ప్రజాస్వామిక దేశాల్లో పార్లమెంటరీ పంథా ద్వారా మాత్రమే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. అయితే నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణను అనుసరిస్తూ అవసరమైన చోట ఉద్యమ పంథానూ కొనసాగించాలి. ఎక్కడ ఆందోళన అవసరమో అక్కడ ఆందోళన చేయాలి. ఎక్కడ రాజకీయాలు అవసరమో అక్కడ రాజకీయంగా తేల్చుకోవాలి.
దేశ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సమస్యల నుంచి కాపాడుకునేందుకు అనుసరించాల్సిన విధి విధానాలు, కార్యాచరణకు సంబంధించి బ్లూప్రింట్ను సిద్ధం చేసుకుందాం. రాష్ట్ర, జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిలో ఫెడరల్ స్ఫూర్తితో సంఘ నిర్మాణాలు చేద్దాం. రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిద్దాం. తెలంగాణ సాధన కోసం సాగిన భావజాల వ్యాప్తిలాగా, రైతుల సమస్యల పరిషార సాధన కోసం కావాల్సిన భావజాలాన్ని దేశమంతటా వ్యాప్తి చేద్దాం.
– ముఖ్యమంత్రి కేసీఆర్
మనం ఇన్నాళ్లూ రైతు సమస్యల పరిషారానికి కేవలం ఆందోళనలు, ఉద్యమాలే శరణ్యం అనుకొని జీవితాలను మార్చే రాజకీయాలను విస్మరించాం. ఇక నుంచీ సీఎం కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే కలిసి నడుద్దాం. ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, దేశ రైతాంగ సమస్యలకు పరిషారాలను సాధించుకుందాం.
– రైతు నేతలు
ప్రగతిభవన్లో ఆదివారం జాతీయ రైతు సంఘాలతో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్, రైతు ప్రతినిధులు; జై కిసాన్ అని నినదిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, భారతీయ కిసాన్ యూనియన్ నేత గుర్నాంసింగ్ చరుణి
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి, జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యల పరిషారం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జమిలి పంథాను అనుసరించే విజయం సాధించామని, రైతాంగ సమస్యలను పరిష్కరించడంలోనూ ఈ తరహా వ్యూహంతో గమ్యాన్ని చేరుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ రైతుసంఘాల నేతలతో ఆదివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రెండవ రోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతునేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. దశాబ్దాలుగా రైతాంగం ఎదురొంటున్న సమస్యలకు వజ్రోత్సవ స్వతంత్ర భారతంలోనూ పరిషారాలు దొరకకపోవడం దురదృష్టకరమన్నారు.
నాడు తెలంగాణ వ్యతిరేకులతో ‘జై తెలంగాణ’ నినాదాన్ని అనిపించినట్టే.. నేడు రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్’ నినాదాన్ని పలికించాలన్నారు. ఆ దిశగా దేశంలోని రైతు సంఘాలన్నీ ఐక్య సంఘటనగా ఏర్పడి, ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్ సూచించారు. ‘ఈ దేశ రైతుకు వ్యవసాయమే జీవన విధానం. రైతు బాగుంటేనే సాగు బాగుంటుంది. వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగుపడుతుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. రైతు మర్యాదను నిలబెట్టి, అన్నదాతల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కలిసి పనిచేద్దామని జాతీయ రైతుసంఘాల నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, అసంబద్ధ విధానాలను తిప్పికొట్టి, వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని జాతీయ రైతు సంఘాల సదస్సు నిర్ణయించింది. దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచీ ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని సీఎం కేసీఆర్ను కోరుతూ సమావేశం ముక్తకంఠంతో తీర్మానించింది. జాతీయస్థాయిలో రైతుల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలంటూ శనివారం చేసిన తీర్మానాన్ని అనుసరించి ఆదివారం కూడా సదస్సులో చర్చ కొనసాగింది. త్వరలో మరోసారి సమావేశమై, రైతు ఐక్యవేదిక విధి విధానాలను రూపొందించాలని సమావేశం నిర్ణయించింది.
ఉద్యమ బ్లూప్రింట్ మీరే తయారు చేయాలి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల దేశీయ వ్యవసాయ రంగం కునారిల్లిపోతున్న ప్రమాదకర పరిస్థితుల్లో.. ఈ సమస్యలకు కారణాలు, వాటి పరిషార మార్గాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా 26 రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్వాతంత్య్రకాలం నుంచీ నేటివరకు దేశంలో జరిగిన రైతాంగ పోరాటాలను, అందుకు నాయకత్వం వహించిన నేతలు, వారు అనుసరించిన విధానాలు, పోరాట రూపాలను సదస్సులో చర్చించారు. నేటి పరిస్థితులకు తగినట్టుగా అవలంబించాల్సిన రైతు ఉద్యమ కార్యాచరణ, పోరాట రూపాలకు సంబంధించిన బ్లూప్రింట్ను తయారు చేసి దేశ రైతాంగాన్ని సంఘటితం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేయాల్సిందిగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు.
జట్టు కట్టి, పట్టు పట్టితే.. సాధించలేనిది లేదు
జట్టుకట్టి పట్టుపట్టితే సాధించలేనిది ఏదీ లేదని, తాను నడిపిన తెలంగాణ ఉద్యమం దీన్ని నిరూపించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ‘రైతన్నలో గొప్ప శక్తి దాగి ఉంటుంది. దాన్ని వెలికి తీయాల్సిన అవసరమున్నది. మన సమస్యలకు పరిషారాన్ని మనమే అన్వేషించాలి. నాకంటే ముందు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. కానీ, ఆయా పరిస్థితులకు తగినట్టు అనుసరించాల్సిన నిర్దిష్ట కార్యాచరణ కొరవడటంతో ఆనాడు లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు పలు రంగాలకు చెందిన మేధావులతో కొన్ని వేల గంటల మేధోమథనం జరిపినం. తెలంగాణ పోరాటాలు విఫలమవడానికి కారణాలను అన్వేషించినం. ఆఖరి పోరాటం ఆగం కాకూడదనే దృఢ సంకల్పంతో మొహమాటాలకు, భేషజాలకు తావు లేకుండా రాజకీయ పంథాను, ఉద్యమ పంథాను సమన్వయం చేసుకుంటూ జమిలి పోరాటాలతో ముందుకు సాగాలనే తుది నిర్ణయం తీసుకోవడం ద్వారా గమ్యాన్ని ముద్దాడినం’ అని రైతు నేతలకు సీఎం కేసీఆర్ వివరించారు.
శాంతియుత పంథాలో పార్లమెంటరీ పోరాటం చేద్దాం
‘ఆనాడు తెలంగాణ ప్రజలను ఇంటింటికీ ఒక యువకుడిని ఉద్యమానికి పంపమని అడిగిన. ఓటు వేయడం ద్వారా తమ శక్తిని చాటే పార్లమెంటరీ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన. వివిధ ఉద్యమ రూపాల ద్వారా ప్రజలను చైతన్య పరిచినం. ఓటు అనే ఆయుధాన్ని ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా మార్చి లక్ష్యాన్ని చేరుకోగలిగాం. రాజకీయాలతో సాధ్యమైతదా? అని అనేకమంది నన్ను ప్రశ్నించారు. కానీ, వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిజం చేసి చూపించిన’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
రైతు నేతలు రాజకీయాల్లో భాగస్వాములు కావాలి
రాజకీయ నిర్ణయాల ద్వారానే ప్రజాజీవితాలు ప్రభావితమవుతాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అందుకు అసెంబ్లీలు, పార్లమెంటులే వేదికలని చెప్పారు. కేవలం ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలీకృతమైనట్టు స్వతంత్ర భారత చరిత్రలో కనిపించదని అన్నారు. రాజకీయాలు చేయడం అంటే నామోషీ అని భావించడం తప్పు అని కేసీఆర్ అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు.
రాజకీయాలంటే అయోమయం అవసరం లేదని కేసీఆర్ రైతు నేతలకు సూచించారు. మొహమాటాల నుంచి బయటపడి, రాజకీయాలనే పవిత్రయజ్ఞంలో భాగస్వాములవ్వాలని.. దేశ రైతాంగ సమస్యల పరిషారానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణను అనుసరిస్తూ అవసరమైన చోట ఉద్యమ పంథాను కూడా కొనసాగించాలని అన్నారు. అయితే పార్లమెంటరీ పంథా ద్వారా మాత్రమే ప్రజాస్వామిక దేశాల్లో ఏ సమస్యకైనా పరిషారం లభిస్తుందన్న విషయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘ఎకడ ఆందోళన అవసరమైతదో అకడ ఆందోళన చేద్దాం. ఎకడ రాజకీయాలు అవసరమో అకడ రాజకీయాలు చేద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మన శక్తిని మనం గుర్తించడంలో వెనుకబడి ఉన్నాం. రాజకీయాల్లో ఉండటం అపవిత్రం అనుకోవడం సరికాదు’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
‘అవ్వల్ దర్జా కిసాన్’లను తయారు చేద్దాం
‘నేను స్వయానా ఒక రైతును. రైతుల కష్టాలు నాకు తెలుసు. వాటిని పరిషరించటం ఎట్లనో కూడా తెలుసు. ఢిల్లీ, హైదరాబాద్ సహా ఉత్తర, దక్షిణ భారతాలను అనుసంధానించేందుకు రైతు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుందాం. ఒక సామాన్య రైతు కూడా దేశ ప్రధానితో దీటుగా చర్చించేలా వారిని తీర్చిదిద్దుదాం. రైతాంగం కోసం ఏకరీతి ఎజెండాతో ఒకేసారి పోరాటాన్ని ప్రారంభిద్దాం. దేశ రైతును ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే అవ్వల్దర్జా కిసాన్గా తయారు చేద్దాం’ అని సీఎం కేసీఆర్ రైతు సంఘాల నేతలకు సూచించారు.
కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే నడుద్దాం
ఓటు అనే బ్రహ్మాస్ర్తాన్ని ఉపయోగించి దేశ రైతాంగ సమస్యలకు పరిష్కారించుకుందామని పంజాబ్, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన సీనియర్ రైతులు సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘మనం ఇన్నాళ్లూ రైతు సమస్యల పరిషారానికి ఆందోళనలు, ఉద్యమాలే శరణ్యం అనుకొని, జీవితాలను మార్చే రాజకీయాలను విస్మరించాం. ఇక నుంచీ కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే కలిసి నడుద్దాం. ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, దేశ రైతాంగ సమస్యలకు పరిషారాలను సాధించుకుందాం’ అని వారు పిలుపునిచ్చారు.
రైతు ఎకరం భూమి కూడా కోల్పోవద్దు
నూతన వ్యవసాయ చట్టాల పేరుతో కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టి, రవాణా చార్జీలను పెంచి, ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తూ, పంటల ఎగుమతులు, దిగుమతుల్లో అసంబద్ధ విధానాలను అవలంబిస్తూ కేంద్రప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని సమావేశం అభిప్రాయపడింది. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి, సన్నకారు రైతుల నోళ్లు కొట్టి, కార్పొరేట్ గద్దలకు వ్యవసాయరంగాన్ని అప్పగించేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని, ఒక ఎకరం కూడా రైతులెవరూ తన భూమిని కోల్పోకుండా కాపాడుకుందామని సమావేశం తీర్మానం చేసింది. రైతు పంటను ఎకడైనా అమ్ముకోవచ్చని నమ్మబలుకుతూ.. మండీలను ఖతం చేయాలనే కేంద్రం కుట్రలను తిప్పికొట్టి, ప్రధాని మోదీతో క్షమాపణలు చెప్పించిన ఘనత రైతాంగానిదేనని పంజాబ్కు సీనియర్ రైతులు పేర్కొన్నారు.
వాస్తవిక భారత నిర్మాణం సీఎం కేసీఆర్తోనే జరగాలి
మోదీ రైతు వ్యతిరేక చర్యలు రైతాంగానికి ప్రమాదకరంగా మారాయని, అలాంటి ప్రమాదం మరోసారి రాకుండా చూడాల్సిన బాధ్యత రైతులపైనే ఉన్నదని తమిళనాడు రైతులు తెలిపారు. ‘దేశం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది.. ప్లీజ్ సేవ్ ఇండియన్ ఫార్మర్స్’ అని సీఎం కేసీఆర్ను అభ్యర్థించారు. వాస్తవిక భారత నిర్మాణం కేసీఆర్ వంటి నాయకుల చేతుల మీదుగానే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఒకే దేశం-ఒకే రైతు సంఘం అనే నినాదంతో అన్ని రాష్ట్రాల రైతులు ముందుకు సాగితే సమస్యలు పరిషారం అవుతాయని, ఈ దిశగా తమను నడిపించాలని దక్షిణాది రాష్ర్టాలకు చెందిన రైతు నేతలు కోరారు.
కేసీఆర్ దార్శనికతతోనే ప్రశాంతంగా తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, కృషి వల్లనే తెలంగాణలో శాంతి పరిఢవిల్లుతున్నదని రైతు ప్రతినిధులు నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఇటీవల పెచ్చరిల్లుతున్న మత విద్వేషాల ప్రభావం తెలంగాణపై, హైదరాబాద్పై పడలేదని తాము గ్రహించామని, ఇది నిజంగా బీజేపీ మతతత్వ శక్తులకు సరైన గుణపాఠంగా నిలిచిందని వారు స్పష్టం చేశారు.
జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దాం
‘రైతు సంఘాల నాయకులందరూ మీ మీ ప్రాంతాలకు వెళ్లిన తర్వాత మనం తీసుకున్న నిర్ణయాలను, అంశాలను మీ సంఘాల నేతలు, రైతులతో చర్చించండి. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోండి. మరికొద్ది రోజుల్లో మరోసారి సమావేశమవుదాం. జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దాం. దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికీ చేరుకునేలా రైతుల ఐక్యతను చాటుదాం. దేశం నలువైపులనుంచీ రైతుల డిమాండ్లను విందాం. జాతీయస్థాయిలో వ్యవసాయ రంగానికి చెందిన శాస్త్రవేత్తలను, ఆర్థికవేత్తలను, పలు రంగాలకు చెందిన మేధావులను, జర్నలిస్టులను పిలిచి, వారందరితో లోతైన చర్చలు, విశ్లేషణలు చేద్దాం. ఆ సమావేశంలో దేశ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సమస్యల నుంచి కాపాడుకొనేందుకు అనుసరించాల్సిన విధి విధానాలు, కార్యాచరణకు సంబంధించిన బ్లూప్రింట్ను సిద్ధం చేసుకుందాం. రాష్ట్ర, జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిలో ఫెడరల్ స్ఫూర్తితో సంఘ నిర్మాణాలు చేద్దాం. రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిద్దాం. తెలంగాణ సాధన కోసం సాగిన భావజాల వ్యాప్తిలాగా, రైతుల సమస్యల పరిషార సాధన కోసం కావాల్సిన భావజాలాన్ని దేశమంతటా వ్యాప్తి చేద్దాం’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
దళితబంధు విప్లవాత్మకం
ఉత్తరప్రదేశ్కు చెందిన రాఘవేంద్రకుమార్ అనే దళిత రైతు క్షేత్రస్థాయి పర్యటనలో దళిత బంధు పథకం అమలు తీరుతెన్నులను తెలుసుకొని వచ్చి సదస్సులో తన అనుభవాలను వివరించారు. అణగారిన దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు ఒక విప్లవాత్మక పథకమని, ఆ మాడల్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమే అయినప్పటికీ.. కీలక నిర్ణయాధికారం అంతా కేంద్రం చేతుల్లోనే ఉన్నదని సమావేశం ఆవేదన వ్యక్తంచేసింది. అధికారంలో దేశ రైతాంగం భాగస్వామ్యం కాకపోతే.. వ్యవసాయాధారిత భారతదేశంలో సంపూర్ణ ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు కానేకాదని సీనియర్ రైతు నేతలు అభిప్రాయపడ్డారు. ఆచార్య వినోబాభావే స్ఫూర్తితో ‘స్వతంత్రదేశంలో స్వతంత్ర గ్రామాలను నిర్మిద్దాం’ అని వారు నినదించారు.
తెలంగాణ రైతు పథకాలు దేశమంతటా అమలు కావాలి
దళిత బంధు సహా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగునీరు తదితర వ్యవసాయ అభివృద్ధి, రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు కేంద్రంలోని పాలకుల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని, కానీ వీటిని దేశవ్యాప్తంగా అమలుపరచడం అనేది చిత్తశుద్ధి ఉంటే సాధ్యమయ్యేదేనని వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.
జాతీయ రైతు సంఘాల నేతలను సన్మానించిన సీఎం కేసీఆర్
రెండురోజుల సదస్సుకు హాజరైన జాతీయ రైతు సంఘాల నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాలతో సతరించారు. దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన సుమారు 100 మంది రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. మూడు రోజులపాటు తెలంగాణలో సాగిన ‘జాతీయ రైతు సంఘాల నేతల పర్యటన’ ఆదివారం సాయంత్రం ముగిసింది. సదస్సులో రైతులతోపాటు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్రావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బాల సుమన్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి భూపాల్రెడ్డి పాల్గొన్నారు.