హైదరాబాద్, ఫిబ్రవరి 13 : అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తరఫున మన ప్రధానమంత్రి ప్రచారం చేయడం వ్యూహాత్మక తప్పిదమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ, అమెరికా ఎన్నికల్లో ‘హౌడీ మోదీ’ పేరుతో హ్యూస్టన్లో జరిగిన బహిరంగసభలో మోదీ ప్రసంగించడం, తర్వాత ట్రంప్ ఓడిపోవడంతో దేశం పరువుపోయిందన్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఇజ్జత్ పోయింది
అమెరికా ఎన్నికల్లో మన ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం చేయడం వ్యూహత్మక తప్పిదం కాదా? అమెరికా ఎన్నికల్లో ‘హౌడీ మోదీ’ పేరుతో హ్యూస్టన్ బహిరంగసభలో మోదీ మాట్లాడుతూ. ‘అబ్కీ బార్ – ట్రంప్ సర్కార్’ అంటూ మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యూహత్మక తప్పిదం కాదా ఇది? అక్కడ ఏమైంది? ట్రంప్ సర్కారు ఓడిపోయింది. పల్టీ కొట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యూహాత్మక తప్పిదం అది.. ఇప్పుడు అమెరికాలో మనల్ని ఆహ్వానించేవారు లేరు. వైట్హౌస్లో పట్టించుకునేవారు లేరు. మన దేశం ఇజ్జత్ పోయింది. ఇదేనా తరీఖా? అమెరికాలో ఎన్నికలంటే అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకొన్నారా? అక్కడ ఎన్నికల ప్రచారానికి ఎందుకు పోవాల్సి వచ్చింది. బీజేపీ నీతి ఇదేనా. దీనికే జేజేలు పలకాల్నా. ఇలాంటి తప్పిదాలు ఒకటి కాదు, వేలల్లో జరిగాయి. అమెరికా ఎన్నికలతో భారతదేశానికి ఏం సంబంధం? బాధ్యతాయుత ప్రధానమంత్రి చేసే పనా ఇది? వేరే దేశ ఎన్నికల్లో మనదేశ ప్రధానిపోయి ప్రచారం చేయవచ్చునా?