మూడు రోజుల షెడ్యూల్
హైదరాబాద్, మార్చి 3 : రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, రక్షణ కార్యక్రమాలపై భారీఎత్తున ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 6 నుంచి 8 వరకు ‘కేసీఆర్ మహిళా బంధు’ పేరుతో రాష్ట్రమంతా అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో ఆయన గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తన నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఎదురైన క్షేత్రస్థాయి సమస్యలకు పరిషారం ఇస్తున్న గొప్ప పాలకుడని కొనియాడారు. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతటా మహిళా దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు మమేకమై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. గతంలో రైతుబంధు వారోత్సవాలతోపాటు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఆ కార్యక్రమాల స్ఫూర్తితో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించాలని సూచించారు.
కేసీఆర్ కిట్తో తగ్గిన మాతా శిశు మరణాలు
ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ కార్యక్రమంతో రాష్ట్రంలో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళలకు ప్రసవానికి ముందు, ప్రసవ సమయం, ఆ తర్వాత అవసరమైన అన్నిరకాల రక్షణ చర్యల మేళవించి రూపొందించిన కేసీఆర్ కిట్ దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు. కేసీఆర్ కిట్ ద్వారా ఇప్పటివరకు సుమారు 11 లక్షల మందికి రూ.13 వేల చొప్పున రూ.1,700 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంతో ప్రభుత్వ దవాఖానల్లో సురక్షిత ప్రసవాలు పెరిగాయని తెలిపారు. పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలా మారారని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 10.30 లక్షల మందికి రూ.లక్ష 116 చొప్పున రూ.9,022 కోట్లు ఖర్చుచేసిందని పెండ్లి కానుకగా అందించిందని వెల్లడించారు.
ఆడబిడ్డలకు రాజకీయ అందలం
ఆడబిడ్డలను అన్ని రంగాల్లో అందలం ఎక్కించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల్లో 50 రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించామని, జనరల్ స్థానాల్లోనూ మున్సిపల్ చైర్మన్లుగా, నగర పాలక సంస్థలకు మేయర్లుగా ఆడబిడ్డలకు అవకాశం కల్పించామని గు ర్తుచేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లోనూ రిజర్వేషన్లు అమలు చేసి మహిళలకు గౌరవాన్ని ఇచ్చారని, పారిశ్రామిక రంగంలోనూ మహిళా అభ్యున్నతికి కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు.
షీ టీమ్స్ దేశానికి మార్గదర్శి
మహిళా సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న షీటీమ్స్ దేశానికే మార్గదర్శనం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. మహిళలకు అండగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు, బాలికలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యాశాఖలోనూ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని, 70 లక్షల హెల్త్, హైజెనిక్ కిట్లను విద్యార్థులకు అందించామని వివరించారు. ‘బేటీ బచావో బేటీ పఢావో’ అనేది ఇతరులకు నినాదమైతే, టీఆర్ఎస్ ప్రభుత్వానికి విద్యార్థులను చదివించి, సంరక్షించటం విధానమని పేర్కొన్నారు.