హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్తహీనత లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. గత ఏడాది 9 జిల్లాల్లో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ఈ ఏడాది అన్ని జిల్లాలకు విస్తరించింది. ఈ మేరకు తాజా బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించింది. ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇప్పటికే మాతాశిశు మరణాల నివారణకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎనీమియా నివారణకు ప్రత్యేకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని రూపొందించారు. గతేడాది డిసెంబర్ 21న ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కామారెడ్డి వేదికగా కిట్స్ పంపిణీ చేశారు. మొదటి దశలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల సంఖ్య ఎక్కువగా ఉన్న 9 జిల్లాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో పంపిణీ మొదలైంది.
13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ చెకప్ సమయంలో ఒకసారి, 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో రెండోసారి ఈ కిట్ను ఇస్తారు. ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఐరన్ వంటి పోషకాలను అందించి, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడమే ఈ కిట్ల లక్ష్యం. సానుకూల ఫలితాలు వస్తుండటంతో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
కిట్లో ఉండే వస్తువులు