సూర్యాపేట, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : దేశం నుంచి బీజేపీని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ‘మిషన్ ఢిల్లీ’ షురూ అయ్యిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో మిషన్ తెలంగాణ చేపడుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఎనిమిదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ మిషన్లన్నీ బంగాళాఖాతంలో కలువాల్సిందేనని చెప్పారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలో సోమవారం పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మా ట్లాడారు. సీఎం కేసీఆర్ గర్వించదగ్గ స్థాయిలో అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇక్కడి అభివృద్ధి తమకూ అవసరమని దేశ ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళారీలను బాగు చేయడం మినహా ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. ప్రజల కోసం చేసిన ఒక్క మంచి పథకం ఏదో చెప్పాలని బీజేపీకి సవాల్ విసిరారు. దేశం మొత్తానికి తెలంగాణ మోడల్ అభివృద్ధి చేసేందుకే ఢిల్లీలోని బీజేపీ సర్కారును గద్దె దింపే కార్యక్రమం మొదలైందని మంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. కేసీఆర్ను రాష్ర్టానికే పరిమితం చేసేందుకు మిషన్ తెలంగాణ అని బీజేపీ అంటున్నద న్నారు. మిషన్ తెలంగాణ కార్యక్రమం చేపడితే బీజేపీకి ఉన్న పునాది కూడా పోవడం ఖాయమని హెచ్చరించారు.