KCR | అంబేద్కర్ను అవమానిస్తే మౌనం పాటిద్దామా? దళితబంధు బంద్పెడితే నోరుమూసుకొని పడి ఉందామా? ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్లకు సురుకుపెట్టాలి.. బిడ్డా మోసం చేస్తే పడగొడుతమని జవాబు చెప్పాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో జరిగింది. సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సోదరులను కోరుతున్నా. ఏం జరుగుతుంది నాలుగు నెలల సమయంలో..? ఇప్పుడు ఐదో నెలకొచ్చింది ప్రభుత్వం వచ్చి. మీకు మేం ఎంత గౌరవం ఇచ్చినం’ అన్నారు.
‘ఎన్నికలు వస్తే పిచ్చోళ్లలా ఓట్లు వేయొద్దు. నిలకడగా ఆలోచన చేయాలి. నిజానిజాలు తెలుసుకోవాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. మొన్న వాళ్లు ఆగమాగం హామీలు నెరవేర్చాలంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో సురుకుపెట్టి చూపెడితెనే అవన్నీ సాధ్యమవుతయని అందరికీ తెలియజేస్తున్నా. ఇవన్నీ మీకు కనపడడం లేదా? నేనే చెప్పాలా? ఉద్యోగులను ఎంత గౌరవించాం. ఎంత జీతం ఇచ్చాం.. ఇంతపెద్ద పీఆర్సీలు ఇచ్చాం. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లా ఇచ్చాం. ఇవన్నీ మరిచిపోయి ఇవాళ ఆగమాగమై అడివడివైతమంటే మీరే నష్టపోతారు. బీఆర్ఎస్ పార్టీ కాదు. మీకు బుద్ధి, తెలివితేటలు, గౌరవం ఉంది. కాబట్టి చెక్ బ్యాలెన్స్ చేయాలని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కోరుతున్నాను. మేధావులుగా ఆలోచించాలి.. గవర్నమెంట్కు ముకుతాడు వేయాలని మనవి చేస్తున్నా’అని అన్నారు.
‘ఎక్కడికి పాయె మన కరెంటు. తొమ్మిదేళ్లలో కన్నురెప్ప కొట్టినంత సేపు కరెంటు పోయిందా? ఇవాళ పోతుందా? ఇట్లే పోవాలా? ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. మెదక్లో వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్లో అనిల్ గెలిస్తేనే.. ఎల్పట, దాపట కోడెల్లా ఉన్నరు. ఇద్దరూ చదువుకున్నోళ్లు. ఒకాయన ఐఏఎస్ అధికారి. ఇంకొకాయన తెలంగాణ ఉద్యమకారుడు. బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కుపిండి మీ హక్కులు సాధించాలంటే వారిని గెలిపించాలని కోరుతున్నా’నని కేసీఆర్ అన్నారు.