హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): మునుగోడులో కారు జోరు మీదున్నది.. ఓటర్ల నుంచి టీఆర్ఎస్ పార్టీకి వస్తున్న స్పందనతో గులాబీ దళ నాయకుల్లో హుషారు కనిపిస్తుంది. మరో వారం రోజులే గడువున్న నేపథ్యంలో ప్రచార వేగాన్ని మరింత పెంచాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 30న చండూరు లో నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభతో ప్రచారం తారస్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రచార వ్యూహంతో ప్రత్యర్థులు ఇప్పటికే చేతులెత్తేసే స్థాయికి వచ్చారు. ఇదే తరహాలో ప్రచారాన్ని కొనసాగించి పార్టీ అభ్యర్థికి ఘన విజయం అందించేలా పకడ్బందీ వ్యూహంతో టీఆర్ఎస్ శ్రేణులు ముందుకెళ్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ముగింపునకు కౌంట్డౌన్ మొదలయ్యింది.
నవంబరు 3న జరుగనున్న ఎన్నికకు నవంబర్ 1 సాయంత్రం ప్రచార గడువు ముగుస్తుంది. మునుగోడు ఎన్నికలో పార్టీ విజయానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో పకడ్బందీ వ్యూహాన్ని, పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఇలా అన్ని వర్గాల వారిపై దృష్టి పెట్టి ప్రతి ఓటూ కీలకమైనదనే అంచనాతో కట్టుదిట్టంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకుల ఇంటింటి ప్రచారానికి, కేటీఆర్ రోడ్షోలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన నాయకులు హుషారుగా ఉన్నారు. ఎన్నికల ప్రచారం గడువు ముగిసే నాటికి మిగిలిన మండలాల్లో కేటీఆర్ రోడ్ షోలు పూర్తి చేయాలని నిర్ణయించారు. బీజేపీ అభ్యర్థి కాంట్రాక్టు కోసమే పార్టీ మారారని, అనవసరపు ఉపఎన్నిక అని, నియోజకవర్గానికి ప్రధానమైన సమస్య అయిన ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చూపిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు వివరిస్తున్నారు.
నాయకులు ఒకవైపు ఇలా ఉద్ధృతంగా ప్రచారం నిర్వహిస్తుంటే, మహిళా నాయకులు, విద్యార్థి విభాగం బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో మహిళల్ని కలుస్తూ, బొట్టుపెడుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టీఆర్ఎస్వీ నాయకులు 30 బృందాలుగా ఏర్పడి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి ఓటరును రాష్ట్రస్థాయి నాయకులు కలుస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు.
స్థానికంగా నివాసం ఉండే వారినే కాకుండా మునుగోడు నియోజకవర్గంలో ఓటు ఉండి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఫోన్ నంబ ర్లు తీసుకొని టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రతి ఒక్కరు ఓటింగ్ రోజున నియోజకవర్గానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను చాటాలని కోరుతున్నారు. ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొనేలా చేయ డం ద్వారా టీఆర్ఎస్కు మరింత ఎక్కువ మె జార్టీ సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగా ఇతర ప్రాంతాల ఓట్లపైనా ఎక్కువ దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ పార్టీకి గౌడ సంఘం నాయకులు, లారీ యజమానుల అ సోసియేషన్, వివిధ కులసంఘాల నాయకులు, వృత్తి సంఘాల నాయకులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోనూ వారు పాల్గొంటుండటం విశేషం.