వరంగల్ : సీఎం కేసీఆర్(CM KCR) కార్మికుల పక్షపాతిగా పని చేస్తున్నారని, సఫాయిల వేతనాలు పెంచిన ఘనత ఆయదేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli, ) అన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం మొరిపిరాల, క్రాస్ రోడ్డు వద్ద, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని అతిథి గృహం వద్ద సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన మే డే (May Day)ఉత్సవాలలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం(Privatization) చేస్తుందని ఆరోపించారు. వాటిని అంబానీ(Ambani), అదానీ(Adani)లకు అప్పగించి, కార్మికుల పొట్ట కొడుతుందని దుయ్యబట్టారు. భవన నిర్మాణ కార్మికులకు భవనాలు, వాహనాలు ఇవ్వాలని నిర్ణయించారని వెల్లడించారు. కార్మికుల వేతనాలు పెంచుతూ వారికి ఆత్మగౌరవంగా నివసించే అవకాశం కల్పిస్తున్నారని అన్నారు.
కేంద్రంలోని మతతత్వ బీజేపీ(BJP)ని గద్దె దించేవరకూ కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ నాయకుడు తమ్మెర విశ్వేశ్వరరావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి తొర్రూరు మండలం దుబ్బతండాలో దుర్గమ్మ పండుగ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు చేశారు. కొడకండ్ల మండలం రేగుల గ్రామంలో జరిగిన ముత్యాలమ్మ ఉత్సవాలు, శివాలయంలో లింగ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.