Hyderabad | నేటికాలంలో దూరం ఎంతైనా ప్రయాణించే కాలమే ప్రామాణికం. హైదరాబాద్ విషయానికొస్తే ఓ వైపు ఔటర్ రింగ్రోడ్డు.. మరోవైపు మెట్రో రైలుతో ప్రయాణం సుఖవంతమైంది. నగరానికే మణిహారంగా మారిన ఔటర్కు తోడు దాని చుట్టూ మెట్రో రైలు ప్రాజెక్టు.. రీజినల్ రింగ్ రోడ్డు రానుండటంతో త్రిమణిహార నగరంగా హైదరాబాద్ అవతరించనున్నది.
సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఇప్పటికే సరిహద్దులు దాటుకొని వడివడిగా విశ్వనగరం వైపు అడుగులేస్తున్న భాగ్యనగరం.. ‘రియల్’ స్వర్గధామంగా మారనున్నది. మెరుగైన ప్రయాణ సౌకర్యాలతో నగర ముఖచిత్రం మారుబోతున్నది. పర్యాటకంగానూ, జీవన ప్రమాణాల పరంగానూ గణనీయ మార్పులు చోటు చేసుకోనున్నాయి. అనువైన రవాణా వ్యవస్థ నేపథ్యంలో నగరం కిలోమీటర్ల మేర శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఆబిడ్స్, బేగంపేట. ఆపై బంజారాహిల్స్, జూబ్లీహిల్స్. మరి ఇప్పుడు నా నక్రాంగూడ, కోకాపేట కూడా. పటాన్చెరు, ఇస్నాపూర్ సైతం హైదరాబాద్ పరిధిలోనే. మేడ్చల్, డీ-పోచంపల్లి మహానగరంలో భాగమైపోయాయి. పసుమాముల, గౌరెల్లి, బొంగళూరు, కందుకూరు… ఇలా చెప్పుకుంటూ పోతే.. అంతా హైదరాబాద్ నగర విస్తరణలో కొమ్మలే. అందుకే హైదరాబాద్ నగరమంటే నిర్వచనమే మారిపోయింది. పట్టణీకరణలో భాగంగా ప్రజల జీవన ప్రమాణాల్లో వస్తున్న గుణాత్మక మార్పులతో హైదరాబాద్ ముఖచిత్రమే ఊహించనిరీతిలో మారిపోతున్నది.
హైదరాబాద్ వేగవంతమైన అభివృద్ధి వెనక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఉన్నారు. ఇ ప్పుడు హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలంటే తెలంగాణకు ముందు.. తెలంగాణ తర్వాత అని మాట్లాడుకోవాల్సి ఉంటుం ది. ఒకప్పుడు హైదరాబాద్ జనాభా 5 లక్షలలోపే. ఇప్పుడు కోటికి మించింది. మొన్నటి వరకు హైదరాబాద్ అంటే నిజాం రాజుల పాలనలో వెలిసిన కట్టడాలే చెప్పుకునేవాళ్లం. మధ్య లో వచ్చిన ఉమ్మడి ఆంధ్ర పాలకులకు అభివృద్ధి అంటే ఒక్క హైటెక్ సిటీనే కనిపించేది. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ అద్భుత పాలనతో సకలరంగాల సమస్త సమగ్ర అభివృద్ధి సమాహారంగా నగరం ఎదిగింది. ఇంతింతై.. వటుడింతై అన్నట్టుగా హైదరాబాద్ అనతికాలంలోనే బ్రహ్మాండంగా విస్తరించింది. నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్.. గంగాజము నా తెహజీబ్కు జై కొడుతూ.. నగర శివార్లను తనలో కలుపుకొని స్నేహపూర్వకంగా మున్ముందుకు సాగుతున్నది. సరిహద్దులు దాటుకొని విశ్వనగరంగా అవతరిస్తున్నది.
జీవన ప్రమాణాల్లో విప్లవాత్మక మార్పులు
మూడు దశాబ్దాలుగా హైదరాబాద్లో ప్రజల జీవన ప్రమాణాల్లో విప్లవాత్మక మార్పు లు వచ్చాయి. సామాన్యుడు మొదలు సెలబ్రిటీ వరకు సొంతింటి అభిరుచుల్లో ‘విశాల’ దృక్ప థం కనిపిస్తున్నది. కొన్నేండ్ల కిందట ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగేశ్వరరావునే తీసుకుందాం. ఆయన తొలుత బేగంపేటలో నివా సం ఉన్నారు. అది నగర నడిబొడ్డు కావడంతో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ వన్ (ఏఎన్ఆర్ కాంప్లెక్స్)లోకి మారిపోయారు. అదికూడా క్రమేణా వ్యాపార జంక్షన్గా మారడంతో జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోలోకి షిఫ్ట్ అయ్యారు. ఆయనే కాదు సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్ కూడా తొలుత జూబ్లీహిల్స్లో ఉండేవారు. అనంతరం మణికొండ పరిధిలోని డాలర్హిల్స్లో ఎకరా విస్తీర్ణంలో నివాసాన్ని ఏర్పా టు చేసుకున్నారు. మరో హీరో, నిర్మాత మోహన్బాబు ఫిల్మ్నగర్ నుంచి జల్పల్లి (శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో) పరిధిలో విశాలమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఏ రంగ ప్రముఖులను పరిశీలించినా విశాలంగా ఉండే ఇంటిలో ఉండాలనే ఆలోచనా దృక్పథం కనిపిస్తున్నది. అందుకే నగరం చుట్టుపక్కల శంకర్పల్లి, కొల్లూరు, మేడ్చల్, ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం.. ఇలా విల్లాలకు డిమాండ్ పెరుగుతున్నది. తొమ్మిదిన్నరేండ్లలో మహా నగర పరిధిలో విల్లాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీలు వేలాదిగా వెలిశాయి.
పెరిగిన కొనుగోలు సామర్థ్యం
జాతీయ, అంతర్జాతీయ కంపెనీలే కాదు.. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లోని ఉద్యోగులు కూడా హైదరాబాద్ భూముల కొనుగోలులో క్రియాశీలకంగా ఉన్నారు. ప్రధానంగా ఆరేడేండ్లుగా నగరంలో భూమి కొనుగోలు శక్తి భారీ ఎత్తున పెరిగిందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. ఐటీ శాఖ అంచనా ప్రకారం.. కేవలం హైదరాబాద్ పరిధిలో ఏడాదికి రూ.3 కోట్లు, అంతకంటే ఎక్కువ ప్యాకేజీ తీసుకునే ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా ఉద్యోగులు మూడు వేలకుపైగానే ఉన్నారని తెలుస్తున్నది. వీరంతా భవిష్యత్తు పెట్టుబడుల్లో భాగంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలోనే ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్ జోన్లలోని నిర్మాణ రంగంలో ఐటీ, ఐటీఈఎస్తోపాటు ఎన్నారైలు కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ ప్ర ముఖ నిర్మాణ సంస్థలు చేపట్టే ప్రతి ప్రాజెక్టులో 40-50 శాతం మంది వీరే ఉంటున్నారని ఒక సంస్థ ఎండీ తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్ పరిసరాల్లో భూములు దొరకడం కష్టమ ని గుర్తించినందునే ఇప్పుడు ఈస్థాయిలో డి మాండ్ వస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ భూములపై పెట్టుబడులు పెట్టేందుకుగాను చేపడుతున్న ఆన్లైన్ శోధనలో ఏకంగా 75 శాతం వరకు ఎన్నారైలే ఉంటున్నారని ఒక సంస్థ అధ్యయనంలో తేలింది.
అంతర్జాతీయ పర్యాటక శోభ…
నదీ తీరాల వెంట వెలిసిన ప్రపంచస్థాయి నగరాలైన లండన్, ప్యారిస్, వియత్నాం.. ప్ర కృతి సిద్ధంగా వచ్చిన వనరులను వినియోగించుకొని అద్భుతమైన పర్యావరణంతోపాటు పర్యాటకంగానూ ఎంతో అభివృద్ధి చెందాయి. విశ్వనగరాల సూచికలో ఈ హంగు కూడా ఒకటి. కానీ హైదరాబాద్ భౌగోళికంగా ఇలాం టి అనుకూలతనే సొంతం చేసుకున్నా.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ ఫలాలను పొందలేకపోయింది. హైదరాబాద్కు వరంగా మూసీ నది ఉన్నప్పటికీ సమైక్య పాలకుల కుట్రలతో ఆ జీవనది మురికికూపంలా తయారైంది. ఒకనాడు మంచినీటికి వినియోగించుకున్న హుస్సేన్సాగర్ గొంతునూ నులిమారు. అందుకే సీఎం కేసీఆర్ వీటికి పునర్జీవం పోసేందుకు గోదావరిజలాల తరలింపు ప్రాజెక్టును చేపడుతున్నారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా నగరానికి ఎగువన ఉన్న ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి గోదావరి జలాలను నింపి తద్వారా నగరంలోని మూసీ నదిని స్వచ్ఛంగా మార్చనున్నారు. ఇందులో భాగంగా బుల్కాపూర్ నాలా ద్వారా హుస్సేన్సాగర్లోకి కూడా గోదావరిని తరలించడం ద్వారా ఆ నీటి వనరు మురికి మకిలీ నుంచి విముక్తి పొందనున్నది. హుస్సేన్సాగర్తోపాటు జంట జలాశయాల్లోనూ బో టింగ్ను ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబా ద్ పరిధిలో పర్యాటకం విరాజిల్లనున్నది.
గతంలో లక్షలాది మంది సామాన్యులు కోర్ సిటీలోనే ఉండేందుకు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు మెరుగైన రవాణా వ్యవస్థ, మౌలిక వసతులతో 15-20 కిలోమీటర్ల పరిధిలో సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. వినియోగదారుల అభిరుచుకులకు అనుగుణంగా హైదరాబాద్ నిర్మాణ రంగంలోనూ వినూత్న మార్పులు వచ్చాయి. గతంలో డబుల్, ట్రిపుల్ బెడ్రూం అంటేనే గొప్పగా ఉండేది. కానీ నగర వెస్ట్జోన్ పరిధిలో ఒక్కో అపార్ట్మెంట్లో వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లకు డిమాండ్ పెరుగుతున్నది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో డీఎస్ఆర్ ట్విన్స్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఏకంగా 15,999 చదరపు అడులు విస్తీర్ణంలో నిర్మిస్తుండటం విశేషం.
ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూముల్లో న్యాయ, చట్టపరమైన చిక్కులు చాలా తక్కువ. తెలంగాణ ప్రభుత్వం ధరణి అమల్లోకి తీసుకువచ్చిన తర్వాత ప్రజల్లో నమ్మకం పెరిగింది. గతంలోనూ తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన ఎన్నారైలు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం సాధారణమే. కాకపోతే ఏడెనిమిదేండ్లుగా హైదరాబాద్ భూముల డిమాండ్ భారీ ఎత్తున పెరుగుతుండటంతో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేశారు.
దూరం చెదిరి.. కాలంతో పోటీ
ఒకప్పుడు పని చేసే ప్రాంతం, నివసించే ప్రాంతానికి మధ్య దూరం ప్రామాణికంగా ఉండేది. ముఖ్యంగా నగరంలో కార్యాలయాలకు చేరువలోనే నివాసం ఉండేవారు. దూర ప్రాంతాల నుంచి రావాలంటే వ్యయ ప్రయాసలుంటాయని ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ మహా నగరంలో దూరం ప్రామాణికం కాదు. అంతర్జాతీయస్థాయి మౌలిక వసతుల పుణ్యమాని… దూరం చెదిరిపోయింది. నగరవాసులు ఇప్పుడు కాలంతో పోటీ పడుతున్నారు. మెట్రో, ఇన్నర్ రింగు రోడ్డు, అవుటర్ రింగు రోడ్డుతోపాటు తొమ్మిదిన్నరేండ్లుగా తెలంగాణ ప్రభు త్వం విస్తృతంగా నిర్మించిన అనుసంధాన రహదారులతో (లింకు రోడ్డు) ప్రయాణం సులువుగా మారింది. అందుకే ఇప్పుడు ‘రన్ టైం’ ప్రామాణికమైంది. సాధారణ ఉద్యోగి మొదలు విదే శీ ప్రతినిధుల వరకు చేరుకునే గమ్యాన్ని రన్ టైం ప్రాతిపదికన అంచనా వేసుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 15 నిమిషాల ప్రయాణం… అవుటర్ రింగు రోడ్డు నుంచి కేవలం 10 నిమిషాల ప్రయాణం… అనే లెక్కలపై మహా నగర జీవనయానం సాగుతున్నది.