నిజామాబాద్, అక్టోబర్ ౧౩ (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (౭౭)కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాళి అర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంజులమ్మ గురువారం కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పార్థివ దేహానికి సీఎం నివాళి అర్పించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ సంతోష్తో కలిసి ఉదయం ౧౧.౨౩ గంటలకు వేల్పూర్కు చేరిన సీఎం.. వేముల నివాసానికి వెళ్లి మంజులమ్మ భౌతికకాయం వద్ద పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం ప్రశాంత్రెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. మంత్రి వేములను దగ్గరకు తీసుకొని పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సైతం భావోద్వేగానికి గురయ్యారు. ప్రశాంత్రెడ్డి సోదరి రాధికారెడ్డి, సోదరుడు అజయ్రెడ్డికి ధైర్యం చెప్పారు. అనంతరం హైదరాబాద్కు తిరిగివెళ్లారు. మంజులమ్మ భౌతికదేహానికి నివాళి అర్పించినవారిలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, నిరంజన్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, షకీల్ అహ్మద్, హన్మంతు షిండే, జీవన్రెడ్డి, జాజాల సురేందర్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీలు బీబీపాటిల్, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, ఒలింపిక్స్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ తదితరులు ఉన్నారు.
కాగా, మంజులమ్మ అంత్యక్రియల్లో బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు. జనం తాకిడితో వేల్పూర్ కిక్కిరిసింది. దారి పొడవునా మంజులమ్మ, వేముల సురేందర్రెడ్డిని గుర్తుచేసుకుంటూ గ్రామస్థులు ముందుకు సాగారు. తల్లి అంత్యక్రియల సందర్భంగా ప్రశాంత్రెడ్డి రోదన అక్కడున్నవారికి తీవ్రంగా కలిచివేసింది. ఆయన్ను ఓదార్చటం ఎవరితరం కాలేదు.