దుబ్బాక (సిద్దిపేట) : ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణలో వచ్చేది కేసీఆర్ సర్కారేనని మెదక్ ఎంపీ , బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి(MP Kotha Prabhakar Reddy) ధీమాను వ్యక్తం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు డప్పు శివరాజుతో పాటు దుబ్బాక నియోజకవర్గంలోని రెండు వందల మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు(MRPS Members) బీఆర్ఎస్(BRS)లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎంపీ మాట్లాడుతూ కేవలం తొమ్మిదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్వన్గా నిలిచిందని అన్నారు. 70 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓట్ల కోసం తప్పా దళితుల గురించి పట్టించుకోలేదన్నారు. దేశంలో దళితుల సంక్షేమం(Dalit Welfare) కోసం పని చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సర్కారేనని స్పష్టం చేశారు. దళితబంధు పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటిని సీఎం కేసీఆర్(CM KCR) తిప్పి కొడుతూ దశలవారీగా అమలుచేసి దేశానికి స్ఫూర్తిగా నిలిచారని గుర్తుచేశారు.
తెలంగాణ తరహా అభివృద్ధి,సంక్షేమ పథకాలు దేశంలో అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల్లో కీలకంగా మార్చారన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అసత్య ప్రచారంతో ప్రజలను మోసగించిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై గ్రామాల్లో నిత్యం చర్చ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు గుర్రాల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు రణం శ్రీనివాస్, కరికే శ్రీనివాస్, ర్యాకం శ్రీరాములు పాల్గొన్నారు.