిజాంపేట తాసిల్దార్ కార్యాలయాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో బీజేపీ ఘోరంగా విఫలమైందని అన్నా రు. ఏటా రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని ఆరోపించారు.