పంట పెట్టుబడి కోసం ఏ ఒక్క రైతు బాధపడొద్దు, అప్పు చేయొద్దు. పెట్టుబడి గోస తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది. ఈ పథకం దేశ వ్యవసాయరంగంలో సువర్ణాధ్యాయం, దేశానికి దిక్సూచి. కేసీఆర్ ఉన్నంతవరకు రైతుబంధు ఆగదు. రైతులకు పెట్టుబడి సాయం ఆగదు.
– 2018 మే 10న శాలపల్లిలో రైతుబంధు పథకం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్
Rythu bandhu | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రైతులకు పెట్టుబడి గోస తీర్చుతూ, దేశ వ్యవసాయరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన రైతుబంధు పథకం కీలక మైలురాయిని చేరుకొన్నది. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి బుధవారానికి ఐదేండ్లు పూర్తయ్యాయి. రైతులకు పంట పెట్టుబడి గోస తీర్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి ప్రాణం పోశారు. 2018, మే 10వ తేదీన కరీంనగర్ జిల్లా శాలపల్లిలో ఈ పథకాన్ని సీఎం ప్రారంభించారు. నాటి నుంచి నేటివరకు ప్రతి పసల్ (సీజన్)లోనూ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు.
గతంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుందంటే రైతులు పంట పెట్టుబడి కోసం అనేక తిప్పలు పడాల్సి వచ్చేది. ప్రైవేటు వ్యాపారులను, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలతో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టే దారుణ పరిస్థితి ఉండేది. రైతుల గోసను తెలంగాణ ఉద్యమ సమయంలో దగ్గరినుంచి చూసిన కేసీఆర్.. ఆ బాధల నుంచి విముక్తి కల్పించేందుకు పరితపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ఆయన సీఎం పదవి చేపట్టగానే ఇందుకోసం మేధోమథనం నిర్వహించి రైతులకు ప్రభుత్వమే నేరుగా పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. అలా పుట్టిందే రైతుబంధు పథకం. రైతుబంధుతో రైతుల్లో భరోసా పెరిగింది. గుంట భూమి ఉన్న రైతులు కూడా గుండె ధైర్యంతో బతికే పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలుత ఈ పథకం కింద ప్రతి సీజన్లో ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు సీజన్లలో ఎకరానికి రూ.8 వేలు పంపిణీ చేశారు.
ఏడాది తర్వాత దీన్ని రెండు విడుతల్లో ఏకరాకు రూ.10 వేలకు పెంచారు. ప్రతి సీజన్లోనూ సుమారు 65 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు ప్రతి ఎకరానికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు.. ఈ విధంగా గత ఐదేండ్లలో మొత్తం 10 విడుతల్లో రూ. 65,192 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమ చేసింది. ఒక్క పథకం ద్వారా రైతులకు ఇంత భారీ మొత్తం అందించిన ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ మాత్రమే కావడం గమనార్హం. రైతుబంధు కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది.
సీఎం కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి వ్యవసాయరంగం, రైతుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం. ఈ రెండింటి తర్వాతే మరేదైనా అని సీఎం కేసీఆరే చాలాసార్లు చెప్పారు. ఇందుకు రైతుబంధు అమలే ఉదాహరణ. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సీజన్కు ముందు రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు పడాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం అవసరమైన నిధులను ముందుగానే సమకూర్చుతున్నది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు సీజన్కు ముందే రైతుబంధు డబ్బులు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్టుబడి సాయం ఆగకుండా కొనసాగుతూనే ఉన్నది. రైతుబంధు పథకం అమలులో భాగంగా తొలి ఏడాది రైతులకు పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో ప్రభుత్వం అందించింది. అయితే ఇందులో మధ్యవర్తుల ప్రమేయం ఉండొద్దని భావించిన సీఎం కేసీఆర్.. చెక్కుల పంపిణీకి స్వస్తి పలికి నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బు జమయ్యేలా చర్యలు తీసుకొన్నారు. దీంతో సీజన్కు ముందే రైతుల ఫోన్లు టింగ్.. టింగ్ అని మోగుతున్నాయి.
రైతుబంధు పథకం అమలు సమయంలో ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. ఎలాంటి పరిమితులు, షరతులు లేకుండా అమలు చేయడం ఏంటని ప్రశ్నించాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోలేదు. ‘రైతు’ అనే పదాన్నే అర్హతగా తీసుకున్నారు. గుంట భూమి ఉన్న రైతు నుంచి ప్రభుత్వ సీలింగ్ వరకు భూమి గల వారందరికీ రైతుబంధును వర్తింపజేశారు. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులైనా, పన్నులు చెల్లించే వారైనా, వ్యాపారులైనా.. సరే ఎలాంటి షరతులు లేకుండా పథకాన్ని వర్తింపజేశారు.
రైతుబంధు పథకం ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని అనేమంది ఆర్థికవేత్తలు ప్రశంసించారు. ఈ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు అనేక రాష్ర్టాలు కాపీ కొట్టి వివిధ పేర్లతో అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్’ పేరుతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నది. క్రిషక్ బంధు పేరుతో పశ్చిమబెంగాల్, కాళియా పేరుతో ఒడిశా, రైతుభరోసా పేరుతో ఆంధ్రప్రదేశ్, ఆశీర్వాద్ యోజన పేరుతో జార్ఖండ్, రాజీవ్గాంధీ కిసాన్ నవ్య యోజన పేరుతో ఛత్తీస్గఢ్ రాష్ర్టాలు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్థాయిలో మాత్రం పెట్టుబడి సాయం అందించటంలేదు.
రైతుబంధు పథకానికి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నది. దేశంలోని రైతులంతా ఈ పథకానికి ఆకర్షితులవుతున్నారు. రైతుబంధు తరహా పథకాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని అనేక రాష్ర్టాల రైతులు అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ర్టాల్లో పోరాటాలు కూడా ప్రారంభమయ్యాయి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ పేరుతో దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్.. ఆయా రాష్ర్టాల్లో రైతుబంధును అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నది. ఆయా రాష్ర్టాల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుబంధుతోపాటు రైతు సంక్షేమ పథకాలన్నింటిని అమలు చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రైతుబంధు పథకం అమలుతీరుపై ప్రపంచ ఆర్థిక, వ్యవసాయ నిపుణులు ప్రశంసలు కురిపించారు. ఒక దశలో ఈ పథకం అమలు తీరును చూసి వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి అనుబంధ ప్రపంచ ఆహార సంస్థ (ఎఫ్ఏవో) రైతుబంధు పథకాన్ని ప్రపంచ వ్యవసాయరంగంలో ప్రత్యేకమైనదిగా గుర్తించింది. హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్, గాంధేయవాది అన్నాహాజారే, అశోక్ గులాటీ, అరవింద్ సుబ్రహ్మణ్యన్, ఎఫ్ఏవో డీజీ జోస్ గ్రాజియానో డిసిల్వా వంటి ఎంతో మంది మేధావులు ఈ పథకాన్ని ప్రశంసించారు.
రైతుబంధు పథకం తెలంగాణ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. వ్యవసాయరంగ రూపురేఖల్ని మార్చేసింది. రైతుబంధుతో రైతుల్లో భరోసా పెరిగింది. పెట్టుబడి నష్టమనే భావన లేకుండా రైతులు ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా వంటి కార్యక్రమాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. తద్వారా 2014-15లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే, 2022-23లో ఇది 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో 15వ స్థానం రెండో స్థానానికి ఎగబాకింది.