కరీంనగర్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ సీఎం కేసీఆరే గెలవాలని బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేసీఆర్కు తప్పా మరో నాయకుడికి ప్రేమ ఉండదని స్పష్టం చేశారు.
బుధవారం కరీంనగర్ మండలం బొమ్మకల్ నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు వేస్తే తిరిగి నాటి చీకటి రోజులు రావడం ఖాయమని హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలన ఐదు నెలల్లోనే వికటించిందని, అక్కడ ఇస్తామన్న 24 గంటల కరెంట్ రావడం లేదని, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్కు ఓటు వేయొద్దని అక్కడి రైతులు, ప్రజలు చెప్తున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీళ్లు తెచ్చుకోవల్సిన దుస్థితి ఇప్పటికీ ఉందని, అదే తెలంగాణలో 24 గంటల కరెంట్, ఇంటింటికీ తాగు నీళ్లు సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని తేల్చి చెప్పారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి సారే అధికారంలోకి రావాలని వివరించారు. తాను 15 ఏండ్ల సుధీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నానని, అది ఇక్కడి ప్రజల ఆశీర్వాదమేనని, మరోసారి గెలిపిస్తే కరీంనగర్ను మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి గంగుల స్పష్టం చేశారు.