Telangana | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘ప్రజల మనసు గెలిచి తీరాల్సిందే.. మూడోసారీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. కేసీఆర్ను మూడోసారీ ముఖ్యమంత్రిగా చూడాల్సిందే.. ఇదీ బీఆర్ఎస్ శ్రేణుల్లో రగిలిన ఉద్యమస్ఫూర్తి. ఈ హ్యాట్రిక్ మంత్రతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఊరూరా విస్తృత కార్యాచరణను అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు భేషజాలను పక్కనబెట్టి ఎన్నికల ప్రచార కదనరంగంలో ముందుకు సాగుతున్నారు. ఎక్కడికక్కడ కథానాయకులై కదులుతున్నారు. విద్యార్థి, యువజన, రైతు, మహిళా, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సహా సమస్త బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు ప్రజలతో మమేకం అవుతున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు రోడ్షోలు, కార్నర్ మీటింగ్లతో అన్ని నియోజకవర్గాలు ఎన్నికల ప్రచార కోలాహాలాన్ని తారాస్థాయికి చేర్చుతున్నాయి. వీటికి కొనసాగింపుగా పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, ఎవరికి వారు తామే అభ్యర్థులం అన్నట్టుగా ప్రచార రంగంలోకి దూసుకుపోతున్నారు. అన్నివర్గాల ప్రజలను కలిసి గడచిన తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటా వివరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలో విద్యార్థులు, యువకులు, మహిళలు వినూత్న ప్రచారంతో ప్రతి మనిషికి అవగాహన కల్పిస్తున్నారు.
‘మేము ఎన్నికలప్పుడే మీ దగ్గరికి వచ్చేవాళ్లం కాదు. మీ రెక్కళ్ల బొక్కల పెరిగినోళ్లం. మీ కష్టసుఖాల్లో భాగమైనోళ్లం.. మరోసారి మమ్మల్ని ఆశీర్వదించండి’ అంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రజల మనసులు గెలుస్తున్నారు. నియోజకవర్గం అంతా కలియతిరుగుతూ, అన్ని వర్గాలను పేరుపేరునా పలకరిస్తున్న తీరుకు ప్రజలు ముచ్చపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు తమ వాడకు, తమ ఇండ్లకు వస్తున్నప్పుడు మంగళహారతులు పట్టి ఊరూరా ప్రజలు స్వాగతిస్తున్నారు. ‘ఇన్ని చేసిండ్లు ఇన్నేండ్లు మాతోనే ఉన్నరు. ఓట్లప్పుడు వచ్చిపోయేవాళ్లను మేమెందుకు పట్టించుకుంటాం’ అని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు భరోసా ఇస్తూ అన్నివర్గాల ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మంత్రులు వారు పోటీచేస్తున్న నియోజకవర్గాలతోపాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లోనూ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఎన్నికల ప్రచారానికి ఈ నెల 28వ తేదీ తుదిగడువు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. ఈ తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రొగ్రెస్ కార్డు రూపంలో కరపత్రాలు పంచుతూ ఇంటింటికీ తిరుగుతున్నారు. మనిషి మనిషిని కలుస్తున్నారు. నియోజకవర్గంలో వివిధ వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులను నేరుగా కలుసుకుంటున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రభుత్వం అందించిన ఆసరా పథకాలను కండ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. నియోజకవర్గంలో స్థానికంగా వివిధ సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులను ఉదాహరణగా చూపుతూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొన్నిచోట్ల వినూత్నంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.