Mahmood Ali | ఖమ్మం, నవంబర్ 16: కాంగ్రెస్లో ఇరవై మంది సీఎం అభ్యర్థులున్నారంటూ ఆ పార్టీ నేతలే చెప్పుకుంటుండటం సిగ్గుచేటని హోంమంత్రి మహమూద్ అలీ విమర్శించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని దుయ్యబట్టారు. అలాంటి పార్టీతో అభివృద్ధి సాధ్యమా? అని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదని, తొలుత ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని విమర్శించారు. పూర్తి ఆర్ఎస్ఎస్ భావజాలమున్న రేవంత్కు తెలంగాణ ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ సీఎం అభ్యర్థి కేసీఆరేనని స్పష్టం చేశారు.
ప్రతి విషయానికీ ఒంటికాలిపై లేస్తున్న కాంగ్రెస్ నాయకులు మొదట వారిని వారు సమీక్షించుకోవాలని మహమూద్ అలీ హితవుపలికారు. గురువారం ఖమ్మంలో పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ముస్లింలకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే మైనార్టీలకు అనేక ప్రయోజనాలు చేకూరాయని అన్నారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అనే భావనతోనే తాను కరీంనగర్లో మాట్లాడానని, ముస్లిం మైనార్టీలను తప్పుపట్టలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించడం విచారకరమని అన్నారు. రవాణా మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.