CM KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఒకే రోజు 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించుకోవడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన రోజని, సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ ఘట్టమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో తరగతులను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్ నుంచి ఒకేసారి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా 9 మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, బోధన సిబ్బంది, ఆయా కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే..ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన రోజు, సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ ఘట్టం. రాజకీయ నాయకులుగా మేం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాం. కానీ ఇది చాలా ఆత్మ సంతృప్తి కలిగించే అంశం. రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణవారికి పాలన చేతగాదు అని ఎకసెక్కాలు పలికి, ఎగతాళి చేసిన పరిస్థితులు చూశాం. వాటికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాం. అలాంటి తెలంగాణలో ఈరోజు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటైంది.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 33 జిల్లాలకు కలిపి 34 ప్రభుత్వ మెడికల్ కలేజీలు ఉండేలా రాష్ట్ర క్యాబినెట్ గతంలోనే ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ సాకారం కాబోతున్నది. తెలంగాణ ఏర్పడేనాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రారంభించే 9 కాలేజీలతో కలిపి మొత్తం కాలేజీల సంఖ్యను 26కు పెంచుకున్నాం. వచ్చే ఏడాది మరో 8 కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. వాటి ఏర్పాటుకు ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం ఇచ్చింది. లాంఛనాలు పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ప్రారంభించుకుంటాం. ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిచిన పాలమూరు జిల్లాలో ఈరోజు అద్భుతంగా వ్యవసాయం పరుగులు పెట్టడమే కాకుండా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించుకునే స్థాయికి చేరుకున్నాం. గతంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఒక్క కాలేజీ కూడా లేని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పుడు మూడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇది మనం సాధించిన గొప్ప విప్లవం. అడవిబిడ్డలు నివసించే ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా చేసుకోవడమే కాదు, అక్కడ మెడికల్ కాలేజీలు స్థాపించుకొని అద్భుతాన్ని సాధించబోతున్నాం.
ఏటా 10వేల మంది డాక్టర్లు
తెలంగాణ ఏర్పడినప్పుడు 2,850 మెడికల్ సీట్లు మాత్రమే కలిగి ఉన్న తెలంగాణలో ఈరోజు 8,517 మెడికల్ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 26 కాలేజీలు, రాబోయే సంవత్సరం ప్రారంభించే ఎనిమిది కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కలిపి రాష్ట్రం ఏటా 10వేల మంది డాక్టర్లను తయారుచేసే స్థాయికి చేరుకుంటున్నది. మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు, రోగనిరోధక శక్తికి రక్తంలో తెల్ల రక్తకణాలు పనిచేసినట్టే.. తెలంగాణ నుంచి తయారుకాబోతున్న తెల్లకోటు డాక్టర్లు రాష్ర్టానికే కాదు.. దేశ ఆరోగ్య వ్యవస్థను కాపాడటంలో కీలకంగా పనిచేస్తారు. వైద్య కళాశాల అంటే మామూలు పాఠాలు చెప్పే విద్యాసంస్థ కాదు. 34 వైద్య కళాశాలలు అంటే 34 అద్భుతమైన దవాఖానలు. ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాలలో ఎక్కడికక్కడ వందల పడకలతో, అద్భుతమైన వైద్య సదుపాయాలతో దవాఖానలను ఏర్పాటు చేసుకునే అవకాశం మనకు కలుగుతున్నది. మెడికల్ కాలేజీల నుంచి ఏటా వచ్చే 10వేల మంది డాక్టర్లతో తెలంగాణ సమాజానికే కాదు.. భారత సమాజానికి బ్రహ్మాండంగా సేవ చేసే అవకాశం కలుగుతుంది.
వైద్య రంగంలో అనేక విజయాలు
మీకు పరిపాలన చేతగాదు అని హేళనకు గురైన తెలంగాణ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నదంటే.. దేశంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ ఏర్పడిననాడు ప్రభుత్వ దవాఖానల్లో 17 వేల పడకలు ఉండేవి. అవి కూడా అమాంబాపతు. ఎందుకూ పనికిరాకుండా, బెడ్ షీట్లు లేకుండా, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో 34 వేల పడకలకు చేరినం. ఇది మనం సాధించిన ఘనత. గతంలో హైదరాబాద్ అంటే గాంధీ, నిలోఫర్, ఉస్మానియా అని మాత్రమే గుర్తుకువచ్చేవి. కానీ నగరంలో అద్భుతమైన వైద్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) అనే బ్యానర్ కింద నాలుగు అద్భుతమైన దవాఖానలు నిర్మిస్తునాం. ఎల్బీనగర్, గచ్చిబౌలి, అల్వాల, ఎర్రగడ్డలో వెయ్యి పడకల చొప్పున సూపర్ స్పెషాలిటీ దవాఖానలు కడుతున్నాం. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన నిమ్స్లో మరో 2 వేల పడకలతో విస్తరిస్తూ నాలుగువేల పడకలకు తీసుకుపోతున్నాం. దీంతో మొత్తం ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య 50వేలకు చేరుకుంటున్నాం. అవన్నీ ఆక్సిజన్ బెడ్లే. ఇందులో 10వేల సూపర్ స్పెషాలిటీ బెడ్లు ఉండేలా చూసుకుంటున్నాం.
మెడికల్ కాలేజీ మాత్రమే కాకుండా పారామెడికల్ సిబ్బంది కూడా అవసరం. పారామెడికల్ సిబ్బందికి జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉన్నది. ఆ పిల్లలకు వెంటనే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా కచ్చితంగా నర్సింగ్ కాలేజీలు, పారామెడికల్ కోర్సులు పెట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రికి చెప్పాను. మంత్రి, వైద్యశాఖ సిబ్బంది వాటిపై చర్యలు తీసుకుంటున్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ప్రతి జిల్లాలో నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఎక్కడా లోటు లేకుండా, ఖర్చుకు వెనుకాడకుండా, భయపడకుండా పారామెడికల్ కోర్సులు స్టార్ట్ చేస్తున్నాం.
కేసీఆర్ కిట్ వెనుక ఫిలాసఫీ ఇదీ
కేసీఆర్ కిట్ అంటే నాలుగు సబ్బులు, మూడు వస్తువులు కాదు. దాని వెనుక అద్భుతమైన ఫిలాసఫీ ఉన్నది. కూలి పనులు, పొలం పనులు చేసి బతికే నిరుపేద మహిళలు గర్భం దాల్చినా పనికి వెళ్తుంటారు. అది తల్లి ఆరోగ్యానికి, శిశువు ఆరోగ్యానికి మంచిది కాదు. వారు కూలీకి వెళ్లకపోతే ఆర్థికంగా ఎంత నష్టపోతారో, ఆ డబ్బును భర్తీ చేసే మానవీయ కోణమే కేసీఆర్ కిట్. దీనికి అనుబంధంగా అమ్మ ఒడి వాహనాలు ప్రవేశపెట్టాం. గోండుగూడేలు, ఆదివాసీ, బంజారాతండాలు, మారుమూల గ్రామాల్లో కూడా ఈ వాహనాలు సేవలు అందిస్తున్నాయి. మహిళలకు గర్భం వచ్చినప్పటి నుంచి సమీపంలోని దవాఖానలకు తీసుకెళ్లి డాక్టర్లకు చూపెట్టడం, మందులు, సూచనలు ఇవ్వడం, రక్తహీనత లేకుండా చూసుకోవడం, వాళ్లకు మంచి గైడెన్స్ ఇచ్చి, సురక్షితంగా డెలివరీలు చేయించడం, ప్రసవం అయిన తర్వాత అమ్మ ఒడి వాహనంలో వారిని సురక్షితంగా ఇంటి వద్ద వదిలేస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటిది లేదు.
పేదలను ఆదుకోవాలనే సదుద్దేశం, మానవీయ కోణం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఈ చర్యలు తీసుకున్నాం. దానివల్ల వచ్చిన అద్భుతమైన ఫలితం నాకు చాలా సంతృప్తినిచ్చింది. కేసీఆర్ కిట్తోపాటు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను కూడా ప్రవేశపెటాం. ఇది చాలా ఆనందకరమైన విషయం. కోటీశ్వరులు, లక్షాధికారులు తినే వస్తువులు ఆ కిట్లో ఉన్నాయి. నేను స్వయంగా చూశాను. చాలాచాలా బాగుంది. దాన్ని డిజైన్ చేసినందుకు హెల్త్ మినిస్టర్ను, హెల్త్ డిపార్ట్మెంట్ను అభినందిస్తున్నాను. ఆరోగ్యకరమైన, బలమైన, పుష్టికరమైన సమాజం నిర్మాణం కావాలంటే మొదటి నుంచే చ్యలు తీసుకోవాలి. పిల్లల ఎదుగుదల సరిగా ఉండదు. దీనినే స్టంటింగ్ ప్రాబ్లం అంటారు. ఒక జనరేషన్ స్టంటింగ్ ప్రాబ్లం తలెత్తితే, దాని నుంచి కోలుకోవడానికి ఆ రాష్ట్రం, ఆ దేశానికి కనీసం 75-100 ఏండ్లు పడుతుంది. ఆ స్టంటింగ్ ప్రాబ్లంను అధిగమించాలంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా బలవర్ధకంగా పెరగాలి. పోషకాహారం దొరికితేనే శిశువు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
వైద్యో నారాయణో హరి
వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుల విశిష్టత ఏందంటే.. ఆ పని ఇంకొకరు చేయలేరు. టెస్టులు చేయాలన్నా, డయాగ్నోసిస్ చేయాలన్నా, ఇంజెక్షన్ చేయాలన్నా, సర్జరీ చేయాలన్నా డాక్టరే చేయాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నా, వాళ్లు ఆ పనిచేయలేరు. ఐఏఎస్కు జబ్బు వచ్చినా మళ్లీ డాక్టర్ దగ్గరికే వస్తారు. కొత్తగా కాలేజీల్లో చేరిన విద్యార్థులకు నా అభినందనలు, ఆశీర్వాదాలు. మీ అందరికీ నేను మనవి చేసేది ఒక్కటే.. మీరు స్వీకరించే వృత్తి చాలా పవిత్రమైనది. తెలంగాణ వైద్యులు అంటే గొప్పవాళ్లనే పేరు మీరు సాధించాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులో మీరు మీ చదువులో గొప్ప విజయాలు సాధించి, మంచి ప్రొఫెషనల్ డాక్టర్లుగా ఎదగాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు, ప్రతిష్ఠతు తెచ్చుకోవాలి. మీ తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచాలి. మీ భవిష్యత్తు బాగుండేలా నా ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి. మంత్రులు, కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మెడికల్ కాలేజీలవైపు వెళ్లినప్పుడు లోపలికి వెళ్లండి. కాలేజీని సందర్శించండి. ప్రిన్సిపాల్తో, విద్యార్థులతో మాట్లాడండి. మంచిచెడ్డలు కనుక్కోండి. మీ సహాయ సహకారాలు అందించండి.
ఏవైనా లోపాలు ఉంటే మంత్రి దృష్టికో, నా దృష్టికో తీసుకురండి. అవసరమైతే మీ నియోకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కొంత ఖర్చు చేయండి. మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు పటిష్ఠమైన కాలేజీలుగా రూపుదిద్దుకునేలా మీ కంట్రిబ్యూషన్ కావాలి. పటిష్ఠమైన వ్యవస్థ తయారైతే పటిష్ఠమైన ఆరోగ్య వ్యవస్థ, పటిష్టమైన ఆరోగ్య తెలంగాణ సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. మీ అందరికీ శుభం కలుగుగాక, గాడ్ బ్లెస్ యూ’ అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీలు దామోదర్రావు, రాములు, కవిత, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, మధునూదనాచారి, శేరి సుభాష్రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బాల సుమన్, జీవన్రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలచారి, సీఎస్ శాంతి కుమారి, సీఎం కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, టీఎస్ఎంస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, సీఎంవో ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్రావుకు అభినందనలు
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రారంభించిన మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోటా పోను మిగతా 85 శాతం సీట్లు కచ్చితంగా తెలంగాణ బిడ్డలకే దక్కాలని వైద్యారోగ్యశాఖ జీవో విడుదల చేసింది. దానిమీద న్యాయవివాదం చెలరేగినా.. మంత్రి హరీశ్రావు, వైద్యశాఖ సిబ్బంది అంతా చాలా పటిష్ఠంగా పోరాటం చేసి హైకోర్టులో విజయం సాధించారు. ఇది గొప్ప విజయం. మంత్రి హరీశ్రావుకు, హెల్త్ సెక్రటరీ రిజ్వీకి హృదయపూర్వక అభినందనలు. వైద్యారోగ్యశాఖ మంత్రిగా హరీశ్రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా డైనమిక్గా దూసుకుపోతున్నారు. కరోనా సమయంలో చికిత్సకు ఆక్సిజన్ కావాలన్నారు. మన దగ్గర చాలా తక్కువగా ఉండేది. ఎవరినో అడగడం, ఏ మూల నుంచో తెప్పించడం, ఇలా చాలా బాధలు పడ్డాం. దాన్ని గుణపాఠంగా తీసుకున్నాం. ఈరోజు మంత్రి హరీశ్రావు నేతృత్వంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఇతర మిత్రుల కృషి వల్ల 500 టన్నుల ఆక్సిజన్ను తెలంగాణ సొంతంగా ఉత్పత్తి చేసుకుంటున్నది. ఇలా ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా తట్టుకునేలా వైద్య వసతులను మెరుగుపరుచుకున్నాం. హెల్త్ సెక్రటరీ రిజ్వీని, డీఎంఈ రమేశ్ రెడ్డిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇంత పటిష్ఠమైన వైద్యవ్యవస్థను తీర్చిదిద్దడంలో మీరు కృతకృత్యులయ్యారు. నీతి ఆయోగ్ ఇచ్చే ఆరోగ్య సూచీలో మనం 2014లో 11వ ర్యాంకులో ఉంటే.. ఇప్పుడు మూడో స్థానానికి ఎదిగినం. రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణవారికి పరిపాలన చేతగాదు అని ఎకసెక్కాలు పలికి, ఎగతాళి చేసిన పరిస్థితులు చూశాం. వాటికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాం. అలాంటి తెలంగాణలో ఈరోజు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటైంది.
రాష్ట్ర చరిత్రలో సుదినం: మంత్రి హరీశ్రావు
9 మెడికల్ కాలేజీల్లో తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో సుదినం అని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారని పేర్కొన్నారు. సీఎం కేసిఆర్ పట్టుదలకు ఇది నిదర్శమని కొనియాడారు. నిరుడు ఒకేసారి 8 కాలేజీలు ప్రారంభించి రికార్డు సృష్టిస్తే, ఈ ఏడాది మన రికార్డును మనమే బద్దలు కొట్టామని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతమని, దేశంలోని మిగతా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ఒకప్పుడు ‘బెంగాల్ ఆలోచిస్తుంది.. దేశం అచరిస్తుంది’ అనేవారు. దాన్ని తిరగరాసిన ఘనత సీఎం కేసీఆర్దే. ఇప్పుడు తెలంగాణ అచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది అన్నంత గొప్పగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు. సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ది’ అని పేర్కొన్నారు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తి బాగుండాలంటే రక్తంలో తెల్ల రక్తకణాలు పనిచేసినట్టే.. తెలంగాణ నుంచి తయారుకాబోతున్న తెల్లకోటు డాక్టర్లు రాష్ర్టానికే కాదు.. దేశ ఆరోగ్య వ్యవస్థను కాపాడడంలో కీలకంగా పనిచేస్తారు.
వైద్యులు చేసే పని ఇంకొకరు చేయలేరు. టెస్టులు చేయాలన్నా, డయాగ్నోసిస్ చేయాలన్నా, ఇంజెక్షన్ చేయాలన్నా, సర్జరీ చేయాలన్నా డాక్టరే చేయాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నా, వాళ్లు ఆ పనిచేయలేరు. ఐఏఎస్కు జబ్బు వచ్చినా మళ్లీ డాక్టర్ దగ్గరికే వస్తారు.
మన మెడికల్ కాలేజీల నుంచి ఏటా వచ్చే 10వేల మంది డాక్టర్లతో తెలంగాణ సమాజానికే కాదు, భారత సమాజానికి బ్రహ్మాండంగా సేవ చేసే అవకాశం కలుగుతుంది. మన పిల్లలు అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్లి సేవలు చేసే అవకాశం లభిస్తుంది.
వైద్యులకు, సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నా
ప్రసవం సమయంలో చాలామంది భయపడుతుంటారు. అందుకే ప్రైవేట్ను ఆశ్రయిస్తూ దోపిడీకి గురవుతుంటారు. దానిని నివారించడంతోపాటు ప్రభుత్వ దవాఖానల్లోనే డెలివరీలు చేసుకునే పరిస్థితి తేవాలని కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి వాహనాలు వంటి పథకాలను పెట్టి ప్రజలను ఆకర్షించాం. వైద్యులు, సిబ్బంది, అధికారుల కృషి ఫలితంగా నేడు చక్కటి ఫలితాలు రాబట్టగలిగినం. మాతామరణాలు 2014లో 92 ఉంటే ఇప్పుడు దానిని 43కు తగ్గించగలిగాం. శిశుమరణాలు గతంలో 39 ఉంటే.. ఇప్పుడు 21కి తగ్గించగలిగాం. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 2014లో కేవ లం 30 శాతం ఉండేది. ఇప్పుడు 76 శాతానికి పెంచుకోగలిగాం. ఐయా మ్ ప్రౌడ్ ఆఫ్ మై డాక్టర్స్, ప్రౌడ్ ఆఫ్ మినిస్టర్స్, ప్రౌడ్ ఆఫ్ మై డిపార్ట్మెంట్.